తెలంగాణ చౌక్, ఏప్రిల్ 2 : టీఎస్ఆర్టీసీ ఆధ్యాత్మిక సేవ కొనసాగిస్తున్నది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను రూ.116 చెల్లించి బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా ఇంటికే వెళ్లి అందిస్తున్నది. లాజిస్టిక్ సేవల్లో భాగంగా దేవాదాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, ఇప్పటికే కరీంనగర్ జోనల్ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి 33,295 మంది బుక్ చేసుకోగా, నేటితో గడువు ముగిసిపోనున్నది. కాగా, ఆదివారం నుంచే పంపిణీ ప్రక్రియ మొదలు కాగా, తొలుత మంత్రి కొప్పుల ఈశ్వర్కే తలంబ్రాలు అందించింది.
భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమనిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో సీతారాముల కల్యాణాన్ని కండ్లారా వీక్షించాలని, విశిష్టమైన తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవాలని చాలా మంది ఆశ పడతారు. కానీ ప్రస్తుత బీజీ ప్రపంచంలో అందరికీ వీలుపడడం లేదు. అలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. భక్తుల చెంతకే తలంబ్రాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే చాలు ఆర్టీసీ సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి అందజేసేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు 20 రోజుల క్రితమే బుకింగ్ పోర్టల్ను ప్రారంభించింది.
విశేష స్పందన
తలంబ్రాల కోసం పోర్టల్లో గానీ లాజిస్టిక్ కార్యాలయం, మార్కెటింగ్ సిబ్బంది వద్ద గానీ రూ.116 చెల్లించి బుక్ చేసుకోవాలని సంస్థ విస్తృత ప్రచారం చేయగా, కరీంనగర్ జోనల్ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆదిలాబాద్లో 5094, నిజామాబాద్లో 7856, కరీంనగర్లో 8457, ఖమ్మంలో 5022, వరంగల్లో 9846 మంది అంటే మొత్తంగా 33,295 మంది బుక్ చేసుకోగా, ఆర్టీసీకి అదనంగా రూ.38,62,220 ఆదాయం సమకూరింది. కాగా, బుకింగ్కు నేటితో గడువు ముగిసిపోనుండగా, ఆదివారం నుంచే భక్తుల ఇంటికీ తలంబాల్ర పంపిణీ మొదలైంది. తొలి రోజు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్కు తలంబ్రాలను అందజేసి, పంపిణీని ప్రారంభించారు.
భక్తుల సౌకర్యార్థం..
భద్రాచలంలోని రాములోరి కల్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని సంస్థ చేపట్టింది. రూ.116 చెల్లించిన వారికి భద్రాద్రి నుంచి తలంబ్రాలను తీసుకువచ్చి చేరవేస్తున్నాం. నేటితో బుకింగ్ గడువు ముగుస్తుంది. ఆదివారం నుంచే పంపిణీ ప్రారంభమైంది. వారం రోజుల్లోగా భక్తులందరికీ అందజేస్తాం.
– భాను కిరణ్, డిప్యూటీ సీటీఎం, కరీంనగర్జోన్
ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నాం..
భద్రాది రాములోరి తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్న భక్తులందరికీ ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నాం. ముందుగా వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాం. వీలైన వారికి టాజిస్టిక్ కార్యాలయంలోనే ఇస్తున్నాం. లేదంటే వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తున్నాం. తలంబ్రాలను చూసి భక్తులు చాలా సంతోషపడుతున్నారు. కరీంనగర్ డిపో పరిధిలో 4775 మంది బుక్ చేసుకున్నారు.
– రాజు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కరీంనగర్