Be alert | చిగురుమామిడి, జూలై 20 : మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం ఉంటే తప్పా వర్షాల సమయంలో రైతులు, ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకుఅన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే 100 నంబర్ గానీ పోలీస్ స్టేషన్ 8712670772 నంబర్కు ఫోన్ చేయాలని ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలను కోరారు.