చిగురుమామిడి, డిసెంబర్ 28: దేశంలో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి అన్నదాతలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రైతు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ను స్థాపించి కేంద్రాన్ని ఎదురించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, బీఆర్ఎస్తో దేశంలో తెలంగాణ సత్తా ఏమిటో చూపిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కాళేశ్వరం, పాలమూరు, మిషన్ కాకతీయతో నీళ్లు, లక్ష ఉద్యోగాలు ఇచ్చి నియామకాలు చేశామన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు. రైతు బంధుకు రూ.7 వేల కోట్లు యాసంగిలో ఇచ్చామన్నారు. 50 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకొచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నందునే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచన సీఎం కేసీఆర్కు వచ్చిందన్నారు. తెలంగాణ పథకాలను అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వారికి ప్రచారం తప్ప పని చేయడం తెలియదన్నారు. కోట్లు కొల్లగొట్టి విదేశాల్లో జల్సాలు చేసే వారిని మోదీ పట్టించుకోకపోవడం ఆయనకు కార్పొరేట్లపై ఉన్న ప్రేమకు నిదర్శనమని విమర్శించారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కంపెనీలకు విక్రయించి పేదలకు అన్యాయం చేస్తున్న బీజేపీని రాబోయే రోజుల్లో ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ లక్ష్యాలు, ఇక్కడ అమలవుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ను ప్రధాని చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నియోజకవర్గంలో త్వరలోనే పట్టణ, పల్లె బాట కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. శనిగరం, సింగరాయ, మహాసముద్రంగండి లాంటి ప్రాజెక్ట్లను పునరుద్ధరించడం, గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్మాణం తుది దశలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఇప్పటికే దేవాదుల, కాకతీయ కాలువ, తోటపల్లి రిజర్వాయర్ల ద్వారా 57 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పారు. గౌరవెళ్లి ప్రాజెక్ట్ పూర్తయితే మరో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. నియోజకవర్గంలోని 80,348 మంది రైతులకు యాసంగి సీజన్కు గానూ పెట్టుబడి సాయం రూ.520 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 686 మంది రైతులకు రూ. 20 కోట్లు రైతు బీమా కింద ఇచ్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం హుస్నాబాద్లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. మండల స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసిన అనంతరం ఊరూరా పండుగ వాతావరణంలో జెండావిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు పన్యాల భూపతిరెడ్డి, కర్ర శ్రీహరి, సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు కొత్త వినీత, మానస, మాలోతు లక్ష్మి, కొక్కుల కీర్తి, అనిత, ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీలు గీకురు రవీందర్, భూక్యా మంగ, నాగరాజు శ్యామల, వంగ రవీందర్, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, నాయకులు వెంకట్రాంరెడ్డి, ఎండీ అన్వర్, పెసరు సాంబరాజు, ఆవుల మహేందర్, మామిడి అంజయ్య, సోమారపు రాజయ్య, సుద్దాల చంద్రయ్య, జంగ వెంకటరమణారెడ్డి, బేతి రాజిరెడ్డి, కరివేద మహేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, అశోక్బాబు, ఆకుల వెంకట్, నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.