కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 7: “రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ప్రజా పాలన కాదు.. దోపిడీ, ప్రతీకార పాలన. కాంగ్రెస్ గ్యారంటీల పార్టీ కాదు.. దోపిడీల పార్టీ” అని దానిని అంతమొందించేదాకా ఉద్యమిద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఈ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు, ద్రోహులకు మధ్య సాగుతున్న పోరాటం. పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి పాలనకు వంద రోజుల అబద్ధాల కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధం. గుండెల నిండా కరీంనగర్పై ప్రేమ ఉన్న వ్యక్తి వినోద్కుమార్కు గుటా ప్యాకెట్లకు మధ్య జరుగుతున్న పోరు’ అని చెప్పారు.
శవాలు, శివాలు అని మాట్లాడే విధ్వంసకారులను పార్లమెంట్కు పంపిస్తే రాజ్యాంగం భద్రంగా ఉంటుందా..? అని ప్రశ్నించిన ఆయన, మీకు విధ్వంసకారులు కావాలా..? అభివృద్ధి సాధకులా..? ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. నిత్యం ప్రజల అభ్యున్నతి కోసం, జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే వారిని పార్లమెంట్కు పంపించాలని పిలుపునిచ్చారు.
ఆదివారం కరీంనగర్లోని దాసరి గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి యుద్ధభేరి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. పార్టీ కార్యకర్తల్లో ప్రస్తుతం ఉన్న కదన కుతూహలం మే 13 వరకూ కొనసాగాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో కరీంనగర్ పోలీసులు మన కార్యకర్తలు, నాయకులపై ఎవరిపై పడితే వారిపై కేసులు పెడుతున్నారని, కానీ ఆ కేసులకు భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై పుట్టిన మేధావి వినోద్కుమార్ అని, కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ చెబుతుంటే, రేవంత్రెడ్డి మాత్రం వారి అడ్రస్సులు చెప్పండి. విచారణ చేసి ఎన్నికల తర్వాత ఆదుకుంటామని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎన్నికల ముందు హామీలిచ్చి మోసం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సాగుతున్న దోపిడీ పాలనపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. అభివృద్ధి గురించి ఆలోచనలు చేసి ఆచరణలో పెట్టేవారిని ఎంపీగా చేద్దామా..? గుట్కాలు తింటూ, నైంటీ ఎంఎల్ తాగుతూ, బైక్లపై తిరిగేవారిని ఎంపీగా చేద్దామా..? ఆలోచించాలని సూచించారు.
కరీంనగర్ నియోజకవర్గం, నగరంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలి. కరీంనగర్కు అర్హత లేకున్నా స్మార్ట్సిటీ తీసుకువచ్చిన ఘనత వినోద్కుమార్కే దక్కుతుంది. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించిన వ్యక్తి. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా నిలవడం వల్లే నియోజకవర్గానికి నిధులు వచ్చాయి. కానీ ఐదేండ్లుగా అలాంటి ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్లే నిధులు రావడం లేదు. వినోద్కుమార్ గెలుపు అనేది జిల్లాకు ఎంతో అవసరం.
– ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ప్రతి రోజూ 24 గంటలపాటు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసమే పని చేస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. నిజాయితీగా పని చేసే పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. అలాగే, ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని చెప్పి, సరఫరా చేశామని, 24 గంటల కరెంటిచ్చామని గుర్తు చేశారు. గోదావరి నుంచి వంద అంతస్తుల పైకి నీటి ఎత్తి పోసి కోటి ఎకరాలకు సాగు నీరందించామని తెలిపారు. గత ప్రభుత్వాలు దళితులకు కొద్దిపాటి సబ్సిడీతో రుణాలు ఇచ్చేవని, వాటి కోసం ప్రజలు చెప్పులరిగేలా తిరిగే పరిస్థితులు ఉండేవన్నారు.
అలాంటివి రావద్దనే కేసీఆర్ పూర్తిస్థాయిలో మాఫీతో దళితబంధు పథకాన్ని తెచ్చారన్నారు. గతంలో తాను ఎంపీగా అర్హత లేకున్నా కూడా కరీంనగర్కు స్మార్ట్సిటీ తీసుకువచ్చి అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు తోట ఆగయ్య, దాసరి ఉష, చల్ల హరిశంకర్, కంసాల శ్రీనివాస్, పొన్నం అనిల్, దూలం సంపత్, నాగరాజు పాల్గొన్నారు.
– బీఆర్ఎస్ అభ్యర్థి బీ వినోద్కుమార్