Rasamayi Balakishan | తిమ్మాపూర్, ఆగస్టు 29 : మానకొండూరు నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఎవరు ప్రశ్నించినా కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. హామీ ఇచ్చిన పనులను చేయాలని కోరితే దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పలు సర్వేల్లో రాష్ట్రంలోనే మానకొండూర్ నియోజకవర్గం ఓడిపోయే మొదటి సీటు అని తేలడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు తోచడం లేదని ఎద్దేవా చేశారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో తాను నిధులు తెచ్చి రోడ్డును ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయడం కూడా చేతకాని ఎమ్మెల్యేగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. రూ.ఐదు కోట్లు పెండింగ్ బిల్లు ఇప్పిస్తే రోడ్డు పూర్తవుతుందని అది కూడా చేతకావడం లేదని అన్నారు. నాడు తనపై యువజన సంఘాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన ఎమ్మెల్యే, నేడు అదే యువజన సంఘాలు చేస్తున్న శాంతియుత ర్యాలీని పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
యువజన సంఘాల ర్యాలీకి పోటీగా ఆయన ఓ ర్యాలీ అదే రోజు చేయడం ఏంటనే ప్రశ్నించారు. ఈ సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని స్పష్టం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు నిరసన తెలిపినా అభ్యంతరం తెలుపలేదని గుర్తు చేశారు. తనపై వస్తున్న విమర్శలకు కిందిస్థాయి క్యాడర్ సపోర్ట్ చేయడం లేదని, దీంతో ఆయన ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఎవరిపైనైనా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. యువజన సంఘాలు చేస్తున్న ర్యాలీని అడ్డుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సతీమణి డాక్టర్ అనురాధ కార్యకర్తలను రెచ్చగొట్టడం సరికాదని పద్ధతి మార్చుకోవాలని హితువు పలికారు. మీరు కాంగ్రెస్ పార్టీలో లేక ముందు నుంచి ఉన్న కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని వారికి ఏం చేశారని ప్రశ్నించారు. వారు ఎందుకు మీకు సపోర్ట్ చేయాలని అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలని అన్నారు.
నేరంలో నిందితుడిగా కండిషన్ బెల్ పై ఉన్న మురళీధర్ రెడ్డి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అందరిని ఎందుకులకు ఒకే రోలు ఎందుకు లేదని ప్రశ్నలు పోలీసులను ప్రశ్నించారు. నేరస్తులకు సపోర్ట్ చేయడం పట్ల సీపీని కలుస్తామని చెప్పారు. తమ కార్యకర్తలు ఒక మెసేజ్ పెడితేనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, నిందితులుగా ఉన్నవారు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే ఎందుకు పట్టించుకోవడంలేదని అన్నారు. కేసులు బెదిరింపులు తూటాలకు భయపడేది లేదని, ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొనే వచ్చామని స్పష్టం చేశారు. మీ తూటాలు మాకు పెప్పర్మెంట్లతో సమానమని అన్నారు. రాజేందర్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, మూడు రోజుల్లో వచ్చిన ఏం చేస్తానన్న ఎమ్మెల్యే ఇప్పటివరకు వెళ్లకపోవడంలో ఆంతర్యం ఏంటని అన్నారు. రాజకీయాలు చేసే డాక్టర్ అనురాధ ఒక మహిళ అయినా రాజేందర్ రెడ్డి భార్య కన్నీళ్లు తుడ్చలేదని ప్రశ్నించాలి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని లేకపోతే తాము కూడా మీ పద్ధతిలోనే వస్తామని స్పష్టం చేశారు.