కార్పొరేషన్, మార్చి 14: బండి సంజయ్.. ఐదేండ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధిపై మాజీ ఎంపీ వినోద్కుమార్తో చర్చకు సిద్ధమా..? అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సవాల్ విసిరారు. కరీంనగర్ అభివృద్ధికి తెచ్చిన నిధులెన్ని? చేసిన పనులేంటి? ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కదనభేరికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నడంటూ నిప్పులు చెరిగారు. హిందుత్వం పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న సంజయ్కి గుడి, బడి కట్టాలనే సోయి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కానీ, వినోద్కుమార్ టీటీడీని ఒప్పించి 25 కోట్లు తెచ్చి కరీంనగర్లో బ్రహ్మండమైన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నారు.
కరీంనగర్లోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో భార్య పుస్తెలతాడు అమ్మి పోటీ చేస్తున్నానని చెప్పిన బండి సంజయ్కి ఇప్పుడు వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయన్నారు. ఓటమి తప్పదని తెలిసే నాన్ లోకల్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పాలన్నారు. నిజామాబాద్కు చెందిన అర్వింద్ గత ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేశారని పేర్కొన్నారు. ఐదేళ్లు ఎంపీగా వినోద్కుమార్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారని గర్తు చేశారు. ఆయన ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నారని చెప్పారు. వినోద్ ఎంపీగా ఉన్నప్పడు జిల్లాకు ఐదు జాతీయ రహదారులు తీసుకొచ్చారన్నారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేయించారన్నారు.
కరీంనగర్కు స్మార్ట్సిటీతో వెయ్యి కోట్లు తీసుకువచ్చారన్నారు. కానీ, ఈ ఐదేళ్లలో సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాల కూడా ఎందుకు మంజూరు చేయించలేదని నిలదీశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అధిష్టానం నిన్ను ఎందుకు తొలగించిందో చెప్పాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి బీజేపీతో చేతులు కలిపి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్, పొన్నం అనిల్, కెమసారం తిరుపతి, జయంత్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.