మంథని, మే 16: దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బీసీలపై కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, 30 ఏండ్లుగా రిజర్వేషన్ల తేల్చకుండా చోద్యం చూస్తున్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మండిపడ్డారు. సమాజంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో.. ఎవరి అవసరాలు ఏమిటో తెలియకుండా పాలిస్తున్నారని విమర్శించారు. బీసీ జనగణన చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పట్టించుకోలేదన్నారు. మంథనిలోని బొక్కలవాగు నూతన బ్రిడ్జిపై పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఓబీసీ 2వ జాతీయ కమిషన్ చైర్మన్ బిందెశ్వరి ప్రసాద్ మండల్ విగ్రహాన్ని ఆయన వారసుడు సూరజ్ మండల్తో కలిసి మంగళవారం మండలి డిప్యూటీ చైర్మన్ ఆవిష్కరించారు. బీపీ మండల్ విగ్రహాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా మంథనిలో ఏర్పాటు చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ను అభినందించారు.
అనంతరం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఉన్న బీసీలను లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వాలు సాహసించడం లేదన్నారు. బీసీలకు 50 శాతం కంటే రిజర్వేషన్ ఇవ్వవద్దని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ఎకువ కా లం అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే ఉన్నాయన్నారు. ఈనాటికి కేం ద్రంలో బీసీలకు మంత్రిత్వశాఖ లేదంటే ఎంత వివక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. దేశంలోని 70కోట్ల బీసీలకు బడ్జెట్లో 2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. నాటి నుంచి వివక్ష చూపిస్తున్న క్రమంలోనే మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు బీపీ మండల్ అని ఆయన కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారని, 3.86కోట్ల మందిలో 1.86 కోట్ల మంది బీసీ జనాభా ఉన్నట్టు సర్వే లెక్కలు తేల్చాయన్నారు.
ఆ సర్వే లెక్కల ఆధారంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు గొర్రెల పంపి ణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంట్, దళిత బంధు వంటి ఎన్నో పథకాలను వందశాతం అమలు చేస్తున్నదన్నా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు వెయ్యి గు రుకులాలను ఏర్పాటు చేసి, పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు. ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షల నగదును తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. ఏటా 300 మంది విద్యార్థులకు విదేశీ విద్య కోసం పంపుతున్నదని, దీని కోసం ఒక్కో విద్యార్థికి 20లక్షల ఖర్చు చేస్తున్నదన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసం హైదరాబాద్ కేంద్రంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నదన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని పెంచేలా హైదరాబాద్ నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అనేక ఏండ్లుగా మంథని ప్రాంతాన్ని ఒకే కుటుంబం పరిపాలన చేస్తుండడంతో అట్టడుగు వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆ ఇబ్బందులు తొలగించే విధంగా చరిత్రను తిరగరాయాలని, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేస్తూ తిరుగులేని నాయకుడైన పుట్ట మధూకర్ను నిలబెట్టుకోవాలన్నారు. మహనీయుల స్ఫూర్తిని చాటుతున్న మంథని చరిత్రను తిరగరాసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.