సిరిసిల్ల టౌన్/ మానకొండూర్ అక్టోబర్ 27: బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటిస్తూ ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన కుట్రలను నిరసిస్తూ గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అడ్డుకొనేందుకు యత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారించి వెనక్కు పంపించారు. అలాగే కరీంనగర్ జిల్లా మానకొండూర్లో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నేతలపైకి కాషాయపార్టీ నేతలు దూసుకువచ్చారు. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలుపుతున్న వారిపై దాడికి యత్నించారు. వారించేందుకు వచ్చిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. అక్కడే బైఠాయించి రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. మరోసారి పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.