బోయినపల్లి, అక్టోబర్ 20: కాంగ్రెస్, బీజేపీలాగా అధికారం కోసం పుట్టిన పార్టీ తమది కాదని, ప్రజలకు అండదండగా ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన బోయినపల్లిలో బీఆర్ఎస్ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ తరఫున ఇంటింటా ప్రచారం చేశారు. తర్వాత మర్లపేటలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.
60ఏండ్ల పాల నలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిం దని, ఈ ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వమని ఆ పార్టీ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేం ద్రంతో సహా 19రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కొత్తగా ఇక్కడ చేసేదే మీలేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్, బీజేపీ నైజమని, ఆ పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రాజెక్టుల కోసం తప్పా ప్రభుత్వం అదనంగా ఎలాంటి అప్పు చేయలేదన్నారు.
కావాలంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు లెక్కలు చూసుకోవచ్చని సవాల్ విసిరారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్కు, గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాఫీ కొట్టామని అనడం సిగ్గుచేటని విమర్శించారు. కర్ణాటకలో ఆరు సూత్రాలు ఎందుకు అమలు చేయడం లేదో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల అబద్ధపు మాటల విని మోసపోతే గోసపోతామని సూచించా రు. బీర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు.
ఈ ఐదేండ్లు ఎలాంటి అధికారం లేకపోయినా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించానని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, జోగినపల్లి ప్రేమ్సాగర్రావు, జిల్లా నాయకులు చెన్నాడి అమిత్కుమార్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలి. నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తా. వలస వచ్చిన వారికి విముక్తి పలుకాలి. ఇప్పుడు వారు ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారు. నేను మాత్రం ఎప్పటికీ ఈ ప్రాంతవాడినే. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నా. ప్రతీ కార్యకర్త, నాయకుడి కష్టం, శ్రమ వృథాగా పోనివ్వను. బీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తున్న వారందరికీ రుణపడి ఉంటా.
– సుంకె రవిశంకర్, చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే