రాజన్న సిరిసిల్ల, మే 18(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు గూండాగిరి చేశారు. బాలికకు న్యాయం చేయాలని, సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో శాంతియుతంగా నిరసన చేస్తుండగా, దౌర్జన్యం చేశారు. దీంతో నేతన్న చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగి కమలం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శాంతియుత నిరసనకు సిద్ధమయ్యారు. పోలీసుల అనుమతితో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఇది జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు దౌర్జన్యం చేశారు.
ఆగమేఘాల మీద అదే చౌరస్తాలో ధర్నా చేస్తామని పట్టుబట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బీజేపీ నాయకులు గాంధీ చౌరస్తాలో, బీఆర్ఎస్ నాయకులు నేతన్న చౌరస్తాలో చేసుకోవాలని సూచించారు. అయినా బీజేపీ నాయకులు వినకుండా నేతన్న చౌరస్తాలో ధర్నా చేస్తున్న గులాబీ శ్రేణుల మీదకు దూసుకొచ్చారు. రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగారు. పోటీగా నినాదాలు చేస్తూ దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణుల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలు లక్కిరెడ్డి కమాలాకర్రెడ్డి, కంచర్ల రవిగౌడ్ గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, ఎస్పీ మహేశ్ బీ గీతే రంగంలోకి దిగారు. బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని, వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను ఎస్పీతోపాటు డీఎస్పీ నాగేంద్రాచారి సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల తీరుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్కు చేరుకొని విలేకరుల సమావేశం నిర్వహించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించారు. తర్వాత తెలంగాణ భవన్ ఎదుట మొదటి బైపాస్ రోడ్డుపై సంజయ్ రాజీనామా చేయాలంటూ వంద అడుగుల భారీ ఫ్లెక్సీతో బైఠాయించి ధర్నా చేశారు. బాలికకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని భారీ ఫ్లెక్సీని లాక్కున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకొని తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు.