పెద్దపల్లి, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): ఎఫ్సీఐకి బియ్యం అప్పగించని రైస్ మిల్లులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్లాల్ వివరాలు వెల్లడించారు. మంథని మండలం కూచీరాజ్పల్లిలోని వెంకటసాయి, మారుతీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులు ప్రభుత్వానికి నష్టం కలిగించాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మంథని ఠాణాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశా రు. వెంకటసాయి ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్లు బోడ సంపత్ రెడ్డి, సీహెచ్ అశోక్ కుమా ర్, పార్ట్నర్లు బోడ సరోజన, సీహెచ్ స్వర్ణలతపై, అలాగే మారుతీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు మేనేజింగ్ పార్ట్నర్ బీ ప్రకాశ్రావు, పార్ట్నర్లు బీ వరప్రసాదరావు, ఎం సుమన్ కుమార్పై మంథని పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 409, 420 కింద కేసు బుక్ చేశారు.
20 22-23 వానకాలం సీజన్కు సంబంధించి వెంకటసాయి ఇండస్ట్రీస్ 8,50,88, 152 విలువైన 27,876.05 క్వింటాళ్ల సీఎంఆర్ రైస్, మారుతీ ఇండస్ట్రీస్ 21,64,05, 173 విలువైన 70,893.56 క్వింటాళ్ల సీఎంఆర్ రైస్ను ఎఫ్సీఐకి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించిన ప్రతి ఒకరిపైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం నిందితుల ఆస్తులు జప్తు చేసి వేలం వేసి ప్రభుత్వ నష్టాన్ని భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.