హుజూరాబాద్/ కమలాపూర్, ఏప్రిల్ 29 : కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మునుగుడు ఖాయమని, మరోసారి ఆగమై మోసపోవద్దని ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మంచి చేసిందెవరో.. చేసేదెవరో ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చోటా భాయ్ రేవంత్రెడ్డి.. కేంద్రంలో ఉన్న బడే భాయ్ నరేంద్రమోదీ కలిసి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్త మాటలు.. ఉద్దెర హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను నమ్మి ప్రజలు ఇప్పటికే మోసపోయి గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల వేళ కాంగ్రెస్ గారడీలను, బీజేపీ దొంగ మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. తెలంగాణ హక్కులను కాపాడుకోవాలన్నా.. పార్లమెంట్లో గళం వినిపించాలన్నా బీఆర్ఎస్ ఎంపీగా తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి హనుమాన్ ఆలయంలో సోమవారం ఆయన పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో కలిసి గోపాల్పూర్, శనిగరం గ్రామాల్లో రోడ్షో నిర్వహించారు. రాత్రి హుజూరాబాద్ మండలం కందుగుల, కనుకులగిద్ద గ్రామాల్లో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల వినోద్కుమార్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీలో రెండేళ్లకోసారి సీఎం మారుతారని, ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉన్నదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించేందుకు రాజకీయ కుట్రకు తెరలేపిందని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని సూచించారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల తీసుకురాలేదన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఐదేళ్లలో ఒక్క పైసా తీసుకురాలేదని మండిపడ్డారు. 2014లో తాను ఎంపీగా గెలిచి రూ.
వెయ్యి కోట్ల నిధులతో కరీంనగర్ స్మార్ట్ సిటీ, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్, 50 కోట్లతో కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం, జాతీయ రహదారులు తీసుకువచ్చానని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఉప్పల్ ఆర్వోబీ బ్రిడ్జి రైల్వే ట్రాక్కు రెండు వైపులా రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి చేయించి నాలుగేళ్లు అవుతున్నదని, ఐదేళ్లు ఎంపీగా ఉండి బండి సంజయ్ రైల్వే ట్రాక్పై బ్రిడ్జి పూర్తిచేయించలేదని మండిపడ్డారు. దీంతో ప్రయాణికులు ఐదేళ్లుగా రైల్వేగేట్ వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణమే బండి సంజయ్ పనితీరుకు నిదర్శనమని ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ బాగుండాలని కేసీఆర్ 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనకు అవకాశమిస్తే పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని చెప్పారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం రామక్క పాటకు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి శాలినిరెడ్డి దపంతులు, వినోద్కుమార్ కోడలు హర్షిణి ప్రజలతో కలిసి డ్యాన్స్ చేశారు.
ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీటీసీలు పడిదం బకారెడ్డి, లాండిగ కల్యాణి, ఎంపీపీ తడక రాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు ఐలయ్య, బెల్లి రాజయ్య, సతీశ్, కాసం రఘుపతిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, కానుగంటి శ్రీనివాస్, శ్యాంసుందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మహిళలకు 2500, వరి ధాన్యం క్వింటాలుకు 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్రెడ్డి ఇచ్చిండా..? ప్రజలు ఆలోచన చేయాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశమిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతుంది. బీజేపీ దొంగ మాటలు, కాంగ్రెస్ గారడీ మాయలో పడి మోసపోవద్దు. ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసే పార్టీ బీఆర్ఎస్సే. పదేళ్లలో కేసీఆర్ చేసిన ఎన్నో అభివృద్ధి పనులను గుర్తించండి. ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఆయనను గెలిపిస్తే జోడేద్దుల్లాగా పనిచేస్తాం.
– పాడి కౌశిక్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే