రైతుబాంధవుడు కేసీఆర్ అన్నదాతల కష్టాలు తీర్చేందుకు కదిలారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పడుతున్న బాధలు తెలుసుకుని, వారికి అండగా నిలిచేందుకు పొలంబాట పట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన ఆయన, నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. మొగ్దుంపూర్, బోయినపల్లిలో ఎండిన పొలాలను పరిశీలించి, రైతన్నలకు భరోసా ఇవ్వనున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రైతుబాంధవుడు కేసీఆర్ ఆది నుంచీ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు. సాగునీరు, 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లు ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఏకష్టం రాకుండా చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లోనే వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రాగా, రైతులు బంగారం లాంటి పంటలు పం డించారు. పదేళ్లపాటు నిరందీగా ఉన్నారు. గతేడాది మార్చిలో వడగళ్లవాన తీవ్ర నష్టం చేకూర్చగా.. ఆయన తట్టుకోలేకపోయారు. వెంటనే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను చూసి చలించిపోయారు.
‘నేనున్నా.. అధైర్య పడొద్దు’ అంటూ భరోసానిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎకరానికి 10 వేల పరిహారం ఇస్తానని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. నెలరోజుల్లోనే చెల్లింపునకు ఆదేశాలిచ్చారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి న అవసరం లేకుండా.. విడుతల వారీగా ఖాతాల్లోనే జమ చేయించారు. ఇలా ఎప్పుడూ అన్నదాత పక్షాన నిలిచిన ఆయన, ఇప్పుడు అధికారంలో లేకున్నా రైతుల కోసమే తపిస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో సాగునీరు లేక, వేలాది ఎకరాల్లో పంటలు ఎండి రైతులు అరిగోస పడతుండగా.. కేసీఆర్ చలించిపోతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సుడిగుండంలో తిరుగుతుంటే ఆయన మాత్రం రైతుల కన్నీళ్లను తుడిచేందుకు పొలంబాట పట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన, నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గం టలకు కరీంనగర్ మండలం మొగ్దుంపూర్కు చేరుకోనున్నారు. ఎండిపోయిన పం టలను పరిశీలించి, రైతులతో మాట్లాడుతారు.అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. అక్కడినుంచి బయలుదేరి బోయినపల్లికి చేరుకొని, ఎండిన పంటలను పరిశీలిస్తా రు. ఆ తర్వాత శాబాష్పల్లి వద్ద మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను చూస్తారు. సాయంత్రం 4గంటలకు సిరిసిల్లలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.