ప్రగతి పథం.. సంక్షేమ హితమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు మరోసారి వరాల జల్లు కురిపించింది. గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. ఎవరూ ఊహించనటువంటి అంశాలే ఎజెండాగా ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాలు నింపే కార్యక్రమాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది. ముఖ్యంగా ‘గృహలక్ష్మి’ పథకం కింద సొంత జాగ ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 3లక్షలు అందించాలని నిర్ణయించగా, ఉమ్మడి జిల్లాలో 36వేల మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఇక బృహత్తర దళితబంధు రెండో విడుత కింద మరో 13,200 మందికి లబ్ధి కలుగనున్నది. వచ్చే ఏప్రిల్ నుంచి మొదలయ్యే రెండో విడుత గొర్రెల పంపిణీ ద్వారా 28 వేల కుటుంబాలకు యూనిట్లు అందనుండగా, జీవోనంబర్ 58,59 ద్వారా సుమారు 21 వేల మంది తమ స్థలాలు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశమున్నది. ఇంకా యాసంగిలో పండే ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో లక్షలాది మంది రైతులకు ఊరట లభించినట్లుకాగా, క్యాబినెట్ నిర్ణయాలపై సబ్బండవర్గాల్లో సంతోషం కనిపిస్తున్నది.
– కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నాకు పదేండ్ల కింద పెండ్లయింది. మాకు ఏరు పోసిన్రు. మా అయ్యవ్వ నాకిచ్చిన యాభై అరవై గజాల స్థలంలో ఇల్లు కట్టుకొని ఉండుమని చెప్పిన్రు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే నాకు ఇల్లు కట్టేంత పైసలెక్కడియి. నెలా నెలా నాకు అచ్చేది అంతంతే. అవిటితోనే నేను, నా కుటుంబం బతకాలె. ఇంక ఇల్లెప్పుడు కట్టుకుంట. అందుకే మొదట్ల కిరాయి ఇంట్ల ఉన్న. అప్పుడు నెలకు వెయ్యి పదిహేను వందల కిరాయి, రెండు మూడు వందల కరెంట్ బిల్లు కట్టేది. మిగిలిన పైసలతో జీవితం గడుసుడే కష్టమైంది. నా యాభై అరవై గజాల జాగలోనే ఐదారు రేకులతోటి షెడ్డు వేసుకున్నం.
షెడ్డుకు గోడలు కట్టేందుకు సైతం పైసల్లేకుండె. గోనె, యూరియా సంచులు, పరదాలు కట్టిన. ఇప్పుడు అందులోనే బతుకుతున్నం. వాన గొడితే తడుస్తున్నం. సలికి వణుకుతున్నం. ఎండకాలంల గాలివెడితే సంచులు, రేకులు ఎగిరిపోతయని భయపడుతున్నం. ఇట్ల అష్టకష్టాలు పడుకుంట అండ్లనే ఎల్లదీస్తున్నం. నా భార్య మౌనిక రెండు మూడు నెలల నుంచి బడిలో మధ్యాహ్న భోజనం వండెతందుకు పోతుంది. ఇప్పుడిప్పుడే నాలుగు రూపాయలు కూడవెడుతున్నం. ఎైట్లెన జేసి ఇళ్లు కట్టుకోవాలన్నది మా ఆశ. సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం ప్రకటించడం నాకు ఆనందంగా ఉంది. దేవుడి దయవల్ల మేం ఎంపికైతే, సర్కారిచ్చే 3 లక్షల రూపాయలకు ఇంకిన్ని కలుపుకొని చిన్న ఇల్లు కట్టుకుంటం. మాలాంటోళ్ల కోసం సీఎం కేసీఆర్ సార్ ఇప్పటికే మస్తు మంచిపనులు జేసిండు. ఇప్పుడు ఇళ్లు కట్టుకునేందుకు పైసలు ఇత్తే ఆయన మా పాలిట దేవుడే.
