సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 21: తంగళ్లపల్లి మండలం తాడూరులో ప్రమాదవశాత్తు తాటి వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తాడూరులో కాలిపోయిన తాటిచెట్లను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ నీరజతో ఫోన్లో మాట్లాడి, సమస్యను వివరించారు. కాలిన చెట్లను సంరక్షించే మార్గాలను అన్వేషించాలని కోరారు. కాలిన చెట్లు వానకాలంలో చిగురించకుంటే.. తాను బీహార్లోని పాట్నా నుంచి పొట్టి తాటి విత్తనాలను తెప్పించి పార్లమెంట్ పరిధిలోని గీత కార్మికులకు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు నర్సరీల్లో పొట్టి తాటి మొక్కలు దొరికితే కాలిన తాటిచెట్ల ప్రదేశంలో నాటిస్తానని తెలిపారు. గీత కార్మికులకు తక్షణ సాయం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఫోన్ ద్వారా కోరారు. కాగా, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు గీతకార్మికులు వినోద్కు వినతిపత్రం అందించారు. ఆయన వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ పడిగెల మానస, పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, నాయకులు మాట్ల మధు, పడిగెల రాజు, సురభి నవీన్రావు, ములిగే దుర్గాప్రసాద్, బాల్రెడ్డి, కందుకూరి రామాగౌడ్ ఉన్నారు.