కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 22 : తనను ఆశీర్వదించి కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. తనకు అవకాశమిస్తే ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని చెప్పారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దమ్ము తనకు ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్తో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను 2019లో ఎంపీగా ఓడినా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు. కానీ, ఎంపీగా గెలిచిన బండి సంజయ్ మాత్రం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేడని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం నయాపైసా తేలేదని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రశ్నించేందుకు తాను ఎంపీగా ఉంటేనే ప్రజా సమస్యలు పరిషారమవుతాయన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు రూ.వెయ్యి కోట్లతో స్మార్ట్సిటీ తీసుకొచ్చానని, కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు రైల్వే లైన్ మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చేశామన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ట్రిపుల్ఐటీతో పాటు పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. బండి సంజయ్ ఎంత సేపూ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్ప చేసిందేమీ లేదని, నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి వస్తున్న నిధులను తాను తీసుకువచ్చానని చెప్పుకోవడం బండి సంజయ్కే చెల్లిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఒక్కసారి ఆలోచించి బీఆర్ఎస్కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, కార్పొరేటర్లు బండారి వేణు, సతీశ్, బీఆర్ఎస్ నాయకులు జకుల నాగరాజు యాదవ్, దూలం సంపత్, సాయి, వెంకట్, శేఖర్రావు, తిరుపతిరెడ్డి, ఆనంద్, సూరి, అనిల్, సాయికృష్ణ పాల్గొన్నారు.