రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్/ముస్తాబాద్, మే 6: ‘పదేళ్ల నిజం కేసీఆర్ పాలన. పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యనే ఈ ఎన్నికలు జరుగుతున్నయి. గులాబీ జెండానే మన తెలంగాణకు శ్రీరామ రక్ష’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడే మంచిగుండేదని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారని, అయితే వారికి ఒక ఉపాయం చెబుతానని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఏ పార్టీతో పోటీ లేదని, మనకు మనమే పోటీ అని చెప్పారు. ఐకమత్యంగా ఉంటే వినోద్కుమార్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ కోసం కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని, తంగళ్లపల్లి చౌరస్తాలో ఆ అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీ వాళ్లే గుర్తు పట్టరని, ఇంకా ఎవరు గుర్తు పడుతారని ఎద్దేవా చేశారు.
నమో అంటే నరేంద్ర మోడీ కాదని, నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. దేవుడి పేరు చెప్పి మార్కెటింగ్ చేయడం .. మతం పేరిట ఓట్ల రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నమో రామచంద్రా అనే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం, రంగుల సినిమా చూపించి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. సిరిసిల్లలో పదేళ్లుగా ఆత్మహత్యల మాట వినబడలేదని, మళ్లీ ఇప్పుడు నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయం సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్, గాంధీచౌక్, తెలంగాణచౌక్లో జరిగిన కార్నర్ మీటింగ్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అనంతరం తంగళ్లపల్లి ఎస్ఎస్ గార్డెన్, ముస్తాబాద్ మండలం సాయిదత్త ఫంక్షన్హాల్లో నిర్వహించిన మండలాల బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరై వారికి దిశానిర్దేశం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఎంత ఆవశ్యకమో వివరించారు. కాంగ్రెస్ మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హమీలతో గెలిచిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి అమలు చేసి మొగోళ్లకు, ఆడోళ్లకు తాకులాట పెట్టిందని మండిపడ్డారు. ఈ ప్రాంత ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్లలో ఏంచేశారని నిలదీశారు. సిరిసిల్లకు, తంగళ్లపల్లి, ముస్తాబాద్కు ఒక్క పనైనా చేసిండా..? ఒక్క శిలాఫలకమైనా వేసిండా..? ప్రశ్నించారు. ఇదే కేసీఆర్ సిరిసిల్ల, కరీంనగర్ పరిధిలో ఎన్నో పనులు చేశారని వివరించారు. మరీ ఏమి చేయని మోడీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరించలేదని, నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టలేదని చెప్పారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని, బీఆర్ఎస్ కార్యకర్తలు కొద్ది రోజులు ఓపిక పట్టాలని, మనకో రోజు వస్తుందని, మిత్తితో సహా చెల్లిద్దామని ధైర్యం నింపారు. కలిసికట్టుగా కొట్లాడితే విజయం మనదేనని నిర్దేశం చేశారు. కార్యక్రమాల్లో నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఎంపీపీ పడిగెల మానస తదితరులు పాల్గొన్నారు.
నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్లే. గత ఐదు ఎన్నికల్లో ఒక్క రూపాయి, మందు పంచలేదు. ప్రజలు చూపిన దయతో గెలిచిన. నాకు ఓటేసిన మీ అందరికీ రుణపడి ఉంట. శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్న. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో 3 వేల కోట్లు ఖర్చు చేసి సిరిసిల్ల నేత కార్మికులను కాపాడుకున్నం. అభివృద్ధిలో సిరిసిల్లను అతి సుందరంగా తీర్చిదిద్దుకున్నం. నియోజకవర్గంలో పెద్ద మండలమైన తంగళ్లపల్లి నుంచి ఈ సారి నాపై కొంత కోపంగా ఉన్నట్టున్నరు. మెజార్టీని తగ్గించిన్రు. నేను తెలిసోతెలియకో తప్పు చేసి ఉంటే క్షమించాలి.