– బాస విష్ణు వర్ధన్, మౌనిక దంపతులు, తిమ్మాపూర్ (జగిత్యాల రూరల్ మండలం)
కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్, నమస్తే తెలంగాణ: ఆది నుంచీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి క్యాబినెట్ మీటింగ్లోనూ మరిన్ని సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే రెండో విడుత గొర్రెల పంపిణీని ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. దళితబంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించడమే కాదు, ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి లబ్ధి కల్పించాలని నిర్ణయించింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 58,59 కటాఫ్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాదు, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు మరో నెల సమయం ఇవ్వాలని, రెండో విడుత దళితబంధు పథకం, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ప్రణాళికలు వేసింది. ఇంకా ఇలా క్యాబినెట్ నిర్ణయాలతో ఉమ్మడి జిల్లాలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో లబ్ధి చేకూరనున్నది.
36 వేల మందికి ఇండ్లకు సాయం
సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభించాలని, దీని కింద 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముందుగా 3వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయడానికి క్యాబినెట్ ఒకే చెప్పింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. నిజానికి ఇది వినూత్న పథకం. దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా లేదు. ఈ పథకం గురించి ప్రజల నుంచి విజ్ఞప్తులు సైతం ప్రభుత్వానికి వెళ్లాయి. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వెంటనే చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు 3 లక్షలను మూడు దఫాలుగా లక్ష చొప్పున ఖాతాల్లో నేరుగా జమచేయనున్నది. అందుకోసం బడ్జెట్లో 12వేల కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
మానస కష్టం తీరుతది
ఈమె పేరు తరాల మానస. ఊరు జగిత్యాల మండలం తిమ్మాపూర్. దళిత కుటుంబానికి చెందిన ఈమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. దీంతో అల్లీపూర్ గ్రామానికి చెందిన రాకేశ్కు ఇచ్చి పెండ్లి చేసి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నరు. అటు తల్లిగారి వైపు, ఇటు అత్తగారి వైపు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో మానస తల్లిదండ్రులు అల్లుడికి మొండి గోడలతో ఉన్న అరవై గజాల స్థలాన్ని ఇచ్చిన్రు. వీరికి ఇద్దరు పిల్లలు. తప్పని పరిస్థితుల్లో రాకేశ్ ఏడాది కింద 3లక్షలు అప్పు చేసి దుబాయ్కి పోయిండు. నెలకు రూ.20వేల జీతానికి డ్రైవర్గా చేరిండు. తమకిచ్చిన అరవై గజాల స్థలంలో ఏనాటికైనా ఇంటిని నిర్మించుకోవాలని ఆ దంపతులు ఆశపడ్డరు. ఇప్పటికే 3లక్షల అప్పు ఉండడం, పిల్లల చదువు కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో దిగులు చెందిన్రు. తాజాగా రాష్ట్ర సర్కారు ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని ప్రకటించడంతో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రభుత్వం చేసే ఆర్థిక సాయంతో ఎలాగైనా రెండు రూములు వేసుకుంటామన్న నమ్మకం కలిగింది. కేసీఆర్ సారు ఇంత గొప్ప పథకాన్ని తీసుకురావడం సంతోషంగా ఉన్నదని మానస సంబురపడుతున్నది. తమకు సాయం అందింతే నా భర్త, బిడ్డ, కొడుకుతో సొంతింటిలో బతుకుతామని చెబుతున్నది.
జీవో 58, 59 కటాఫ్ గడువు పొడిగింపు
భూముల క్రమబద్ధీకరణ సంబంధించి జీవో 58, 59 కటాఫ్ గడువును పొడిగించాలని చేసిన విజ్ఞప్తుల మేరకు మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. కటాఫ్ గడువును 2014 నుంచి 2020కి పొడిగించాలని నిర్ణయించడమే కాదు, దరఖాస్తులకు నెల రోజుల గడువు ఇచ్చింది. గతంలో ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 10,300పై చిలుకున్నాయి. కటాఫ్ డేట్ను పొడిగించడం వల్ల మరో 10వేలకుపైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో 21వేల మందికిపైగా లబ్ధి చేకూరనున్నది.
