“దేశం, రాష్ట్రంలో రైతులకు కరెంట్, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగు చేయకుండా ఐదు దశాబ్దాల పాటు వ్యవసాయాన్ని ఆధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమై, కర్షక కుటుంబాలను రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ, మళ్లీ బాహాటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోంది. ఇప్పుడిప్పుడే బాగై కుదుటపడుతున్న తెలంగాణ రైతుల కడుపుకొట్టేందుకు కుట్రలు చేస్తోంది. మన రైతులు మూడు పంటలు పండించాలన్నదే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ విధానం. మూడు గంటల కరెంట్ అన్నది కాంగ్రెస్ విధానం.. ఇందులో 24 గంటల కేసీఆర్ కరెంట్ కావాలా.. మూడు గంటల కాంగ్రెస్సా..? ఏది శ్రేయస్కరమో.. రైతులు ఒకసారి ఆలోచన చేయాలి” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పేదాకా ఊరుకోబోమని హెచ్చరించారు.
జగిత్యాల, జూలై 16 (నమస్తే తెలంగాణ): దేశంలోని, రాష్ట్రంలోని వ్యవసాయధారులైన రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి, బాహాటం, నిస్సింగుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోందని, రైతన్నలు గతంలో పడ్డ కష్టాలను ఒకసారి ఆలోచన చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. జగిత్యాలలో ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు ఎల్ రమణను పరామర్శించిన ఆయన, ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ఐదు దశాబ్దాల పాటు సాగుకు కరెంట్, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగు చేయకుండా, వ్యవసాయాన్ని ఆధోగతి పాలు చేసిన, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిప్పుడే బాగై కుదుటపడుతున్న తెలంగాణ రైతాంగం కడుపులు కొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రేవంత్రెడ్డి చేసిన మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరపున తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తున్నామన్నారు. మూడు గంటల కరెంట్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు సైతం గుండెలపై చేతులు వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
2014కు ముందు, తెలంగాణ ఏర్పడక ముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు అంత్యక్రియలకు, స్నానాలు చేసేందుకు నీళ్ల కోసం ఇబ్బందిపడ్డ పరిస్థితులను అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాల కోసం పడ్డ పాట్లు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని రైతాంగాన్ని కోరారు. నాట్లు వేసే కాలం వచ్చిందంటే, ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలు ఉండేవా లేదా.? రైతన్నలే చెప్పాలన్నారు. ఎండకాలం వచ్చిందంటే, ఎండిన వరిచేనులు, ఎండిన మక్కకంకులు, సబ్స్టేషన్ల ముందు ధర్నాలు, సబ్స్టేషన్లకు పోయి అక్కడ ఉండే వ్యవసాయ అధికారులను లోపలేసిన విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలపై ప్రతి రైతు ఆలోచన చేయాలన్నారు. మన రైతులు మూడు పంటలు పండించాలన్నదే కేసీఆర్, బీఆర్ఎస్ విధానమని, మూడు గంటల కరెంట్ అన్నది కాంగ్రెస్ విధానమని, ఇందులో ఏది శ్రేయస్కరమో ఆలోచన చేయాలని సూచించారు. 50 ఏండ్ల పాలనలో రైతులు, ప్రజలను రాచిరంపాన ఎంతలా పెట్టిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మరోసారి కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణ కావాలా..? ఆలోచించాలన్నారు.
