మెట్పల్లి/ కోరుట్ల/ధర్మపురి/ధర్మారం, జనవరి 5 : “మాది ఉద్యో గ తెలంగాణ.. కేంద్రానిది నిరుద్యోగ భారత్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే 1.48 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజాగా, 81 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇది చూసి ప్రజలు సంతోషపడుతుం టే బీజేపీకి చెందిన ఈ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ మాత్రం ఓర్చుకోలేకపోతున్నడు. అన్ని ఉ ద్యోగాలు భర్తీ చేస్తే వారి పార్టీ జెండా మోసే కార్యకర్త దొరకడని తెగబాధపడిపోతున్నడు..” అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాలతోపాటు పెద్దపల్లి జి ల్లా ధర్మారం మండలం నందిమేడారంలో పర్యటించిన ఆయన, ఆయా చోట్ల ప్రసంగించారు.
కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కును ప్రైవేట్పరం చేస్తూ ఉద్యోగాలను ఊడగొడుతుంటే తెలంగాణ ప్రభు త్వం ఉద్యోగాలు ఇస్తున్నదన్నారు. బతుకుదెరువు, పిల్లల భవిష్యత్ కోసం ఆరాటపడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను చంపిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. కొంతమంది జాతీయ, సీనియర్ నాయకులమని చెప్పుకుంటున్న నేతలు, కరీంనగర్కు ఒక్క మెడికల్ కాలేజీ కానీ, డయాలసిస్ సెంటర్కానీ, ఐసీయూ సెంటర్ కానీ ఎందుకు తీ సుకురాలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల మాటలు మూరెడు, చేతలు బెత్తడు కాదని వాఖ్యానించారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలను ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ మెడికల్ కాలేజీ ఎం దుకు తేలేకపోయారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర సర్కారు ఉద్యోగాలు భర్తీ చేస్తే సంజయ్ కుళ్లుకుంటున్నాడని మండిపడ్డారు. యువకులకు రాజకీయాలు తప్ప ఉద్యోగాలు వద్దా..? అని ప్రశ్నించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేవి?
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు. రైల్వే శాఖలో 3 లక్షలు, డిఫెన్స్లో 3 లక్షలు, కేంద్ర ప్ర భుత్వ సర్వీసుల్లో 9 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఎం దుకు భర్తీ చేయడం లేదో నిరుద్యోగ యువతకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్కు ఉద్యోగాలు ఊడగొట్టడమే పని గా మారిందని, బీఎస్ఎన్ఎల్లో 50 వేల మంది ఉద్యోగులను తొలగించారని, ఎల్ఐసీని ప్రైవేట్కు అప్పజెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అ మ్మి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయం దండుగ, ఉచిత విద్యుత్ సా ధ్యం కాదన్న చంద్రబాబు వంటి వారు ఇప్పుడు మళ్లీ తెలంగాణకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఎరువు లు, నీళ్లు దొరికలేదని, విద్యుత్ కోతలు ఉండేవని, రైతుల ఉసురు పోసుకున్న కాంగ్రెసోళ్లు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.
రైతులను అరిగోస పెట్టాయి..
గత పాలనలో కాంగ్రెస్, టీడీపీ, ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులను అరిగోస పెట్టాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో సాగుకు కరెంట్ సరిగ్గా ఇవ్వలేదని, ఎరువుల కోసం ముప్పుతిప్పలు పెట్టారన్నారు. ఆనాడు దొంగరాత్రి కరెంట్ ఇచ్చి రైతులను నక్సలైట్ పేరిట కాల్చిచంపారని ఆరోపించారు. ఆనాడు రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. తిన్నది అరుగక ఆత్మహత్యలు చేసుకున్నారని రైతులను అవమానపరిచిన చరిత్ర కాంగ్రెస్ నాయకులది అన్నారు. నాడు ఉచిత కరెంట్ కోసం ఉద్యమంచిన రైతులను కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. నేడు ఖమ్మం జిల్లాకు వచ్చిన చంద్రబాబు రైతుల మేలు గురించి మాట్లాడడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదని స్పష్టం చేశారు.
ఇక బీజేపీ సైతం రైతుల గురించి కల్లబొల్లి మాట్లాడడం చూస్తే విస్మయం కలిగిస్తున్నదన్నారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది మరణానికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులు కల్లాలు నిర్మిస్తే ఆ డబ్బు కట్టాలని మోదీ హుకూం జారీ చేశారని, వడ్లను కొనేదిలేదని మొండికేసిన ఘనత కేంద్రంలోని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. మోటర్లకు మీటర్లను అడ్డుకోవడమే కాకుండా మోటర్లకు కరెంట్ బిల్లు కట్టేదిలేదని తేల్చి చెప్పింది మన సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి, రైతును రాజును చేసిన సీఎం కేసీఆర్కు దేశంలో రైతులను గూర్చి మాట్లాడే హక్కు ఉందన్నారు. కానీ, రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదని స్పష్టం చేశారు. మోదీ ఢిల్లోలో ఒక మాట గల్లీలో మరో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిని బ్లాక్లను ప్రైవేటీకరించమని రామగుండంలో చెప్పి ఆ తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ను అభాసుపాలు చేయడమే ప్రతిపక్షాల లక్ష్యం..
పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి జగిత్యాలకు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కానీ, ఐసీయూ కానీ, డయాలసిస్ సెంటర్ కానీ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులది రాజకీయ ఆరాటమని, బీఆర్ఎస్ది తెలంగాణ బతుకుదెరువు ఆరాటమన్నారు. బీఆర్ఎస్కు తెలంగాణకు పేగు బంధం ఉంటుందని, మాది ఉద్యమ పార్టీ అని స్పష్టం చేశారు. కాదనుకున్న.. రాదనుకున్న తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పేగులు తెగేదాక పోరాడి సాధించుకున్నామని గుర్తుచేశారు. దేశంలో నిరుద్యోగ శాతం పెరుగుతున్నదని, గతేడాది 6.5 శాతం ఉంటే ప్రస్తుతం 8.3 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణలో నిరుద్యోగ శాతం 4.1గా ఉంటే, అతి ఎక్కువగా డబుల్ ఇంజన్ బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో 37.4 శాతంగా ఉందన్నారు.
“బీజేపీ అధికారంలోకి వస్తే కోట్లకొద్ది ఉద్యోగాలు ఇస్తామని.. లక్షలకొద్ది డబ్బు ప్రజల అకౌంట్లలో వేస్తామని చెప్పారు. ఎవరి బ్యాంకుల్లో జమ చేశారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నింట్లో ఫెయిలై మతకల్లోలాలు పెట్టి, ఉద్రిక్తతలు రేపి లబ్ధి పొందాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. తాము హరిత తెలంగాణ లక్ష్యం కోసం ఆరాట పడుతుంటే.. బీజేపోళ్లు ఉద్రిక్తతల తెలంగాణ, మతకల్లోలాల తెలంగాణ కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. తె లంగాణ ప్రజలు ప్రేమాభిమానాలు, సుఖసంతోషాలు, అభివృద్ధిని కోరుకుంటున్నారని స్పష్టం చే శారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో జగిత్యాల క లెక్టర్ రవి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డా. అ జయ్కుమార్, టీఎస్ ఎంఐడీసీ చీఫ్ ఇంజినీర్ రా జేందర్కుమార్, డీసీహెచ్ సుదక్షిణదేవి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డీసీఎమ్మెస్ చైర్మన్ డా. శ్రీకాంత్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతకాని, పెద్దపల్లి జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.
పర్యటన ఇలా..
మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాలతో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మా రం మండలంలో మరో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ముం దుగా ఉదయం 11:50 గంటలకు కోరుట్లకు చేరుకున్న మంత్రి హరీశ్రావుకు సాయిబాబా ఆలయం వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల సంజయ్ ఘన స్వాగతం పలికారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి పట్టువస్ర్తాలు అందజేశారు. అనంతరం హజీపురాలో 13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, ప్రభుత్వ ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం 20 కోట్లతో నిర్మించనున్న 100 పడకల దవాఖాన శిలాఫలకాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా రోగులను పలుకరిస్తూ బాలింతలు, గర్భిణులకు అందుతున్న వైద్య సే వలపై ఆరా తీశారు. తర్వాత అక్కడి నుంచి మె ట్పల్లికి వెళ్లి ప్రభుత్వ దవాఖానలో 7.50 కో ట్లతో నిర్మించనున్న 30 పడకల దవాఖానకు శంకుస్థాపన చేశారు. తర్వాత ధర్మపురికి చేరుకొని నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్ను పరిశీలించారు.
అనంతరం లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి చేరుకోగా, ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పూజలు చేశారు. ఆశీర్వచన మండపంలో మంత్రి ఈశ్వర్, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం మంత్రి హరీశ్రావుకు అందజేసి, ఘనంగా సన్మానించారు. అనంతరం పట్టణంలోని సీహెచ్సీలో 4 కోట్ల 5 లక్షలతో 30 పడకల నుంచి 50 పడకల సా మర్థ్యం పెంపు కోసం భూమి పూజ చేశారు. 80 లక్షలతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. 1.23 కోట్లతో 10 పడకల ఐసీయూ విభాగానికి భూమిపూజ చేశారు. 21.50 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం చేరుకున్నారు. అక్కడ 7.32 కోట్లతో సీహెచ్సీ భవన నిర్మాణ పనులను మంత్రి కొప్పుల, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, దవాఖాన స్థలం దాత కీ.శే పొనుగోటి మురళీధర్రావు కొడుకులు హైకోర్టు జడ్జి పొనుగోటి నవీన్రావు, నర్సింగరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను మంత్రి ప్రశసించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు.