కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టతనివ్వలేదు. ఎక్కడా కనీస కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాలల వంటి ప్రస్తావనే లేదు. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయించాలన్న విజ్ఞప్తులను ఈసారి కూడా పెడచెవిన పెట్టింది. జాతీయ రహదారులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లావాసులు రైల్వే లైన్ల నిర్మాణంపై పెట్టుకున్న ఆశలను వమ్ముచేసింది. ఏళ్ల తరబడిగా వేతన జీవులు ఆదాయ పన్ను పరిమితి పెంపు విషయంలో పెట్టుకున్న ఆశలను నీరుగార్చింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఈ బడ్జెట్లో నిరాశే మిగలగా, దీనిపై కరీంనగర్ ఎంపీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి!
కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అంటే తొమ్మిదేళ్లుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు అన్యాయమే జరుగుతున్నది. ఈసారైనా బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం దక్కుతుందని అందరూ ఆశించినా ఎప్పటిలాగే నిరాశే మిగిలింది. గతంలో కన్నా దారుణంగా అన్యాయం జరిగినట్లు ఇప్పటివరకు వెలువడిన గణాంకాలు, వివరాలను బట్టి తెలుస్తున్నది. అందుకే ఉమ్మడి జిల్లాకు ఏం కేటాయింపులు జరిగాయన్న విషయంపై ఎంపీ బండి సంజయ్తో సహా బీజేపీ నాయకులెవ్వరూ స్పష్టత ఇవ్వలేక పోతున్నారు.
ప్రధానంగా జిల్లాకు ట్రిపుల్ ఐటీ కేటాయింపు చేయాలని గతంలోనే సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ బడ్జెట్లో కేంద్రం స్పందిస్తుందని ఆశించారు. కానీ ఆ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మెడికల్ కాలేజీ విషయంలోనూ అదే కనిపించింది. ఇవే కాదు, కొత్త జిల్లాలకు నవోదయ కేటాయింపుల విషయాన్ని సైతం విస్మరించింది. వీటితోపాటు ఉమ్మడి జిల్లాను జాతీయ రహదారుల జంక్షన్గా చేయాలని గత ఎంపీ వినోద్కుమార్ విశ్వ ప్రయత్నం చేశారు. ఆ మేరకు నాలుగైదు జాతీయ రహదారులకు ఆయన కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్ సాధించారు.
వాటికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినా, ఇప్పటివరకు అందిన వివరాలను బట్టి చూస్తే నిధుల ఊసే లేదు. కరీంనగర్- హుజూరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి సంబధించి కేంద్రానికి నివేదించామని, ఈసారి నిధులు భారీగా వస్తాయని ఎంపీ బండి స్వయంగా ప్రకటించారు. కానీ, ఈ రహదారికి కూడా ఎంత కేటాయించారన్నది స్పష్టత లేదు. ఇక రైల్వే లైన్ల పరిస్థితి అంతే. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్కు అత్తెసరు నిధులు కేటాయిస్తున్నారు. ఈ సారి ఎక్కువగా నిధులు కేటాయిస్తే పనులు వేగవంతం అవుతాయని అనుకున్నా, ఈ విషయంలోనూ స్పష్టత కొరవడింది. కరీంనగర్-ఖాజీపేట రైల్వేలైన్ విషయంలో అదే పరిస్థితి కనిపించింది. వీటితోపాటు బసంత్నగర్ విమానాశ్రయం ముచ్చటే ఎక్కడా కనిపించలేదు.