నరేంద్ర మోడీ రాముడిపేరుతో రాజకీయాలు చేస్తున్నడు. ఇంటింటికీ రాముడి పటం పంపించిండు. మొక్కుదామంటే వాటిపై మోడీ, బండి సంజయ్ ఫొటోలున్నయి. దేవుడి పటం మీద బల్లి పట్టినట్టు వాళ్ల మొఖాలు చూస్తూ ఎలా మొక్కాలి. సెంటిమెంటుతో కొట్టుడు తప్ప పైసా పని చేయని వారిని నమ్మి మోసపోవద్దు.
బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ప్రజల గొంతుక. ఆయన విద్యావంతుడు, ఉద్యమకారుడు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఎదురుదెబ్బలు తిని కేసీఆర్కు కుడి భుజంగా ఉన్నడు. తెలంగాణ కోసం చేసిన పోరాటంలో ఢిల్లీలో అండగా నిలిచిండు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేసిండు. ఆయన గెలిస్తే మన కోసం కొట్లాడుతడు. మన హక్కుల కోసం పోరాడుతడు. ఈ ఎంపీ ఎన్నికల్లో మన అభ్యర్థి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. లుచ్ఛా మాటలు చేప్పే రేవంత్రెడ్డికి, గాలి తిరుగుడు, గాలి మాటలు చెప్పే బండి సంజయ్కు ఓటుతోనే బుద్ధి చెబుదాం. ఈ నెల 10న కేసీఆర్ సిరిసిల్ల రోడ్షోను విజయవంతం చేద్దాం.
మోడీ 2014లో ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అదే ఏడాదిలో బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ పదేండ్లలో ఎన్నో పనులు చేసినం. మరి తెలంగాణకు ఏం చేయని బీజేపోళ్లకు ఓటెందుకు వేయాలి. ఒక్క కారణమైనా బండి సంజయ్ చెప్పాలి. ఏమైనా అంటే గుడి కట్టినం అంటడు. మరి కేసీఆర్ యాదాద్రి కట్టలేదా..? ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ఆధునిక దేవాలయం కట్టినం. రిజర్వాయర్లు, చెరువులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినం. వాటికి కూడా దేవుళ్ల పేర్లే పెట్టుకున్నం. మరి దేవుళ్లకు ఇంత సేవ చేసిన కేసీఆర్కు ఓటు వేయాల్నా.. వద్దా..? మేం వాళ్ల లెక్క దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నామా..?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీజేపోళ్లు డైరెక్ట్గా 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్రు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలంటే కచ్చితంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాలి. మన గోదారి నీళ్లను కర్ణాటక, తమిళనాడుకు తరలించాలని మోడీ చూస్తున్నడు. ఇలాంటి కుట్రలను ఎదుర్కోవడం బీజేపీ, కాంగ్రెస్ వాళ్లతో అయ్యే పని కాదు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ను యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నది. ఇక పార్లమెంట్ స్థానానికి ఒక్కటే జిల్లా ఉండాలని రేవంత్రెడ్డి చెబుతున్నడు. గులాబీ జెండాకు గుండె ధైర్యం ఇవ్వండి. జిల్లా రద్దుపై కొట్లాడుతం.
– కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతుకూలీలు, కౌలు రైతులకు పైసలిస్తామని చెప్పి రేవంత్రెడ్డి మోసం చేసిండు. ఇంకా మహిళలకు 2500, 4వేల పింఛన్, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ముంచిండు. కరెంట్, సాగునీరు, బోనస్ సంగతి పక్కన పెట్టిండు. తంగళ్లపల్లి బ్రిడ్జి కింద నీళ్లు లేకుండా చేసిండు. ఊసరవెళ్లి లెక్క రుణమాఫీకి తేదీలను మార్చుతున్నడు. ఎక్కడికి వెళ్లినా సరే దేవుడు మీద ఒట్లు పెడుతున్నడు. కేసీఆర్ను తిడుతున్నడు. ఈ ఐదు నెలల్లో ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమైనయి. అందుకే అన్ని వర్గాలు కోపంగా ఉన్నయి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్