ఒకప్పుడు జగిత్యాలలోని అంతర్గాం చెరువును సైతం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ పనిచేసిన మంత్రి కూడా నింపలేకపోయారన్నారు. కాళేశ్వరం జలాల పుణ్యమా అని, వరద కాలువ ద్వారా జలాలు ఎదురెక్కి ఎస్సారెస్పీకి చేరుతున్నాయన్నారు. 122 కిలోమీటర్ల మేర వరద కాలువ నిండుకుండలా మారిందని, తూముల ద్వారా అంతర్గాం చెరువుతో పాటు, 68 చెరువులను నింపిన మాట వాస్తవం కాదా..? ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరుగలేదా..? చెప్పాలన్నారు. వర్షాలు లేకున్నా మత్తడి దుంకుతున్న చెరువులు కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు తెల్లార్లు లేస్తే నోటికచ్చిన మాటలు, కారు కూతలు కూస్తున్నారన్నారు. రోజూ మొగులవుతుంది కానీ, వర్షం రావడం లేదని, మరి ఎక్కడి నుంచచి నీళ్లు వస్తున్నాయో.. రైతులు చూడాలన్నారు. ఎస్సారెస్పీలో ఇప్పటికే 3, 4 టీఎంసీల నీరు నింపామని, వరద కాలువ నిండు కుండలా మారిందన్నారు. గోదావరి జలాలతో, కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ ఆయకట్టు, మహారాష్ట్ర నుంచి నీళ్లు వచ్చినా రాకున్నా, నీళ్లు నింపుకుంటున్నది వాస్తవం కాదా చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అన్నారు. మూడెకరాల వాళ్లకు మూడు గంటలు చాలు అంటున్న చిల్లర పార్టీ, చిల్లర నాయకులు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.
సోమవారం నుంచి రైతు వేదికల్లో కార్యక్రమం చేపడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ప్రతి వేదికలో వెయ్యిమంది రైతులతో తీర్మానం చేస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నిజరూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయటపెడుతామన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న ఒక్క రాష్ట్రంలోనైనా పది గంటల పాటు ఉచిత విద్యుత్ను ఇస్తున్నారా చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో చర్చపెడుతామని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కరెంట్ కావాలా, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కావాలా..? అని అడుగుదామన్నారు. దేశంలో కేసీఆర్ పాలనా, వ్యవసాయ విధానం బాగుందని, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రైతులు చెబుతున్నారన్నారు. ‘అబ్కి బార్ కిసాన్ సర్కార్’ అని సీఎం కేసీఆర్ అంటే, మహారాష్ట్ర రైతన్న మనతో గొంతు కలుపుతున్నారన్నారు. మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సన్నాసి పార్టీకి ఏమైందని ప్రశ్నించారు. పక్కరాష్ర్టాల వాళ్లు మన విధానాలు బాగున్నాయని, కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరెంట్, ఊరూరా కొనుగోలు కేంద్రం వంటి పథకాలు బాగున్నాయని, తాము కూడా అమలు చేస్తామని వారు అంటుంటే ఇక్కడ ఉన్న భావదారిద్య్రపు ప్రతిపక్షం ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్న విషయాన్ని రైతులు ఆలోచన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు తిరుగులేని విధంగా క్షమాపణలు చెప్పేదాకా ఉద్యమిద్దామన్నారు.
రైతు విధానాలే సింగిల్ ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్దాం..
రాష్ట్రంలో రైతుల వద్దకు, ప్రజల వద్దకు రైతు ప్రయోజనాలు అనే సింగిల్ ఎజెండాతో వెళ్దామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంట్ కావాలా..? కేసీఆర్ ప్రస్తుతం ఇస్తున్న కరెంట్ కావాలా..? అని అడుగుదామన్నారు. చచ్చిపోతే కరెంట్ అడుక్కునే రోజులు కావాలా..? కడుపు నిండా కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాల్నా అన్నది ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. రాష్ట్రంలో ఉన్న 70లక్షల రైతు కుటుంబాలకు, 73 వేల కోట్లు రైతుబంధు రూపంలో పొందుతున్న వారిని తీర్పు ఇవ్వమని అడుగుదామన్నారు. 2014 వరకు ఉన్న కరెంట్ దుస్థితి కావాల్నా, 2014 తర్వాత కేసీఆర్ పాలనలోని కరెంట్ పరిస్థితి కావాల్నా అడుగుదామన్నారు. సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, గుండు సుధారాణి, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వోరుగంటి రమణారావు, మల్యాల జడ్పీటీసీ సభ్యుడు రాంమోహన్రావు, నాచుపల్లి పీఏసీసీ చైర్మన్ రాజనర్సింగరావు పాల్గొన్నారు.