వేతన జీవులకు మళ్లీ నిరాశే
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రతి బడ్జెట్లోనూ వేతన జీవులు దగా పడుతూనే ఉన్నారు. ఆదాయ పన్ను పరిమితి పెంచాలని పదే పదే కోరుతున్నా.. కేంద్రం మాత్రం పెడచెవిన పెడుతూ వస్తున్నది. ప్రధానంగా ఈసారి పెంచుతారని ఆశలు పెట్టుకున్నారు. అయితే, 5 లక్షల నుంచి 7 లక్షలకు ఆదాయ పన్ను పరిమితి పెంచినట్లుగా కేంద్రం చెబుతున్నా.. ఆ వెంటనే మళ్లీ స్లాబ్ల రూపంలో కొర్రీలు పెట్టింది. దీంతో వేతన జీవులకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. పొదుపు, స్టాండర్డ్ డిడెక్షన్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపింది. దీంతో వేతన జీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యావసర సరకులు నింగినంటుతున్న తరుణంలో ఆదాయ పన్ను పరిమితి నామ మాత్రంగా పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక సింగరేణి కోసం కొన్ని నిధులు కేటాయిస్తున్నట్లుగా చెప్పిన కేంద్రం, అసలు వారు కోరుతున్న డిమాండ్లను మాత్రం మరిచింది. ముఖ్యంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దని మొత్తుకుంటున్నా.. ఆ విషయంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినా, ఏమాత్రం కనికరం చూపలేదు. బడ్జెట్లో ఎక్కడా ఆ ప్రస్తావన తేలేదు. మొత్తంగా బడ్జెట్ ద్వారా ఉమ్మడి జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యమేననే తెలుస్తున్నది. అయితే బడ్జెట్లో పూర్తిగా చదవాల్సి ఉందని, అప్పుడే ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నిధుల వివరాలు చెబుతామని బీజేపీ నాయకులు మాట దాటవేస్తున్నారు.
దేశ విద్యాభివృద్ధికి విఘాతం
కేంద్ర బడ్జెట్ దేశ విద్యాభివృద్ధికి విఘాతం కలిగించేలా ఉన్నది. నర్సింగ్ కాలేజీల సంఖ్య పెంపుదల, ఏకలవ్య మోడల్ స్కూళ్లలో స్టార్ రిక్రూట్మెంట్ వంటివి మాత్రమే విద్యా వృద్ధికి సరిపోవు. ప్రాథమిక విద్యలో ప్రత్యేకంగా విద్యా ప్రమాణాల స్థాయిలను మెరుగుపరచడంతోపాటు సాంకేతిక, ప్రాజెక్టు ఆధారిత ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రతిష్టాత్మక సంస్థల్లో అధ్యాపకుల కొరత, మరింత మంది విద్యార్థులకు సేవల విస్తరణ వంటి అంశాలు బడ్జెట్లో లేవు. చాలా మంది విద్యార్థులు తమ విద్యా వృద్ధి కోసం అదనపు ఎన్ఐటీ వంటి సంస్థల కోసం చూస్తున్నారు.
ప్రభుత్వ విద్య పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్లో ఎలాంటి చర్యలూ లేవు. దాదాపు 55శాతం విద్యను ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తూ పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రత్యేకించి మహిళలు సొంతంగా నిలబడేందుకు సహాయం చేస్తున్నాయి. అయితే, ప్రైవేటు విద్యాసంస్థలకు మద్దతుగా ఎలాంటి ఉపశమనాలు, చర్యలూ కేంద్రం తీసుకోలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యం, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న అనేక పెండింగ్ సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
– యాదగిరి శేఖర్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం
బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్రం పూర్తి అన్యాయం చేసింది. వారిపై సవతి తల్లి ప్రేమ చూపింది. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ 38 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం మాత్రం దేశవ్యాప్తంగా 15 వేల కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉన్నది. అణగారిన వర్గాలను అవమానపర్చింది. మోదీ పాలనలో అన్యాయం, వివక్ష కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనం. మాటల కోటలు తప్ప నిధుల కేటాయింపులో పాధ్యాన్యం చూపలేదు. ఆ బడ్జెట్ రైతులు, ఉద్యోగులు, ఉపాధిహామీ కూలీలకు వ్యతిరేకంగా ఉన్నది. విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు. ముఖ్యంగా తెలంగాణ కు మొండిచేయి చూపింది. విభజన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు. ఎన్నికలు ఉన్న కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 5300 కోట్లు కేటాయించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించింది. ఆహార సబ్సిడీలు తగ్గించి, ఉపాధిహామీ నిధుల్లో కోత పెట్టడం దారుణం. ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపులు ఆశాజనకంగా లేవు. కేంద్ర బడ్జెట్ను పునఃసమీక్షించాలి.
