కోర్టుచౌరస్తా, ఏప్రిల్ 15: గతంలో ఎంపీగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా న్యాయవాదుల సంక్షేమం, జ్యుడీషియరీ అభివృద్ధి కోసం కేసీఆర్ సహకారంతో ఎంతో కృషి చేశానని, వీటిని మేధావి వర్గమైన న్యాయవాదులు అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతంగా తనకు మద్దతు తెలపాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్ కుమార్ కోరారు. సోమవారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించడం ద్వారా న్యాయవాదులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణ విభజన తర్వాత ప్రత్యేక హైకోర్టు కోసం తాను చేసిన కృషిని గుర్తు చేశారు. అలాగే హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరిగేందుకు తానే కారణమని పేర్కొన్నారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేయడం, రైల్వే లైన్ తీసుకురావడం అందరికీ తెలిసిందేనని, త్వరలోనే కరీంనగర్కు నేరుగా రైలు వస్తుందని, రైల్వే జంక్షన్గా కరీంనగర్ మారనుందని తెలిపారు.
కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమస్యలపై గట్టిగా గళం వినిపించి సాధిస్తానని, రానున్న రోజుల్లో న్యాయవాదుల సంక్షేమం, జ్యుడీషియరీ అభివృద్ధి కోసం ఎన్నో చేసే ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏది చేసినా తాను న్యాయవాదిగా ఉన్నందువల్లే సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్కుమార్ను న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజకుమార్, ఉపాధ్యక్షుడు రఘువీర్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, సుడా మాజీ చైర్మన్ రామకృష్ణారావు, పెంచాల ప్రభాకర్రావు, దేవ కిషన్, పూరెల్లి రాములు, సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, ఏప్రిల్ 15: ఎల్ఎండీ కాలనీలోని స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్ట్ సభ్యుడు జువ్వాడి మధుసూదన్రావు సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. ట్రస్ట్ సభ్యుడు మధుసూదన్రావు ఇటీవల మరణించగా, ఆయన సంతాప సభను మానసిక వికలాంగుల పాఠశాల ఆవరణలో ట్రస్ట్ చైర్మన్ చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలతో ముచ్చటించారు. కార్యక్రమంలో పాఠశాల ఏవో బాలరాజు, ట్రస్ట్ సభ్యులు, మధుసూదన్రావు కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.