పదేండ్ల కేసీఆర్ పాలనలో నేతన్నకు చేతినిండా పని దొరికింది. పనికి తగ్గట్టు నెలకు 15 వేల నుంచి 20 వేల కూలి గిట్టుబాటైంది. బతుకులకు భరోసా లభించింది. కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది. దరిద్రం కాలుమోపగానే మళ్లీ ఆత్మహత్యలు మొదలైనయి. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల సాంచాల్లో సంక్షోభం తలెత్తింది.. ఇప్పటికే మోసపోయి గోసపడుతున్నం. దండం పెట్టి చెబుతున్నా.. ఇప్పటికైనా ప్రజలు ఆగం కావద్దు. ఆలోచించి ఓటు వేయండి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించండి. ఈ నెల 10న సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షో ఉన్నది. సాయంత్రం 4 గంటల వరకు చేరుకుని విజయవంతం చేయాలి.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, మే4 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల వేళ ప్రజలు ఆగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే మోసపోయి గోసపడుతున్నామని, మరోసారి అలా మోసపోవద్దని సూచించారు. సిరిసిల్ల, రాష్ట్రం బాగుండాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని, అందుకే మన సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. మన బతుకులను రోడ్డుమీదికి తెచ్చిన చెయ్యి విరగాలని, పువ్వువాడిపోవాలని, కారు రయ్ మంటూ ఉరకాలని చెప్పారు. అప్పుడే మన నేతన్నల రాతలు మారుతాయన్నారు.
పార్లమెంటులో మనకోసం, మన నేతన్నల కోసం, మనప్రాంత రైతులు, సిరిసిల్ల అభివృద్ధి కోసం గట్టిగా కొట్లాడేటోళ్లు ఉండాలంటే బీఆర్ఎస్ నిలబెట్టిన బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సైనికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, తొమ్మిది రోజులు కష్టపడి పార్టీ అభ్యర్థి వినోద్కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిరిసిల్ల పట్టణంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. వెంకంపేటలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
అనంతరం తెలంగాణ భవన్లో తంగళ్లపల్లి మండల, తర్వాత వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కేటీఆర్ మాట్లాడారు. శుక్రవారం సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ప్రజలకు స్వాంతన చేకూర్చే మాటలు చెప్తారని అనుకున్నామని చెప్పారు. కానీ, చిల్లర మాటలు చెప్పి పోయిండని విమర్శించారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిని కాంగ్రెస్, ఇచ్చిన హామీలన్నీ అమలు కాకుండానే అన్ని అమలు చేశామంటూ సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కరెంటు మంచిగుండేదని, తాగునీళ్లు పుష్కలంగా ఉండేవని, తంగళ్లపల్లి వాగు బ్రిడ్జి కింది దాకా వచ్చిన గోదావరి నీళ్లతో సముద్రాన్ని చూశామని, ఇవ్వాళ వాగు ఎడారిగా మారి సూడబుద్ది కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మోసపోతే గోసపడతామని ఇదివరకే కేసీఆర్ చెప్పిన మాటలను మనోళ్లే వినక ఆగమయ్యారని గుర్తు చేశారు. ప్రచార కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడ్ల మంజుల, పార్టీ నాయకులు బొల్లి రాంమోహన్, గాజుల బాలయ్య, ఆవునూరి రమాకాంత్రావు, సత్తార్, మహిళా విభాగం అధ్యక్షురాలు వనజ, కౌన్సిలర్లు నీరజ, కీర్తన, అరుణ, కల్లూరి రాజు పాల్గొన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపిస్తే పార్లమెంట్కు, బీఆర్ఎస్కు, మనకు గౌరవం పెరుగుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో 76 ఏళ్లు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన ఓ మాజీ మంత్రి తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని, ప్రధాని మోడీ తాము మూడోసారి అధికారంలోకి వస్తే వెయ్యేండ్లు గుర్తు పెట్టుకునే మార్పు తెస్తానని అంటున్నరు. దీనిని బట్టే వారి ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నది. దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండాలని, సమపాలన అందించాలనే ఉద్దేశంతో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రెండు జాతీయ పార్టీలు రద్దు చేసే ప్రమాదమున్నది. దీనిని ఆపాలంటే 35 పార్టీలను ఒప్పించి, తెలంగాణ సాధించిన కేసీఆర్తో సాధ్యం.
