హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సంక్షేమ పథకాల ( Welfare schemes ) పట్ల అనుసరిస్తున్న దగాకోరు విధానాల వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలపై హైకోర్టు ( High Court ) స్టే విధించిందని ఆరోపించారు.
పేద వర్గాలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే దుర్బుద్ధితో, నిధులను ఎగ్గొట్టే కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోర్టు వ్యవహారాల్లో అలసత్వం వహించిందని విమర్శించారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామని గతంలో అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేసినప్పటికీ, న్యాయస్థానం పలుమార్లు అవకాశం ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని ధ్వజమెత్తారు.
గత ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆర్థిక సాయంతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని రంగుల హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తులం బంగారం ఇవ్వకపోగా పథకాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజాదరణ పొందిన పథకాలను పూర్తిగా రూపుమాపే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి నాటకాలకు తెరలేపుతోందని దుయ్యబట్టారు.
2014 నుంచి బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు రూ. 13 వేల కోట్లకు పైగా వెచ్చించి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలిచామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తును వీడి, వచ్చే విచారణ గడువైన సెప్టెంబరు 9 లోగా ఉన్నత న్యాయస్థానంలో బలమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే చట్టసభల ద్వారా ప్రత్యేక చట్టబద్ధత కల్పించి స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలోనూ, చట్టసభల్లోనూ పోరాడుతుందని హెచ్చరించారు.