కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 29 : ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి సమన్వయ సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు రెండు కళ్లలాంటివని, ఆయా ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం తెచ్చే పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, పురోగతి దిశగా తీసుకెళ్లడంలో ఉద్యోగులదే కీలకపాత్ర అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షించే క్రమంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తన హాయాంలో ఏర్పాటు చేసిన రెండో సమావేశం కాగా, గతంలో చేసిన సూచనలు కొంతమంది అధికారులు పాటిస్తుండగా, మరికొంత మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ ధోరణి విడనాడాలని సూచించారు.
సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు వైద్యసేవలు మరింత అందుబాటులోకి తేవాలని, మందులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు చినమైల్ అంజిరెడ్డి, మల్క కొండయ్య, కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లు పమేలా సత్పతి, గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమీషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.