కోనరావుపేట, జూన్ 23 : కరెంట్ కోతలు, రైతు సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కన్నెర్రజేశారు. ఈ మేరకు మంగళవారం రైతులతో కలిసి కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దాదాపు అరగంటకుపైగా బైఠాయించిన నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని, అన్ని విధాలుగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారాయని ఆవేదన చెందారు. కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను యథావిధిగా అమలు చేయాలని, రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు వంటి పథకాలతో సాగును పండుగలా మార్చారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మళ్లీ చీకట్లోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ కూడా ఇవ్వలేకపోతున్నదని, మూడు గంటల కరెంటుతో సాగు చేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కరెంటు కోసం పొలాల వద్ద కాపలా కాస్తూ రైతులు ప్రాణాలు పణంగా పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. విద్యుత్ కోతలు, ఎరువుల కొరత, రైతుబంధు నిలిపివేతతో సర్కారు రైతుల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతు సమస్యలను వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్ మాట్లాడుతూ, ‘వడ్ల కుంభకోణం’లో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మలపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ వడ్ల దొంగతనం కేసులో రిమాండ్కు వెళ్లిన తర్వాత, అతడితో తమకు సంబంధం లేదంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ స్కాంపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచులు కుంటెల్లి నాగరాజు, మల్లేశం యాదవ్, వెంకటేశ్ గౌడ్, నాయకులు మంతెన సంతోష్, దొంతరవేణి శ్రీనివాస్, అనుపాటి భూంరెడ్డి, రమణారెడ్డి, సుమన్, మహేశ్ యాదవ్, మధు, శివ, ఉపసర్పంచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.