– మంత్రి కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి)
మరోసారి దగా
తొమ్మిదేళ్ల నుంచి ఆదాయపు పన్ను స్లాబుల్లో పెంపుదల చేయకుండా, పన్ను మినహాయింపుల విషయంలో కేంద్రం ఉద్యోగ వర్గాలను దగా చేస్తూ వస్తున్నది. మధ్యతరగతి ఉద్యోగవర్గాలకు ఊరటనిచ్చే విధంగా ఆదాయ పన్ను స్టాండర్డ్ డిడక్షన్, పొదుపు మొత్తాలను పెంచకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నం. స్టాండర్డ్ డిడక్షన్ను కనీసం రూ.6 లక్షలకు పెంచుతూ పొదుపు మొత్తాలపై మినహాయింపులను రూ.3 లక్షలకు పెంచుతూ సవరణ చేయాల్సింది.
-చందూరి రాజిరెడ్డి, టీఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఏ రంగానికీ మేలు చేయలేదు
ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ఏ రంగానికి కూడా మేలు చేయని విధంగా ఉంది. రైతు, పేద, దళిత వర్గానికి ఎక్కడా ప్రాధాన్యత లేదు. దళితులకు పథకాలు ప్రవేశ పెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కానీ, ఎలాంటి పథకాలు పెడతామనేది స్పష్టం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలా దళితబంధు ప్రవేశ పెడతారని దేశంలోని దళితులంతా ఎదురు చూశారు. కానీ, వాళ్ల ఆశలు నెరవేర్చలేదు. రైతులకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, దేనికి ఇస్తామన్న విషయంలో స్పష్టత లేదు. కనీసం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతున్నట్లు ప్రకటించలేదు. కేంద్ర బడ్జెట్లో పేదల ఊసే లేదు. ఎవరికి ఏం చేస్తామన్న ప్రణాళికే లేదు. కార్పొరేట్ శక్తులకు మేలుచేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉన్నది. అందుకే ఇది పేదల, రైతుల, దళితుల వ్యతిరేక బడ్జెట్గా చెప్పవచ్చు.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
చేనేత, మరనేతన్నపై సవతి ప్రేమ
వస్త్ర పరిశ్రమపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తున్నది. నూలుపై 5 శాతం విధించిన జీఎస్టీని తొలగించాలని పోరాటం చేస్తూనే ఉన్నం. సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్, తెలంగాణకు 8 బ్లాక్ క్లస్టర్లు మంజూరు చేయాలని ఎనిమిదేళ్లుగా చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి, మంత్రులకు పలుసార్లు లేఖలు రాసిన్రు. చేనేత, మరమగ్గాల పరిశ్రమలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నరు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులకు న్యాయం జరగడం లేదు. పైగా విధించిన పన్నులు భారమై పరిశ్రమ నడవలేని పరిస్థితిలో ఉన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు, నూలుపై 50 శాతం రాయితీ, బీమా సౌకర్యం, ఆసరా పింఛన్లు ఇస్తూ అండగా నిలుస్తుంటే, కేంద్రం మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నది. చేనేత, మరమగ్గాల పరిశ్రమను ఆదుకోకుండా అంధకారంలోకి నెట్టివేయడం సరికాదు.
– గూడూరి ప్రవీణ్, తెలంగాణ పవర్లూం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్
ఎరువుల సబ్సిడీకి మంగళం
కేంద్ర బడ్జెట్ రైతులను నిరుత్సాహ పరిచింది. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన ఎరువు బస్తాల సబ్సిడీ కుదించడంతో రైతులపై ఆర్థికంగా భారం పడనుంది. ఫలితంగా సాగు ఖర్చులు పెరుగుతయ్. ఇప్పటికే ఎరువుల బస్తాలపై ప్రతి వారంరోజులకోసారి ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నరు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ, పాలసీపై స్పష్టత లేదు. సాగురంగం కుంటుపడే ప్రమాదమున్నది.
