సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 28: గల్ఫ్ బాధితులకు అండగా ఉంటానని, వారి ఉపాధికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలోనే అనేక ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఎక్కడికో పోయి ఇబ్బందులు పడే కంటే, ఇక్కడే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబాలతో సంతోషంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా గల్ఫ్ బాధితులకు ఆదుకోవాలని, ఆదుకుంటామని కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని సూచించారు.
దుబాయ్ జైలులో పద్దెనిమిదేండ్లు మగ్గిపోయి, కోర్టు క్షమాభిక్షతో ఇటీవలే పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవి, కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్, మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు విడుదలయ్యారు. బుధవారం వారు తమ కుటుంబాలతో కలిసి పెద్దూర్లోని మల్లేశం, రవి ఇంటికి రాగా, కేటీఆర్ అక్కడకు వెళ్లి పరామర్శించారు. వారిని ఆప్యాయంగా పలుకరించి, యోగక్షేమాలను తెలుసుకున్నారు. బాధితులు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు తనవంతుగా సాయం చేస్తానని భరోసానిచ్చారు.
తాము అధికారంలో ఉన్న టైంలో కరోనా రావడంతో గల్ఫ్ పాలసీ చేయలేకపోయామని చెప్పారు. నకీల ఏజెంట్ల చేతిలో మోసపోయి, కల్లివెల్లి అయి దేశంకాని దేశంలో ఇబ్బందులు పడుతున్న కార్మికులు, సోదరులు ఆలోచించాలని, స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో భూమి ఉన్నా నాలుగైదు దశాబ్దాలుగా నీళ్లు లేక, సరైన ఉపాధి లేక భార్యా పిల్లలను విడిచి ఎంతో మంది ఎడారి దేశం పోతున్నారని, ఎన్నో ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలోనే తెలంగాణలో వ్యవసాయం బాగైందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో..? వారందరికీ మా సిరిసిల్లలోని నలుగురు సోదరులు, జగిత్యాలలోని ఒక సోదరుడి జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పారు. ఈ ఐదుగురు ఓ కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యారని, ఈ విషయం దివంగత జర్నలిస్టు తవుటు నాగభూషణం, కాయితి బాలు ద్వారా తనకు తెలిసిందని గుర్తు చేసుకున్నారు. 2011-12 ప్రాంతంలో తాము అధికారంలో లేమని, అయినా వారి విడుదలకు సిన్సీయర్గా ప్రయత్నించామని చెప్పారు. మంద బీంరెడ్డి, నారాయణస్వామితో కలిసి నేపాల్ వెళ్లి సదరు సెక్యూరిటీ గార్డు కుటుంబానికి బ్లడ్ మనీ 15లక్షలు కూడా చెల్లించామని చెప్పారు.
పరిహారం ఇచ్చిన వెంటనే విడుదలవుతారని ఆశించామని, కానీ, దురదృష్టవత్తూ అక్కడి చట్టాల్లో మార్పుతో ఆలస్యమైందన్నారు. కానీ, వారి విడుదలకు దుబాయ్లోని నాయకులు, రాదారం సత్యం, జువ్వాడి శ్రీనివాసరావు, న్యాయవాది అనురాధ, అక్కడి న్యాయవాదులు ఎంతో సహకరించారని చెప్పారు. ఇంకా ఏడేండ్ల జైలు శిక్ష ఉన్నా ముందే విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. జైలు బాధితులు రవి, మల్లేశం, హన్మంతు, లక్ష్మణ్కు స్వాగతం పలుకుతున్నామని, ఇక్కడే ఏదో ఒక పనిచేసుకొని కుటుంబాలతో హాయిగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎరవెల్లి వెంకటరమణారావు, బొల్లి రామ్మోహన్, ఫ్యాక్స్ చైర్మన్ జీల కిషన్ యాదవ్, కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, భూక్య రెడ్యానాయక్, బీఆర్ఎస్ నేతలు గండ్ర రమేశ్రావు, తిరుపతినాయక్, దేవయ్య, షేక్ అలీ, నారాయణగౌడ్, లడ్డుబాయి ఉన్నారు.