పెద్దపల్లి, మార్చి 26: ‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉంచారు. బీఆర్ఎస్ వెంటే ఉన్నరు. పేదలు, రైతుల కండ్లలో కారం కొట్టే కాంగ్రెస్, మత చిచ్చు పెట్టే బీజేపీలను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నరు. ఎవరెన్ని నాటకాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. తెలంగాణ, పెద్దపల్లి గడ్డ మీద మరో మారు గులాబీ జెండా ఎగరడం ఖాయమని’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఇన్చార్జి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ దీమా వ్యక్తం చేశారు.
గెలుపు మనదే కదా అని.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదమరిచి ఉండొద్దని, ప్రతిపక్షాల కుట్రలను, ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, చీకురాయి, హన్మంతునిపేట, రాంపల్లి, మారేడుగొండ, గుర్రాంపల్లి గ్రామాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం పెద్దపల్లి పట్టణంలో ఆర్ఆర్ గార్డెన్ ఎమ్మెల్యే దాసరి అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్.. కలెక్షన్ కోసం ఆరాటపడితే బీఆర్ఎస్ పేద ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్నదని, ఇంకా మరేం కొత్త పథకాన్ని తీసుకురావాలో ఆలోచిస్తున్నదని పేర్కొన్నారు.
సమై క్య పాలనలో తెలంగాణ ఎడారిగా మారితే, నేడు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా పచ్చదనం పరుచుకున్నదన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో వరి సాగు 14 లక్షల ఎకరాలైతే.. ఇప్పుడు 56 లక్షలకు పెరిగిందని, ఇందుకు కారణం సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకుంటే 56 లక్షల ఎకరాలకు సాగు నీరందేదా? చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో 97 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే.. ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో సాగవుతున్నదని చెప్పారు. దేశంలోనే అత్యధిక వరి సాగు చేస్తున్న రాష్ట్రంగా, దేశానికి అన్నం పెట్టేస్థాయికి తెలంగాణ ఎదుగుతున్నదని చెప్పారు. ఒకప్పుడు అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగవుతున్నదని చెప్పారు. ఏటా 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈ తొమ్మిదేండ్లలో ఇచ్చిన ఉద్యోగాలు గుండు సున్నా అని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటివరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 95 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్లు చెప్పారు.
గ్రూప్స్ పేపర్ లీకేజీపై హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న బండి సంజయ్కి ఒకటే చెబుతున్నా.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 15 సార్లు పేపర్ లీకైందని, దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని హితవుపలికారు. ఇక్కడ జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీ బండారి స్రవంతి -శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు అనంతరెడ్డి, సర్పంచులు కారుపాకల మానస సంపత్, మేకల మల్లేశం, ఎనగందుల శంకరయ్య, బండారి రజని, తీగల సదయ్య, శ్రీలేఖ, కన్నం జై, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు ఎం తిరుపతిరెడ్డి, లక్ష్మి, సరోజన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు జిన్న రాంచందర్రెడ్డి, కొయ్యడ సతీశ్ గౌడ్, పడాల సతీశ్ గౌడ్, మూల మహేందర్రెడ్డి, గాదం శ్రీనివాస్, తిరుపతి రావు, కనకయ్య, స్వామి, రాజయ్య, మిట్టపల్లి శ్రీను, పెగడ శ్రీనివాస్, కొయ్యడ శ్రీను, మేకల లక్ష్మణ్, నర్ల పోలు రాజు, సదయ్య పాల్గొన్నారు.
పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తాం..
స్వరాష్ట్రంలో పెద్దపల్లి నియోజకవర్గం అన్నింటా దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే దాసరి కృషితో వందలాది కోట్లతో ప్రగతి జరుగుతున్నది. ఒకప్పుడు పెద్దపల్లి – కూనారం రైల్వే ట్రాక్పై ఆర్వోబీ లేకపోవడంతో పెద్దపల్లికి కూతవేటు దూరంలో ఉన్న హన్మంతునిపేటకు వెళ్లాలంటే నరకం కనిపించేది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే దేవుడి మీద భారం వేయడం తప్ప చేసేది ఏం లేకపోతుండె. ఎందరో పాలకులు మారినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కానీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పట్టుబట్టి ఆర్వోబీ సాధించిండు. రూ.119 కోట్లతో పనులు శరవేగంగా సాగుతున్నయ్. ఇలా ఒక్కటేమిటి దశాబ్దాలనాటి సమస్యలన్నీ పరిష్కారమైతున్నయ్. ఇంతకంటే ఏం కావాలి. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎరగవేసి. సీఎం కేసీఆర్కు బహుమానంగా ఇస్తాం.
– బండారి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు, పెద్దపల్లి.