కొనుగోళ్లతో భరోసా
గతానికి మించి ఈ యాసంగిలో ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశమున్నది. అయితే కొనుగోలు విషయంలో కేంద్రం గతంలో మాదిరిగానే తాజాగా మరో కొర్రీ పెట్టింది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆది నుంచీ రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మరోసారి సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. ఈ సారి యాసంగి పంటలను ఏప్రిల్ నుంచి కొనాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం రైతులకు భరోసా ఇవ్వనున్నది. కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా అన్నదాత పండించిన చివరి గింజ దాకా కొనాలని నిర్ణయించడంపై కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఏప్రిల్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ
ఏప్రిల్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీకి క్యాబినెట్ ఆమోద ముద్రవేసిన విషయం తెలిసిందే. తద్వారా పూర్వ జిల్లాలోని నాలుగు జిల్లాల్లో భారీగా యూనిట్లు పంపిణీ కానున్నాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం 26,958 యూనిట్లు అర్హత ఉండగా, ఇప్పటివరకు 17,105 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. కాగా ఇంకా 9,853 యూనిట్లు రెండో విడుత అందనున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 20,770 గుర్తించగా, మొదటి విడుతలో 10,245 ఇచ్చారు. రెండో విడుతలో 10,545 పంపిణీ చేయనున్నారు. జగిత్యాలో జిల్లాలో మొత్తం 21,067 అర్హత ఉండగా, ఇప్పటికే 17,448 ఇచ్చారు. ఇంకా 3,619 యూనిట్లు రెండో విడుత ఇవ్వనున్నారు. అలాగే రాజన్నసిరిసిల్ల జిల్లాలో 16,162 యూనిట్లు గుర్తించగా, అందులో 11,542 ఇచ్చారు. ఇంకా 4,620 యూనిట్లు రెండోవ విడుత పంపిణీ చేయనున్నారు. ఒక యూనిట్ కాస్టు మొత్తం 1,25,000 కాగా, అందులో లబ్ధిదారుల వాటా 31,250 ఉన్నది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సమకూర్చనున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటికే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
ఆనందహేల
తిమ్మాపూర్ రూరల్, మార్చి 10 : హైదరాబాద్ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేదర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరిస్తామని క్యాబినెట్ తీర్మానం చేయడంపై దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో తిమ్మాపూర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అలాగే రెండో విడుత దళితబంధు కింద ప్రతి నియోజకవర్గంలో 1100 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని ప్రకటించడంపైనా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని కొమురయ్య, నాయకులు నగునూరి బాబు, వంతడుపుల సంపత్, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, కోయడ మురళి,గంగిపెల్లి సంపత్, పారునంది జలపతి,దుర్గం అశోక్, తూర్పటి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
13,200 మందికి దళితబంధు
2021 ఆగస్టు 16న ప్రారంభమైన దళిత బంధు పథకాన్ని, రాష్ట్ర సర్కారు ముందుగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అక్కడ వంద శాతం విజయవంతంగా పూర్తి కావడంతో రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1100 కుటుంబాలకు లబ్ధి కల్పించనున్నది. ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలో హుజూరాబాద్ను మినహాయిస్తే.. మిగిలిన 12 నియోజకవ్గాల్లో 13,200 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి 10 లక్షల చొప్పున లబ్ధి కల్పించనున్నది. ఇటీవలి బడ్జెట్లో 12,980 కోట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.
