రామడుగు, అక్టోబర్ 26: మీ దీవెనార్థితో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం మోతె, గోలిరామయ్యపల్లి, కొరటపల్లి, షానగర్, పందికుంటపల్లి, కుర్మపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి సాగు, తాగునీరందించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
అన్నదాతలను ఆదుకునేందుకు c, రైతుబీమ పథకాలు తెచ్చి వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లక్షా నూటపదహార్లు అందిస్తున్న రాష్ట్రం దేశంలో కేవలం మనదేనన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. అరవై ఏండ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ను నమ్మితే కర్ణాటక రాష్ట్రంలో ప్రజలను నమ్మించి ముంచినట్టు మనల్ని కూడా నట్టేట ముంచుతరన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ను గెలిపిస్తారో, లేక మూడు గంటలే ఇస్తమన్న కాంగ్రెస్ను గెలిపిస్తరో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
దేశాన్ని 60 ఏండ్లు ఏలిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ఆరు గ్యారంటీలతో మళ్లీ మీ ముందుకు వస్తున్నదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలప్పుడు వచ్చే పగటి వేషగాళ్లను నమ్మవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు ఎందుకు ఇస్తలేరో ప్రశ్నించాలన్నారు. ఎందుకు 24 గంటల కరెంటు ఇస్తలేరో ఎదురు తిరిగి అడుగాలన్నారు. మీ ప్రాంతం బిడ్డననీ, మీకు అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని పేర్కొన్నారు.
తనను ఆదరించి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్, ఆయా గ్రామాల సర్పంచులు అంబటి నారాయణ, మన్నె దర్శన్రావు, సైండ్ల కవిత-కరుణాకర్, జంగిలి శ్రీలత-రాజమౌళి, ఎంపీటీసీ కొత్త స్వప్న-వెంకటేశ్, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ జూపాక కరుణాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.