కార్మికలోకం చిన్నబోయింది. ఉపాధి లేక.. ఆదుకునేవాళ్లు లేక ఐదు నెలలుగా గోసపడుతున్నది. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేతినిండా పని.. పనికి తగ్గ కూలితో రంది లేకుండా బతికిన కార్మిక లోకం, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్టింపులేమితో ఆగమైపోతున్నది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వస్తున్న అధినేతలు తమ బతుకులకు బాసటగా నిలుస్తారని భావించిన నేతన్నలకు నిరాశే ఎదురైంది. ఇటీవల రాజన్న సిరిసిల్ల గడ్డపై తొలిసారి కాలుమోపి,
వేములవాడకు వచ్చిన ప్రధాని మోడీ సిరిసిల్లకు మెగాపవర్లూం క్లస్టర్ ప్రకటిస్తారని, తమ గురించి నాలుగు మాటలు మాట్లాడుతారని పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లింది. సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి సైతం వస్త్రపరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని ఒక్క మాట మాట్లాడకపోవడంపై కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరూ ఇలా వచ్చి అలా వెళ్లారే తప్ప కనీసం అసువులు బాసిన నేత కుటుంబాలకు ఏమాత్రం భరోసా ఇవ్వకపోవడంపై మండిపడుతున్నాయి. తమ ప్రియతమ నేత, భరోసానిచ్చే నాయకుడు కేసీఆర్ శుక్రవారం సిరిసిల్లకు వస్తుండడంతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
రాజన్న సిరిసిల్ల, మే 9 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వేములవాడకు వచ్చారు. 77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో మొదటిసారి ప్రధానమంత్రి హోదాలో వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తర్వాత జనసభకు హాజరయ్యారు. అయితే ఈ సభలో మెగాక్లస్టర్ ప్రకటిస్తాడని కొండంత ఆశలు పెట్టుకొని నేతన్నలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తమ గురించి మోడీ నాలుగు మాటలు చెపుతారని ఎంతో ఊహించారు. దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రానికి నిధులు ఇస్తారని భావించారు. కానీ, ఏ ఒక్కరి ఆశలు నెరవేరలేదు. ఎంతసేపూ రాజకీయాల గురించి తప్పితే ఒక్క హామీ ఇవ్వలేదు. వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకు గానీ, మెగా క్లస్టర్ గురించి గానీ, వేములవాడ అభివృద్ధిపై గానీ ఒక్క మాట మాట్లాడలేదు. పైగా మరమగ్గాలు నడువక ఉపాధి కరువై ఇటీవల ఉసురు తీసుకున్న నేతన్న గురించి కనీసం ప్రస్తావించ లేదు. బాధిత కుటుంబాలకు ఏమాత్రం భరోసానివ్వలేదు. అంత పెద్ద నేత, అదీ మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంగా ఏదో ఒకటి చేస్తారని ఆశించినా నిరాశే మిగిలింది. ప్రధాని అయినా తమకు మేలు చేస్తారని ఆశించిన నేత కార్మికులు అడియాశలు అయ్యాయి.
రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఆదుకుంటాడని నేతన్నలు భావించారు. ప్రధాని పర్యటనకు ముందు అంటే ఈ నెల 3న ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి రాగా.. అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తమ కోసం ఏమో చేస్తారని, సిరిసిల్లకు ఏదో ఒకటి ఇస్తారని ఆశించారు. కానీ, ఆ రోజు రేవంత్రెడ్డి కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు సభా స్థలిలో ఎదురుచూసినా నేతన్నల గురించి ఒక్క మాట మాట్లాడలేకపోయారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి వచ్చిన ఆయన ఏ భరోసా ఇవ్వలేకపోయారు. ఎంత సేపూ రాజకీయ పార్టీలపై తిట్లదండకమే తప్ప అభివృద్ధి కోసం ఏంచేస్తమో చెప్పలేకపోయారు. ఆర్డర్ల గురించి కూడా ఏ భరోసా ఇవ్వలేకపోయారు.
ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వస్త్ర పరిశ్రమ నిరాదరణకు గురైంది. నాటి పాలకుల పాపం అప్పుడు నేతన్నలకు శాపంగా మారింది. తీవ్ర సంక్షోభంతో ఉపాధి కరువై ఆత్మహత్యల పరంపరతో మరమగ్గాల్లో మరణ మృదంగం మోగింది. సిరిసిల్ల కాస్త ఉరిసిల్లగా మారింది. కానీ, కేసీఆర్ సర్కారు నేతన్నల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి భరోసా కల్పించింది. 3వేల కోట్ల విలువైన బతుకమ్మ, ఆర్వీఎం, క్రిస్మస్, రంజాన్ తోఫా వస్త్ర ఆర్డర్లు ఇచ్చి, చేతినిండా పని, పనికి తగ్గ కూలి ఇచ్చి అండగా నిలిచింది. నేతన్నలకు చేతినిండా పనికల్పించాలనే ఉద్దేశంతో ఏటా 350కోట్ల విలువైన కోటీ బతుకమ్మ చీరలను తయారు చేయించింది. ప్రతి నెలా 15వేల నుంచి 20వేల కూలి అందేలా పని కల్పించింది. అలాగే పదిశాతం యారన్ సబ్సిడీ ప్రకటించింది. యారన్ సబ్సిడీపై ఒక్కో కార్మికుడికి 30వేల నుంచి 50వేల దాకా అదనంగా కూలి అందింది. అందులో 2018నుంచి 2021 వరకు 5300 మందికి 32.67కోట్లు లబ్ధి చేకూరింది. అలాగే వచ్చిన కూలీ డబ్బులను సద్వినియోగం చేసుకునేలా కార్మికుల కోసం చేయూత త్రిఫ్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో 2017-20 సంవత్సరానికి గాను 1801 మందికి 5.14కోట్ల లబ్ధి చేకూరింది. రైతుల మాదిరిగానే నేతన్నకు కేసీఆర్ ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది. కార్మికుడు ఎలా చనిపోయినా కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే ఎల్ఐసీ పాలసీ చేయించింది. 59 ఏండ్ల లోపున్న 4806 మందికి బీమా చేయించింది. అందులో 27 మంది కార్మికులు చనిపోగా, వారి కుటుంబాలకు 5లక్షల చొప్పున కోటీ 35లక్షల చొప్పున చెల్లించింది. ఇలా అనేక పథకాలతో ధీమానిచ్చింది.
నాడు చితికిన బతుకులకు కేసీఆర్ సర్కారు భరోసా కల్పిస్తే.. నేడు కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో అంతా తారుమారైంది. 300 కోట్లు పెండింగ్ బకాయిలు ఇవ్వక, వస్త్ర ఉత్పత్తులకు జీవో విడుదల చెయ్యక పరిశ్రమ మూతపడింది. ఆకలితో అలమటించిన నేతన్నలు అన్నమో రామచంద్రా..? అంటూ అర్థించాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నేతన్నలు మళ్లీ ఆత్మహత్యల బాటపడుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఉసురు తీసుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తాము భరోసాగా ఉన్నామని గుర్తు చేస్తున్నారు. ఆయన తప్ప మరెవ్వరూ మేలు చెయ్యరంటూ బాహటంగానే చెబుతున్నారు. సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ ఇవ్వాలంటూ గతంలో మాజీ మంత్రి కేటీఆర్ పలుసార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులందరికీ లేఖలు రాసినా.. స్వయానా ఢిల్లీకి వెళ్లి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ఇప్పుడైన మోడీ తీపీ కబురు చెబుతారనుకుంటే ఏ భరోసా ఇవ్వకుండా వెళ్లిపోయారని మండిపడుతున్నారు. సీఎం హోదాలో మొదటిసారి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా గదే ఊకదంపుడు ఉపన్యాసమిచ్చారని, ఏ హామీలు ఇవ్వకుండా వెళ్లిపోయారని ఆగ్రహిస్తున్నారు. అధినేతలు వచ్చినా తమకేమీ ప్రయోజనం లేదని, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కార్మిక క్షేత్రానికి ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి బీ వినోద్కుమార్తో కలిసి శుక్రవారం సాయంత్రం 5గంటలకు నేతన్న చౌక్లో రోడ్షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను కండ్లముందుంచడంతోపాటు బీఆర్ఎస్ ఎంపీలు గెలువాల్సిన ఆవశ్యకతను వివరించునున్నారు. అనంతరం అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్ మీదుగా సిద్దిపేట జిల్లాకు బయలు దేరుతారు. కేసీఆర్ రోడ్షోకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేతకు ఘనస్వాగతం పలికేందుకు నేతన్నలు సిద్ధమయ్యారు. తమకు ఆపత్కాలంలో అండగా నిలిచిన తీరుకు కృతజ్ఞతగా పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇటు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.