గొర్లతో బతుకుదెరువు
నాకు ఏడాదిన్నర కింద గొర్రెల పంపిణీ పథకం కింద 20 గొర్లు, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. రోజూ గొర్లను మేతకు అడవికి తీసుకెళ్లి సాయంత్రం తిరిగి తీస్కొని వస్త. కంటికి రెప్పలా కాపాడుకుంటూ గొర్రెల సంఖ్యను మూడింతలకు పెంచిన. ఇప్పుడు నా మందలో జీవాల సంఖ్య 60కి చేరింది. గొర్రెల పెంపకంతో జీవనం సాగించే మాలాంటోళ్లకు సీఎం కేసీఆర్ సారే మేలు చేసిండు. మా తాతల కాలం నుంచి గొర్లు కాసుకుంటనే బతుకుతున్నం. నాటి ప్రభుత్వాలు మమ్ముల పట్టించుకోలే. బీఆర్ఎస్ సర్కారే గొర్రెలు ఇచ్చి బతుకుదెరువు చూపింది. ఎదిగిన గొర్లు అమ్ముకుంట దర్జాగా బతుకుతున్న. ఇపుడు రంది లేదు. కేసీఆర్ సార్తోనే నా జీవితం నిలబడ్డది. రానోళ్లకు మళ్లీ రెండోసారి ఇస్తడని ఇయ్యాల మా ఊళ్లే అనుకుంటుంటే విన్న. చానా సంబురమైది. మా యాదవులందరికీ మేలైతది.
– వన్నెబోయిన మహేందర్ యాదవ్, అమ్మక్కపేట (ఇబ్రహీంపట్నం మండలం)
మా బాధలు తీరుతయ్
నాకు పదిహేనేళ్ల కిందట పైండ్లెంది. నాకు ఇద్దరు పిల్లలు. నా పైండ్లెనంక మా నాన్న మాకు ఉన్న భూమిని పంచి ఇచ్చిండు. దాంతోటి నాకు గుంట కంటే ఎక్కువనే భూమి వచ్చింది. ఎల్లుమాను లేక నాకు ఉన్న భూమిలో సగం దాక ఇటుకలు పెట్టుకొని గుడిసె ఏసుకున్నం. నేను నా భార్య కూలీ పనిజేసుకొని బతుకుతున్నం. నా దరిద్రానికి నాకు పెయింటింగ్ ఎయ్యవోతే నడుం ఇరిగింది. దాంతోటి అరిగోస పడ్డం. పైస పైసకు చానా తిప్పలైతంది. ఉన్న గుడిసెల చానా ఇబ్బందైతంది. చిన్న వానకొట్టినా గుడిసంతా ఉరుత్తది. పొలాలు పక్కనే ఉండడంతో నీళ్లు ఇంట్లకత్తయి. పగలు, రాత్రి ఎప్పుడు వడితే అప్పుడు ఇంట్లకు పాములు వస్తయి. గోసైతంది. నిన్ననే ఇంటి జాగ ఉన్నోళ్లకు సీఎం సార్ 3లక్షలు ఇస్తడని టీవీల జూసినం. చానా సంతోషమైంది. మాలాంటోళ్ల బాధలు తెలుసు కాబట్టే సీఎం సార్ ఇట్లాంటి మంచి ఆలోచన చేసిండు. సర్కార్ ఇళ్లు కట్టుకునేటందుకు ఇచ్చి గృహలక్ష్మితో మాకు గుడిసె బాధలు తీరుతయి.
– కీర్తి రమేశ్-మమత, సుల్తాన్పూర్ (ఎలిగేడు మండలం)
పేదల బతుకులు బాగుపడుతయ్
మాది సిరిసిల్ల పక్కనే రాజీవ్నగర్. నా భర్త అంజయ్య సాంచాల పనిజేత్తడు. నేను బీడీలు చుడుత. మాకు ముగ్గురు పిల్లలు. మాకు గుంట జాగున్నది. కానీ, జాగుంటే ఏం లాభం? ఇల్లు కట్టుకుంటే లచ్చలు కావాల్నాయె. సాంచాలు పని, బీడీల పని జేత్తే ఇల్లు కట్టే పైసలత్తయ? ఇప్పుడు కేసీఆర్ సారు జాగ ఉన్నోళ్లకు 3లచ్చలు కేసీఆర్ సార్ ఇత్తడంట అని గియ్యాల్నే పేపర్లో వచ్చిందని మాసర్పంచ్ చెప్పిండు. సంబరమనిపించింది. పైసలిస్తే మాపిల్లల కోసమన్నా ఇల్లు కట్టుకుంటం. బీడీల పింఛను ఇత్తుండు. ఇప్పుడు ఇల్లుకు పైసలిస్తున్నడు. నిజంగా కేసీఆర్ సారు పదికాలాలు సల్లంగా ఉండాలె. ఆయనతోనే మాలోంటి పేదల బతుకులు బాగుపడుతయి.
– దారం రేణుక, రాజీవ్నగర్ (సిరిసిల్ల)
కిరాయి ఇంట్ల ఉంటున్నం..
మాది చానా పేద కుటుంబం. నేను సుతారి పని జేస్త. నా భార్య ఇండ్లల్ల పనిజేస్తది. నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఉండెటందుకు నిలువ నీడ లేదు. ఉన్న ఇల్లు ఏడేండ్ల కింద కూలిపోయింది. అప్పటి నుంచి ఊళ్లెనే కిరాయి ఇంట్ల ఉంటన్నం. మేం ఇద్దరం సంపాయించిన పైసలన్నీ పిల్లల పోషణకే అయితున్నయి. కూలిన ఇంటి జాగల ఇళ్లు కట్టుకుందామంటే చేసిన పనిల పైస మిగుల్తలేదు. మూడేండ్ల కింద బెందడి రాయి తెచ్చి పోసుకున్నం. ఎన్నటికన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్న. నిన్న సీఎం సార్ ఇంటి జాగ ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తమని చెప్పినోలె మాకు చానా సంబురమైతంది. సీఎం సార్ మాలాంటోళ్లకు దేవుడు. ఆయన దయవల్ల నాకు ఇల్లయితది.
– ముదురుకోళ్ల రాము-నాగలక్ష్మి, చిన్నకల్వల (సుల్తానాబాద్ మండలం)
సార్ మంచి పన్జేసిండు
ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నపుడు మళ్ల పైసలు గట్టాల్నని ఎవరూ జెప్పలే. కట్టుకున్న పైసలు మల్ల కట్టాల్నట అని ఆల్లీళ్లు అనవట్టిన్రు. ఈ ఇల్లు మా ముసలాయిన పేరు మీదచ్చింది. ములసోడువోయి యాడాదినర్ధం అయితంది. నా కొడుకు కట్టం ఆనికే సరిపోవట్టే. పిలగాండ్లను సాదుడే కట్టమైతంది. ఇంటిమీద పైసలు ఎట్లగడ్తం? అప్పట్ల ఇల్లుకు పైసలిత్తె యాడ సరిపోయినయ్. మీదికెళ్లి అడ్డగోలు పైసలేసుకుంటే ఇల్లయింది. మళ్ల ఇచ్చిన పైసలు కట్టాల్నంటే యాడికెళ్లి తెచ్చికడ్తం. పైసలు మాపి చేసి కేసీఆర్ సార్ మంచి పని చేసిండు. మాకింత మేలైతది. అపుడు ఇచ్చిన ఇండ్లు ఎట్లున్నయ్. ఇపుడు మంచిగ గట్టుకోని పైసలిస్తరటగదా. గిప్పుడు ఇండ్లుగట్టుకునెటోళ్ల పని నయమున్నది.
