ఓదెల: వానాకాలం సీజన్ తర్వాత కొత్తగా పట్టా పాసు బుక్కలు పొందిన రైతులకు ఈ యాసంగిలో రైతు బంధుపథకంలో లబ్ది పొందడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు పట్టాదారు పాసు బుక్కు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ ఇటీవల కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు తీసుకున్న రైతులు నష్టపోకుండా రైతుబంధును వినియోగించుకోవాలని దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు.
ఆయా మండలాల్లో సంబంధిత మండల వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి వివరాలు అందిస్తే యాసంగి కాలానికి పెట్టుబడి సహాయం మంజూరు అవుతుంది. గతంలో మాదిరిగానే ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త వారిని నమోదు చేయడంతో పాటు గతంలో తప్పుల కారణంగా రైతుబంధు సహాయం పొందని రైతులు చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వం రైతుబంధు సహాయం మంజూరు చేసేందుకు వీలుగా ఏఈవోలు గ్రామాల వారీగా తిరిగి అర్హులను తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రైతు బంధు పథకం కొత్త రైతులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొత్తగా రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే రైతులు పట్టాదారుల పాస్ బుక్కు, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఏఈవోలకు అందించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.