Anganwadi centers | ఓదెల, ఆగస్టు 2 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల, మడక గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు జరిపారు. ఈ సమావేశాల్లో సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేశారు.
ప్రభుత్వం పేద మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే అపోహాలను వీడి తల్లిపాలు త్రాగించాలని కోరారు. తల్లిపాల వలన బిడ్డ ఆయుష్షును పెంచిన వారవుతారని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. డబ్బా పాలు వద్దు… తల్లిపాలేముద్దని తెలియజేశారు.
అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. గర్భిణీలు ప్రసవ సమయంలో సిజేరియన్ల వైపు వెళ్లకుండా సాధారణ కానుపు చేయించుకుంటే మంచిదని సూచించారు. ఆయా గ్రామాలలోని గర్భిణీలకు శ్రీమంతాలు చేసి, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలలో ఎంఈఓ రమేష్, హెచ్ఎం అశోక్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు రాజేశ్వరి, మహేశ్వరి, యశోద, రమాదేవి, సుమలత, రమ, పి హెచ్ ఎన్ ఓ శోభారాణి ,ఏఎన్ఎంలు శ్రీలత, ఆశా కార్యకర్తలు సుజాత, రజిత తదితరులు పాల్గొన్నారు.