కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 8 : రాష్ట్ర శాసన సభా ఎన్నికలతో రెండు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు నాలుగైదు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో క్రయ, విక్రయాలు పెరుగుతుండగా, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూలుకు ముందు సెప్టెంబర్ నెలలో ఉమ్మడి జిల్లాలో స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో 25 కోట్ల 5 లక్షల 92 వేల ఆదాయం సమకూరింది. 7843 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అయితే, అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూలు విడుదల కావడం, ఆ వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడంతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి.
50 వేల పరిమితికి మించి ఒక్కరూపాయి కూడా అదనంగా తీసుకెళ్లకుండా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయడం, బ్యాంకు లావాదేవీలపైనా ఎన్నికల సంఘం నిఘా పెట్టడంతో అనేక మంది క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. మందు, మద్యం, డబ్బు పంపకాలపై దృష్టి సారించిన ఎన్నికల కమిషన్ ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేపట్టింది. జిల్లాలో పదుల సంఖ్యలో స్ధిరాస్తుల అమ్మకం, కొనుగోలుదారుల నుంచి ఎంసీసీ తనిఖీల బృందం రూ.లక్షల్లో డబ్బులు స్వాధీనం చేసుకుంది.
ఈ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు అప్పగించడం, సంబంధిత సొమ్ముకు సంబంధించిన ఆధారాలు చూపినా, తిరిగి ఇవ్వడంలో కనబరిచిన జాప్యంతో బాధితులు అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలో లావాదేవీలు నిర్వహించడంలో అత్యధిక మంది వెనుకంజ వేశారు. అమ్మకాలు, కొనుగోళ్లపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఈ ప్రభావం రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా పడింది. దీంతో క్రయ, విక్రయాలు నెమ్మదించాయి. ప్రతిరోజూ రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయాయి.
శాఖకు రావాల్సిన ఆదాయం కూడా రెండు నెలల్లో తగ్గింది. అక్టోబర్ నెలలో 21 కోట్ల 20 లక్షల 94 వేల ఆదాయం రాగా, నవంబర్లో 17 కోట్ల 80 లక్షల 7 వేలు మాత్రమే ఆదాయం వచ్చింది. ఆ నెలలో 5758 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 3 వరకు ఉమ్మడి జిల్లాలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 9 కోట్ల వరకు ఆదాయం రాగా, అతి తక్కువగా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 50 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో యధావిధిగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా, రోజుకు భారీగానే ఆదాయం సమకూరుతున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.