పెద్దపల్లి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి : కార్మిక, కర్షకుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతానని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి ఓటేస్తే ప్రజలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, తనకు ఆ అవకాశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన రోడ్షోకు హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి అశేషంగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రశ్నించే గొంతుకలపైన రేవంత్ సర్కార్ అక్రమ కేసులను పెడుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోయాయని, ధర్మారంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి సల్వాజీ మాధవరావుపై దాడిని ఉదహరించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, కానీ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సాగు నీరందక, కరెంటు రాక రైతులు అన్నమో రామచంద్రా.. అని ఆర్తనాదాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. అయినా, సీఎం రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆటోవాలాల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, కుటుంబ పో షణ గడవక 48 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా రాష్ట్ర సర్కారుకు ఏ మాత్రం కనికరం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా సాగునీరు అందించారని, ధాన్యం సకాలంలో కొన్నారని కొనియడారు. కానీ, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి పది రోజులైనా కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్కు సెగ తాకేలా పోస్టు కార్డు ఉద్యమాన్ని గ్రామ గ్రామాన చేపట్టాలని పిలుపునిచ్చారు.
స్థానికుడినైన తనకు ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చి కేసీఆర్ విధానాలను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, నాయకులు రఘువీర్సింగ్, దాసరి ఉష, గంట రాములు, మిర్యాల రాజిరెడ్డి, మేకల మల్లేశం తదితరులు ఉన్నారు.
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లికి చేరుకున్న ఆయన, తొలుత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం మహిళలు ఆయనకు కుంకుమ తిలకం దిద్దగా, ముస్లింలు దట్టీ కట్టారు. అక్కడి నుంచి నామినేషన్కు కలెక్టరేట్కు బయలుదేరి వచ్చారు. 11 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామ్మిల్ఖాన్కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కలెక్టరేట్ ఎదుట మీడియాతో మాట్లాడారు. తర్వాత నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా చేరుకుని, అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా పార్లమెంట్ పరిధిలోని బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘జై కేసీఆర్’‘జైకొప్పుల’ నినాదాలతో హోరెత్తించారు.
నేను ఇక్కడే పుట్టిన. ఇక్కడే పెరిగిన. నా చివరి శ్వాస వరకూ మీతోనే ఉంట. ఒక కార్మికుడి బిడ్డను. అన్నా.. అంటే నేనున్నాననే మీ సోదరుడిని. మీతో అంతటి అనుబంధం ఉన్నది. మీ బిడ్డను ఎంపీగా ఆదరించండి. మీకోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతా. ఈ ఎన్నికల్లో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ జరుగుతున్నది. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తా.
– రోడ్షోలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్