హుజూరాబాద్, మార్చి 22: జలం ప్రాణికోటికి జీవనాధారమని, ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, నీటి ప్రాముఖ్యతను వివరించారు. ఇండ్లల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని ప్రతి నీటి బొట్టునూ సంరక్షించాలని కోరారు. మండలంలోని పోతిరెడ్డిపేటలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిని ఎలా పొదుపు చేయాలో బాలవికాస సంస్థ ప్రతినిధులు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పుల్లాచారి, ఎంపీటీసీ మంతెన శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వాటర్ కమిటీ సభ్యులు, బాలవికాస ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సైదాపూర్, మార్చి 22: సైదాపూర్ మండలంలోని వెన్నపంల్లి, లస్మన్నపల్లి గ్రామాల్లో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ, భూగర్భ జలాలను ఎలా పెంచుకోవచ్చో వివరించారు. కార్యక్రమంలో వెన్నంపల్లి సింగిల్విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, జిల్లా భూగర్భ శాఖ అధికారి శైలశ్రీ, అసిస్టెంట్ హెడ్రో జియాలజిస్టు సుజాత, వెల్ఫేర్ సొసైటీ సీఈవో రాజశేఖర్రెడ్డి, సర్పంచులు అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, కాయిత రాములు, ఏఈవో రజిత, కార్యదర్శులు పోరెడ్డి నరేందర్రెడ్డి, శ్రీలక్ష్మి, అతివ ఎన్జీవో ప్రతినిధి దీప్తి, సఖీ సెంటర్ ప్రతినిధి లక్ష్మి, జిల్లా వలంటరీ సొసైటీ కార్యదర్శి ప్రశాంత్, భూమిక ఫౌండేషన్ ప్రతినిధి వాసవి పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, మార్చి 22: మండలంలోని మాచనపల్లి గ్రామంలో బాల వికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు పాఠశాలలో నీటి వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సర్పంచ్ బొజ్జం కల్పనా తిరుపతిరెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, బాల వికాస ప్రతినిధి పబ్బు సులోచన, బాల వికాస గ్రామ కోఆర్డినేటర్లు సుమలత, సరోజన, మహిళా వార్డు సభ్యులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.