కాషాయ పార్టీ కపట నాటకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మదినిండా విషపుకక్షలు నింపుకొని ఆది నుంచీ చేస్తున్న కుట్రలు బద్ధలవుతున్నాయి. తెలంగాణలో చిచ్చురేపేందుకు చేస్తున్న కుటిల యత్నాలు, రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పన్నుతున్న కుయుక్తులు బహిర్గతమవుతున్నాయి. మునుగోడులో నోట్ల కట్టలతో కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకుడు పట్టుబడిన విషయం ఇంకా మరువక ముందే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన దిగజారుడు రాజకీయాలు బట్టబయలయ్యాయి. గతంలోనూ చేసిన ఎన్నో డ్రామాలు ప్రజాక్షేత్రంలో నవ్వులపాలయ్యాయి. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బైసన్పోలో మైదానంలో సచివాలయం కట్టేందుకు అడ్డుపడడం, కంటోన్మెంట్ భూములు రాకుండా చేయడం, తెలంగాణ అవిర్భావమే సరిగా జరగలేదంటూ సాక్షాత్తూ ప్రధానియే పార్లమెంట్ సాక్షిగా విషంగక్కడం, హిందూ ఏక్తాయాత్ర సాకుతో కరీంనగర్లో బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడడం, గ్రానైట్ మాఫియా అంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా చేసిన దీక్షలను అడ్డుకున్న పోలీసులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి ముప్పుతిప్పలు పెట్టడం.. లాంటి ఎన్నో ఘటనలు బీజేపీ వైఖరికి అద్దంపడుతున్నాయి. ఆది నుంచీ ఇదే తీరున వ్యవహరిస్తున్న ఆ పార్టీపై ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దొంగ పనులు’ అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఆది నుంచీ తెలంగాణపై విషంగక్కుతున్నది. ఎలాగైనా సరే తెలంగాణలో అడ్డా వేయాలన్న లక్ష్యంతో అడ్డదారుల్లో పయనిస్తున్నది. అందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నవి. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, అక్కడ ఆ పార్టీ ఎన్నో కుట్రలకు తెరతీస్తున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, చెక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఈనెల 17న మునుగోడు పోలీస్స్టేషన్ పరిధిలో చల్మెడ క్రాస్రోడ్డు చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో కోటి రూపాయల నగదు పట్టబడిన విషయం విదితమే. పోలీసుల విచారణలో సదరు నాయకుడు కరీంనగర్ 13 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త చొప్పరి వేణుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.
అడ్డంగా దొరికి..
ఓవైపు మునుగోడు ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాషా యపార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతున్నది. అగ్రనేతల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బాట పడుతుండడం ఆ పార్టీని కలవరపెడుతున్నది. ఇది జీర్ణించుకోలేని నాయకులు మరింత నీచ రాజకీయాలకు దిగారు. అధికారమే పరమావధిగా ప్రజాస్వా మ్య విలువలకు పాతరేస్తున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలకు తెరతీసేలా బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆ పార్టీ నీచరాజకీయాలకు అద్దంపడుతున్నది. ఇప్పటికే వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలుస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకులు.. ఇప్పు డు వారి దృష్టి తెలంగాణపై పెట్టారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మునుగో డు ఎన్నికల్లో లబ్ధిపొందేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ, పాపం పండక పోదూ.. అన్నట్లుగా వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారు. దీంతో బీజేపీ కపటనాటకం మరోసారి బట్టబయలైంది. దీనిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్నారు. ఎక్కడికక్కడే ధర్నాలు, రాస్తారోకోలు చేసి, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ కుటిల రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
అడుగడుగునా అదే తీరు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మన ఉమ్మడి జిల్లాకు చెందిన వారే. ఆయనతోపాటు ఆయన పర్యవేక్షణలోనే ఉమ్మడి జిల్లాలో బీజేపీ అనేక కపట నాటకాలకు తెరలేపిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ తమ అభ్యర్థి ఎవరూ లేరని ప్రకటించడగా.. ఈటల రాజేందర్ మాత్రం స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రకటించారు. ఈ విషయంలో ఇరువురు కొత్తడ్రామాకు తెరలేపి.. చివరికి వారే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, కొంత మంది కార్పొరేటర్లకు ఇచ్చిన నోటీసులు ఆ పార్టీని చీల్చే వరకు తీసుకెళ్లాయి. గతంలో అసెంబ్లీని బైసన్పోలో మైదానంలో నిర్మా ణం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ, ఈ ప్రతిపాదనను తామే అడ్డుకున్నామని, కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ నుంచి సదరు భూములు ఇవ్వకుండా అన్ని ప్రయత్నాలు చేసి ఆపు చేశామని ఆ పార్టీకి ఆనాడు అధ్యక్షుడిగా ఉన్న కే లక్షణే స్వయంగా ప్రకటించారు. అలాగే కంటోన్మెంట్ భూములు ఇవ్వకుండా చేసిన రాజకీయ కుట్రల వల్ల ఇప్పుడు ఉమ్మడి జిల్లావాసులు హైదరాబాద్ వెళ్లడానికి నానాయాతన పడాల్సి వస్తున్నది. కంటోన్మెంట్ భూములు ఇచ్చి ఉంటే.. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట వరకు రోడ్లు వెడల్పు చేసుకునే అవకాశం ఏర్పడేది. కానీ, ఈ విషయంలోనూ బీజేపీ కపట నాటకాలు ఆడింది. ఇదే కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గ్రానైట్ యజమానులు పన్నులు ఎగ్గొట్టారని, స్మార్ట్సిటీ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా బండి సంజయ్ ఫిర్యాదు చేసి బోర్లాపడిన విషయం తెలిసిందే.
స్మార్ట్సిటీ పనులు నిలిచిపోవాలన్న కుట్రలో భాగంగానే ఫిర్యాదు చేశారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ఇవేకాదు, పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కారు. ఇవేకాకుండా.. కరోనా సమయంలో బండి సంజయ్ కరీంనగర్ కేంద్రంగా దీక్ష చేస్తే.. ఆ దీక్ష కేంద్రం, రాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా ఉందని పోలీసులు అడ్డుకోగా.. తమను ఇబ్బంది పెట్టారని, ప్రొటోకాల్ పాటించలేదంటూ ఏకంగా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలుసార్లు ఢిల్లీకి వెళ్లాల్సి వస్తున్నది. బీజేపీ పన్నే కుట్రలో ఇదీ భాగమే. గత మేలో కరీంనగర్లో జరిగిన హిందూ ఏక్తాయాత్రలో బండి సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారు. ‘ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసురుతున్న. తెలంగాణలోనున్న మసీదులను తవ్వి చూద్దాం. శవాలొస్తే మీవి. శివం వస్తే మావి. అందుకు మీరు సిద్ధమా..?’ అంటూ మాట్లాడడమే కాదు, బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలు, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని, అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామని, అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతుందంటూ రెచ్చగొట్టేలా ప్రసంగించారు. మరోవైపు తనను మూడుసార్లు చంపే ప్రయత్నం చేసినా కాషాయ జెండాను వీడలేదంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఇలా ఆయా సందర్భాలకు అనుగుణంగా డ్రా మాలు, కపట నాటకాలు ఆడడం బీజేపీకి అలవాటుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.