– దయ్యాల కనకవ్వ, పోచమ్మవాడ (మానకొండూర్)
గొర్లిచ్చి సంపద పెంచిండు
మేం ఇద్దరం అన్నదముళ్లం. మా తమ్ముడు చిన్నోడు చదువుకుంటున్నడు. నేను బతుకుదెరువు కోసం ఆరేళ్లు గల్ఫ్ దేశం పోయచ్చిన. మా ఊళ్లో వంద యాదవ కుటుంబాలున్నయి. మా గొల్ల కుర్మల కష్టాల్లో పాలు పంచుకుంటున్న మొదటి ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నం. కేసీఆర్ సారు పద్దెనిమిదేండ్లు నిండినోళ్లకు గొర్లనిస్తూ మా సంపద పెంచిండు. మూడేళ్ల కింద జీవాలు కొందరికి వచ్చినయి. ఇంకొంతమందికి రాలేదు. వచ్చే నెల నుంచి వస్తయని అంటున్రు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడిచ్చిన గొర్లు మంచిగా హెచ్చినయి. అన్ని రోగాలకు తట్టుకుంటున్నయ్. అంగట్ల మంచిరేటు పలుకుతున్నయ్. మా కష్టాసుఖాల్లో పాలు పంచుకుంటున్నా సారుకు రుణపడి ఉంటం.
– బుర్రవేణి నాగరాజు, బొప్పాపూర్ (ఎల్లారెడ్డిపేట మండలం)
సారు మళ్లీ రావాలి
నాభర్త రాజు ఏడాది కింద చనిపోయిండు. నాకు ఒక కొడుకు వంశీ. గంభీరావుపేటలోని కేజీటూపీజీలో డిగ్రీ చదువుతుండు. నాకు ఒక కూతురు వైష్ణవి. ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. నేడు బీడీలు చుడుత. కేసీఆర్ సార్ ఇచ్చే వితంతు పింఛన్తో బతుకు ఎల్లదీస్తున్న. దళితబంధుతో అందరూ వ్యాపారాలు చేసుకుంటూ మంచిగా బతుకుతున్నమని తీసుకున్నోళ్లు అంటుంటే నాకు ఆశ పుట్టింది. మా కులంలో వ్యాపారాలు చేసే వాళ్లే లేరు. దళితబంధుతోనే అది జరిగింది. ఈ యేడు నియోజకవర్గంల 1100 మందికి దళితబంధు ఇస్తామని కేసీఆర్ చెప్పినట్టు పేపర్ల వచ్చిందని మా కొడుకు అన్నడు. నాకు ఈ సారి వస్తదనే నమ్మకం ఉంది. హోటల్ లేదా, పిండి గిర్ని పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంట. మాసోంటోళ్ల కోసం ఇన్ని మంచి పనులు చేస్తున్న సారు మళ్లీ రావాలి.
– నల్ల భవాని, బరిగెల గూడెం (గంభీరావుపేట)
అంబేద్కర్ అంటే కేసీఆర్కు గౌరవం..
అంబేద్కర్ అంటే సీఎం కేసీఆర్కు ఎనలేని గౌరవం. ఆయనపై ఉన్న గౌరవంతోనే హైదరాబాద్ల 125 అడుగుల నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నరు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే ఏప్రిల్ 14న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పడంతో యావత్ తెలంగాణ సమాజమే సంతోషిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్లో ఉన్న గొప్ప నాయకుడి లక్షణాలుగా చెప్పచ్చు. దళిత బంధు పథకం పెట్టి అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని దళితలకు అమలు చేస్తున్నరు. ఇలాంటి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటున్న నాయకుడు కేసీఆర్. అంబేద్కర్ వాదులుగా మేమెప్పుడు కేసీఆర్ వెన్నంటే ఉంటాం. విగ్రహావిష్కరణను పండుగలా జరుపుకుంటం.
– సముద్రాల అజయ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు (కరీంనగర్)
నాకు ఇగ ఇల్లస్తది
మేము కూలీ చేసుకుని బతికెటోళ్లం. ఇల్లు జాగ ఉన్నది. కానీ, ఇల్లు కట్టుకునేందుకు పైసల్లేవు. మొదటి సంది ఇంత రేకులేసుకొని బతుకుతన్నం. వానస్తే ఉరుత్తన్నయ్. గోడలు కూలిపోయెతానికచ్చినయ్. పైసలు లేక గిదే రేకుల కింద బతుకుతున్నం. ఇల్లు కట్టుకుందామని ఆశ ఉన్నా చేతిల పైసలు ఏడ ఉన్నయి. అప్పు చేసే ధైర్యం లేదు. మా పరిస్థితి చూసిన సార్లు గప్పట్లనే మాకు ఇల్లస్తదని చెప్పిన్రు. ఆశ పుట్టింది. ఇపుడు కేసీఆర్ మా లెక్క జాగలుంటే మూడు లచ్చెలు ఇస్తమని చెప్పినంక పాణమచ్చింది. నాకు సుతం ఇల్లత్తదని నమ్మకమచ్చింది. కేసీఆర్ సార్ పైసలిత్తే రేకులు తీసి ఇంత చెత్తువోసుకుంటం. సారిచ్చే పైసలు అందినకాడికి ఇల్లు మంచిగ చేసుకుంటం. కేసీఆర్ సార్ చాన మంచి పనులు చెత్తండు. మాసోంటి ంటి నీడ లేనోళ్లకు ఇంత నీడ చేత్తున్నడు. చానా సంతోషం.
– బొల్లెబోయిన పద్మ, ఇప్పల్నర్సింగాపూర్(హుజూరాబాద్)
నాకు పట్టా అస్తది..
సర్కారు జాగలల్లా తెలిసో తెల్వకో ఇంత గూడు కట్టుకున్నోళ్లకు క్రమబద్ధీకరిస్తమని మల్లోసారి చాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. చానా రోజుల సంది నేను సర్కారు జాగల ఇంత చిన్న ఇల్లేసుకున్న. ఇదువరకు ఇంటికి కాయితం లేదు. గవర్నమెంట్ జాగల ఇండ్లేసుకున్నోళ్లకు పట్టాలిస్తమని చెప్పినపుడు నాకు చానా సంతోషమేసింది. నేను సుతం దరఖాస్తు చేసుకున్న. పట్టా ఇస్తరని ఎదురు చూస్తున్న. నాకు ఈ జాగ తప్పా ఇంకోటి లేదు. కొనుక్కుందామన్న పైసల్లేవు. నాలెక్కనే చానా మంది ఇట్లనే ఇంత ఇల్లు కట్టుకొని, రేకులేస్కొని ఉంటున్నరు. ఇప్పుడు కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయంతోని మళ్ల నా అసొంటోళ్లందరికీ సంతోషమైతంది. ఇపుడు తప్పకుంట మాకు పట్టాలస్తయని ఆశ పడుతున్నం.
– జీ శ్రీనివాస్, తీగలగుట్టపల్లి (కరీంనగర్)
నా అసొంటి పేదోళ్లకు మేలైతది
నాకు భర్త లేడు. బిడ్డ ఉంటే చనిపోయింది. ఒక్క కొడుకు, నేను ఉంటం. మా ఇల్లు మొత్తం కూలిపోతున్నది. పంచాయతీ ఆఫీసుల స్వీపర్గ పన్జేసుకుంట కొడుకును సాదుకుంటున్న. అందరి లెక్కా నాకు ఇల్లు కట్టుకోవల్నని ఉన్నా చేతిల పైసలు లేక ఇబ్బంది వడ్తన్న. కూలుతున్న ఇంట్లనే ఉంటున్నం. కేసీఆర్ సార్ మా అసొంటోళ్లకు కొత్త పథకం పెట్టి ఇల్లు కట్టుకుంటే పైసలు ఇస్తనని అంటున్నరు. నాకు పాణం లేసచ్చినంత పనైతంది. మా ఊరుకు కొన్నిండ్లత్తే అండ్ల నాది సుతం ఉంటదని ఆశపడుతున్న. కేసీఆర్ దయతోని ఇల్లు కట్టుకుంటమనే ధైర్నం వచ్చింది. చానా సంతోషం. సారుకు రుణపడి ఉంటం.
– దాసారపు రాణి, వీణవంక
శబరిమలలో భవన నిర్మాణం సంతోషకరం
ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. ఏయేటికాయేడు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మన తెలంగాణలోని అయ్యప్ప భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శబరిమలలో 25 కోట్లతో భవనం నిర్మించాలని నిర్ణయించడం సంతోషకరం. ఈ భవనాన్ని పంప, శబరిమలలో నిర్మిస్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతరు.
– గడప నాగరాజు, అయ్యప్ప మహాపాదయాత్ర బృందం గురుస్వామి (కరీంనగర్)
కేసీఆర్ సంకల్పసిద్ధికి నిదర్శనం
కాశీ యాత్రకు వెళ్లిన భక్తులు సరైన వసతిలేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అందుకోసం వేలకు వేలు ఖర్చుచే సేది. ఈ క్రమంలో ప్రభుత్వం వారణాసిలో భక్తుల సౌకర్యార్థం 25 కోట్లలో భవనం నిర్మించాలని నిర్ణయించడం గొప్ప విషయం. ఈ నిర్ణయంతో ఆధ్యాత్మికతపై సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధిని తెలియజేస్తున్నది. ఈ మహత్తర కార్యానికి ఉపక్రమించిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు
– నలుమాచు చంద్రశేఖర్, ఆధ్యాత్మికవేత్త (కరీంనగర్)
కేసీఆర్ సారుకు శనార్థులు
నాకు 65 ఏండ్లుంటయ్. గొర్లు కాయవట్టి 50 ఏండ్లయితంది. గొర్లు సాదుకొనే ఇద్దరు బిడ్డలకు, ఇద్దరు కొడుకులకు పెండ్లీళ్లు చేసిన. మనమలు, మనమరాళ్లు వచ్చిన్రు. నాకు ఇప్పుడైతే 200 దాకా సనుగులు ఉన్నయి. ఇద్దరు పాలేర్లను వెంట పెట్టుకొని గొర్లు మేపేతందుకు ఊరవలతలికి పోత. మొదటి సారి గొర్లు ఇచ్చినప్పుడు నాకు రాలె. మళ్లో సారి ఇస్తమని సార్లు చెప్పిన్రు. వచ్చే నెల నుంచి కేసీఆర్ సారు ఇత్తరని మా ఊరోళ్లు అన్నరు. నాకు చానా సంబురమైంది. నా ఇన్నేండ్ల కాలంల గింత మంచి పని చేసినోళ్లను ఎన్నడూ చూడలె. ఏ సర్కారు మమ్ముల ఆదుకోలె. సీఎం కేసీఆర్ సారుకు శనార్థులు.
-కాల్వ మల్లయ్య, గొర్లకాపరి, ధూళికట్ట (ఎలిగేడు మండలం)
మాలోంటోళ్ల కల తీరుతది
నాపేరు జ్యోతి, మా ఆయన పేరు ఆనంద్. ఒక్క బిడ్డ ఉంది. మాది పేద కుటుంబం. గుట్టకు బండలు కొట్టి బతుకుతున్నం. అచ్చిన పైసలు బట్టపొట్టకే సరిపోతలేవు. పెద్దలు ఇచ్చిన కొద్ది జాగలో గుడిసె ఏసుకుని ఎల్లదీత్తున్నం. వానకాలం గుడిసె ఉరుస్తది. రాత్రయితే జాగారం జేసుడే. మంచి ఇల్లు కట్టుకోండని అందరంటున్నరు. పైసలు ఎక్కడికేలి వత్తయ్. రోజూ దేవున్ని మొక్కుతున్నం. ఇప్పుడు ఆ దేవుడే కరుణించి కేసీఆర్ సార్ రూపంలో వచ్చిండనుకుంటున్నం. జాగున్నోళ్లకు కేసీఆర్ సారు రూ.3 లచ్చలిత్తడంటని పేపర్లో వచ్చిందని ఊరోళ్లు చెప్తే సంతోషమనిపించింది. ఇన్నాళ్లకు ఇల్లుకట్టుకునే కోరిక తీరుతది. అందరికీ మంచి చేత్తన్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– జ్యోతి, పెద్దూరు (సిరిసిల్ల అర్బన్ మండలం)