సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం విజయవంతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీచ్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్నం 12:50 గంటలకు సిరిసిల్లకు చేరుకున్న కేటీఆర్, అక్కడే ఏర్పాటు చేసిన సభావేదికపై కార్యకర్తలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కేటీఆర్ వాహనం నుంచి దిగగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. సభా వేదిక వరకు వెళ్లే దాకా సెల్ఫీలు దిగారు. అనంతరం వేదిక నుంచి కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో ఆచరించాల్సిన కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగానికి కార్యకర్తల నుంచి విశేష స్పందన వచ్చింది.
అత్యధిక సభ్యత్వాలు కలిగిన బీఆర్ఎస్ రానున్న వరుస ఎన్నికల్లో విజయపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ‘అధికారం పోయింది కానీ, పోరాటం ఆగదని, ఇపుడు మన పార్టీకి ఏం జరగలేదు. ఆగం కావద్దు’ అంటూ చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తల్లో ధైర్యం నిండింది. అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు, ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా అనడంతో చప్పట్లతో సభాప్రాంగణం మార్మోగింది. రాజకీయల్లో తాను ఉన్నన్ని రోజులు సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తానని, తాను సిరిసిల్లను విడిచిపెట్టి వేరే దగ్గర పోటీ చేస్తానని వస్తున్న వార్తలు నమ్మవద్దని ప్రకటించడంతో ‘అందరూ జై కేటీఆర్’ అని నినదించారు.
తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలందరినీ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 14 ఎండ్లు ఉద్యమంలో, పదేండ్లు అధికారంలో నడించిందని, ప్రస్తుతం కారు సర్వీసింగ్కు మాత్రమే వెళ్లిందని, ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, మళ్లీ మనమే వస్తామని కార్యకర్తలకు భరోసా కల్పించారు. కేసీఆర్ పాలనలో దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఏమనుకుంటున్నారో..? మీ అందరికీ తెలుసునని, కరెంటు పోగానే కేసీఆర్ చెప్పింది నిజమైందని, కేసీఆర్ చెప్పినట్టు వినకపోతిమని అనుకుంటున్నారని వివరించడంతో నిజమేనని కార్యకర్తలు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సును స్వాగతిస్తున్నామని, కానీ దీనివల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, బస్సుల సంఖ్య పెంచి, ఆటో డ్రైవర్ల ఉపాధికి ప్రభుత్వం అలోచించాలని అనడంతో ‘అవునంటూ’ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతోనే ఓటమి చెందామని, ఈ ఫలితాలతో ఆగం కావద్దని, కార్యకర్తల, పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలకు గురికావద్దని హితబోధ చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని అనుకోలేదని, అందుకోసమే అలవిగాని హామీలను ప్రకటించి ఆగమవుతున్నదని అనడంతో నిజమేనని అందరూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలను కించపరిచేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని సూచించారు.
ప్రజల పక్షాన ప్రశ్నించే పదునైన గొంతుక కేసీఆర్కు తప్ప ప్రపంచంలో మరెవరికీ లేదనడంతో అందరూ కరతాళధ్వనులు చేశారు. సీఎం రేవంత్రెడ్డి వంటి తీస్మార్కాన్లు ఎంతోమందిని కేసీఆర్ చూశారని అనడంతో అందరూ అందరూ జతకట్టారు. గులాబీజెండా లేకుంటే తెలంగాణ లేదని, కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి అని ప్రసంగించడంతో కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ నినదించారు. త్వరలో జిల్లా కమిటీలను ప్రకటిస్తామని, పనిచేసే వారికి పార్టీ పదవులు ఇస్తామనడంతో చప్పట్లతో స్వాగతించారు. పత్రికల్లో మన వాదన వినిపించడానికి, అధికార ప్రతినిధులను నియమించుకుందామని ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడుదామనే పిలుపునకు కార్యకర్తలు అంతా మద్దతు పలికారు.
పార్టీని వీడిపోయే వారిని పోనివ్వండి.. పార్టీలో ఉన్న వారిని చురుగ్గా తయారు చేసుకుందామని అనడంతో సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. ‘ఎన్నికల్లో నా కోసం మీరు కష్టపడ్డారు గెలిపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కోసం నేను కష్టపడుతానని ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బండి సంజయ్ ధర్మం కోసం పని చేస్తున్నానని చెబుతున్న మాటలపై కేటీఆర్ ఛలోక్తులు విసిరారు. ధర్మం కోసం పనిచేస్తున్న బండి సంజయ్ ఆశ్రమాలకు, మఠాలకు వెళ్లాలని అనడంతో సభలో అంతా నవ్వుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్ ప్రజల కోసం ఏం చేశారని..? ప్రశ్నించడంతో ఏం చేయలేదని ముక్తకంఠంతో చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీల అనైతిక పొత్తులను ప్రజలకు వివరించాలని కేటీఆర్ అనడంతో కార్యకర్తల నుంచి మంచి స్పందన కనిపించింది. కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం పార్టీశ్రేణులను ఆకట్టుకున్నది. సమావేశానికి దాదాపుగా ఐదు వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు తెలంగాణ భవన్లోనే భోజన వసతి కల్పించారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా భోజన వసతి ఏర్పాటు చేయడంతో ఒత్తిడి తగ్గింది. సభ మధ్యాహ్నం 2:45 గంటలకు ముగియడంతో కేటీఆర్ సిరిసిల్ల తెలంగాణభవన్లోనే భోజనం చేసిన అనంతరం వివిధ మండలాల నాయకులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నారు