కర్షకలోకం మురిసిపోయింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రైతు దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకున్నది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ ఉత్సాహంగా కదిలింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ర్యాలీగా తరలిరాగా, దారిపొడవునా ‘జై కేసీఆర్’ నినాదాలు హోరెత్తాయి. డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు కళాకారుల ఆటపాటలు, మహిళల కోలాటాలు, గజ మాలలతో నాయకులకు స్వాగతాలు, వేదికల్లో సహపంక్తి భోజనాలు, ఉత్తమ రైతులకు సన్మానాలు.. ఇలా ఎక్కడ చూసినా రైతు దినోత్సవం సంబురంగా సాగింది. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్లో మంత్రి గంగుల కమలాకర్, శంకరపట్నం మండలం కాచాపూర్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గంగాధరలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఆబాది జమ్మికుంట, వీణవంకలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని, దశాబ్ది ఉత్సవ సందేశాన్ని వినిపించారు.
– కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) :తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లాలోని 76 క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ గ్రామాల నుంచి డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, మహిళల కోలాటాలతో రైతులు వేదికల వరకు ర్యాలీగా తరలి వచ్చారు. అనేక గ్రామాల్లో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైక్లతో ర్యాలీలు తీశారు. ఎక్కడ చూసినా ఇదే కోలాహలం కనిపించింది. కుల మతాలకతీతంగా తమదంతా సమైక్య కుటుంబం అన్నట్లు రైతులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా వారితో కలిసి తిన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు తమ పరిస్థితి ఎలా ఉన్నదో.. ప్రస్తుతం ఉన్నదో రైతులు తమ ప్రసంగాల్లో బేరీజు వేసుకున్నారు. నీళ్లు, కరెంట్ లేక, సకాలంలో విత్తనాలు దొరకక, ఎరువుల కోసం అరిగోస పడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, సాగు నీటి సదుపాయం, సకాలంలో అందుతున్న విత్తనాలు, ఎరువుల విషయాన్ని ప్రతి చోటా ప్రస్తావించారు. గతంలో రైతులమని చెప్పుకునేందుకు సంకోచించే వారమని, ఇప్పుడు గర్వగా చెప్పుకుంటున్నామని, సీఎం కేసీఆర్ అండదండలతో రైతులు బాగు పడుతున్నారని తమ అభిమాన నాయకుడిపై ప్రశంసలు కురిపించారు. పలుచోట్ల ఉత్తమ రైతులను సన్మానించారు. మొత్తానికి ప్రతి చోట రైతులు జరుపుకున్న సంబురాలు విజయవంతమయ్యాయి.
దుర్షేడులో మంత్రి గంగుల
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ మండలం దుర్షేడులో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. గోపాల్పూర్ నుంచి పలువురు రైతులతో కలిసి ఎడ్ల బండిపై రైతు వేదిక వద్దరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు డప్పులు, కోలాటాలు, ఒగ్గు కళాకారులు నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ ఉన్నారు. శంకరపట్నం మండలం కాచాపూర్లో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రైతు వేదికను ప్రారంభించారు. గంగాధర మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఆబాది జమ్మికుంట, వీణవంకలో జరిగిన వేడుకల్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పాల్గొన్నారు. చిగురుమామిడి మండల సీపీఐ కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, ఆయన భార్య లంబాడిపల్లె స ర్పంచ్ వకులాదేవి తమ గ్రామం నుంచి ట్రాక్టర్లతో ర్యాలీగా వచ్చి రైతు దినోత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు లు చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు వ్యా ఖ్యానించారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్లో, రామడుగులో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పాల్గొన్నారు.