– కేటీఆర్
ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఏమి చేశారని ప్రశ్నిస్తే గుడి కట్టినం. ఓటేయ్యాలంటూ వస్తున్నడు. గుడి కట్టడమే ముఖ్యమైతే కేసీఆర్ యాదగిరి గుట్టపైన కట్టలేదా? దానిపై మేం ఓట్లు అడిగామా? దేవుడిని అడ్డం పెట్టుకుని బండి సంజయ్ రాజకీయం చేస్తున్నడు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఏం అభివృద్ధి చేశానో మీ కండ్ల ముందే ఉన్నది. మెడికల్ కళాశాల, కలెక్టరేట్, నీళ్లు తెచ్చిన. చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుని ఓట్లు అడగాలె. కానీ, దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడిగేటోళ్లను నమ్మద్దు. కేసీఆర్ ఒక గుడి మాత్రమే కట్టలేదని, ఆధునిక దేవాలయాల్లాంటి రిజర్వాయర్లు, కాళేశ్వరం, మిడ్మానేరు కట్టి సిరిసిల్లకు సముద్రాన్నే తెచ్చిండు. ఆధునిక ప్రాజెక్టులకు దేవుడి పేర్లే పెట్టినం. శ్రీరాజరాజేశ్వర, కొండ పోచమ్మ, మల్లన్న, రంగనాయక పేర్లే పెట్టుకున్నం.
– కేటీఆర్
దయచేసి నేను నమ్ముకున్నది మిమ్మల్నే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన్రు. ఎన్నటికీ రుణపడి ఉంట. మీకు సేవ చేస్త. 12 ఎంపీ సీట్లు ఇస్తే కేసీఆర్ సారు సంవత్సరం లోపలే రాష్ర్టాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ఎండ బాగా ఉన్నందున ఈ నెల 13న పోలింగ్ రోజు ఉదయం పూటనే ఓటు వేయాలి. ఓటర్లు ఇంట్లోనే ఉంటే వేరే పార్టీవాళ్లు దొంగ ఓట్లు వేసి గెలిచినా గెలుస్తరు. తస్మాత్ జాగ్రత్త!
– కేటీఆర్
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మండటెండను లెక్క చేయకుండా సిరిసిల్లలో జోరుగా ప్రచారం చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యకర్తలతో కలిసి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. రైతుబజార్, కూరగాయల మార్కెట్తోపాటు గాంధీచౌక్, లేబర్ అడ్డా, బీవైనగర్ ఏరియాల్లో కాలినడకన తిరిగారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ.. యోగ, క్షేమాలు అడిగి తెలుసుకుని కారుగుర్తుకు ఓటు వేసి వినోదన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, నేత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పూలు, పండ్లు అమ్మే వ్యాపారులను సైతం కలిసి ఓటు అభ్యర్థించారు.
అలాగే బస్టాండ్లో బస్సుల్లోని ప్రయాణికులతో ముచ్చటించారు. కేసీఆర్ పాలనే బాగుందంటూ, మళ్లీ కేసీఆర్ను చూడాలనుకుంటున్నామని పలువురు ప్రయాణికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగా, హర్షం వ్యక్తం చేశారు. హోటళ్లలో టీ తాగుతూ.. టిఫిన్ చేస్తూ ముచ్చటించారు. వెంకంపేటలో కార్నర్ మీటింగ్ నిర్వహించగా, నేతన్నలు తమ బాధను చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తమ బతుకులకు ఏమి భరోసా ఇవ్వలేదని, ఆర్డర్లు ఇయ్యక తమని రోడ్డుమీదపడేశాడని కంట తడిపెట్టారు.