– సామ రవీందర్ రెడ్డి, యువ రైతు, రాంపూర్ (మల్యాల మండలం)
ఆచరణ సాధ్యం కాని బడ్జెట్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణ సాధ్యం కాదు. రాష్ర్టాలతో కలిసి పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమన్న విషయాన్ని కేంద్రం విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నది. ఏ రంగాన్ని కూడా మేలు చేయని ఘోరమైన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర జనరల్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను కలుపడంతో అంతా గందరగోళం నెలకొంది. గత ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణ రాష్ర్టానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో నర్సింగ్ కాలేజీలు ఇస్తామని బడ్జెట్లో చెబుతున్నది. నర్సింగ్ కాలేజీలలోనూ తెలంగాణ రాష్ర్టానికి అన్యాయమే జరుగుతుంది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నా దాని ఊసే లేకుండా పోయింది.
-బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
పెద్దగా ప్రయోజనం లేదు
కేంద్ర బడ్జెట్తో వేతన జీవులలు, మధ్యతరగతి వారికి పెద్దగా ప్రయోజనం లేదు. రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పరిమితి పెంచినట్లు కనిపిస్తున్నా.. మళ్లీ స్లాబ్లు పెట్టడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఏ రంగానికి పెద్దగా ప్రయోజనం చేకూర్చేలా లేదు. ముఖ్యంగా జిల్లాకు రావాల్సిన అనేక రంగాలకు ఒక్క పైసా కేటాయించిన దాఖలాలు లేవు. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు అధిక నిధులు ఇచ్చిన కేంద్రం.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై మాత్రం వివక్ష చూపింది.
– కర్నెబత్తుల వెంకటేశ్వర్లు, టాక్స్ అడ్వొకేట్
ఉద్యోగుల ఆశలపై నీళ్లు
ఇదొక మాయామచ్ఛీంద్ర బడ్జెట్లా ఉన్నది. ము ఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం ఇది ఆశనిపాతం. ఎన్నికల వేళ ఐటీ పరిమితులు పెంచుతారని ఆశించాం. కానీ, ఏ స్పష్టతా ఇవ్వలేదు. మసిపూసి మారేడుకాయ చేసే విధానమే మనకు కనిపిస్తున్నది. పొదుపు, స్టాండర్డ్ డిడెక్షన్ వంటి విషయంలో ఆశించిన దానిలో కొంత మొత్తం కూడాకేంద్ర బడ్జెట్ నెరవేర్చలేదు. ఒకవైపు అల్పాదాయ, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాల ప్రజలపై ధరలు, పన్నుల భారాన్ని పెంచుతూ, మోపుతూ మరోవైపు బడా వ్యాపారవేత్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలి. ప్రధాని మోదీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.
– ప్రతాప్రెడ్డి, మాజీ ప్రధానోపాధ్యాయుడు
నీటిపారుదలపై నిలువెత్తు నిర్లక్ష్యం
కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంటే.. కేంద్రం మాత్రం నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని సాగునీటి రంగానికి ఒక్కపైసా కేటాయింపు చేయకపోవడం వివక్షకు నిదర్శనం. ఇక జాతీయ హోదా గురించి అసలు ప్రస్తావనే లేదు. మిషన్ కాకతీయకు అదనపు నిధులు ఇవ్వాలని కోరినా స్పందించలేదు. మిషన్ భగీరథ వంటి పథకానికి మరింత చేయూతనివ్వాల్సిన కేంద్రం.. మాటలకు మాత్రమే పరిమితమైంది. ఎన్నో రంగాల్లో దేశానికి అదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై కేంద్రం మరోసారి వివక్ష చూపిందని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనం.
-ఈద శంకర్రెడ్డి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
మైనార్టీలపై వివక్ష
కేంద్రం మరోసారి మైనార్టీలపై వివక్ష చూపింది. దేశం లో సామాజిక న్యాయం.. సుపరిపాలన తమతోనే సాధ్యమన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అసంబద్ధంగా ఉన్నది. 2023-24 బడ్జెట్లో.. దేశంలోని మైనార్టీ విద్య, మదర్సాలకు వ్యతిరేకంగా ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వం మైనార్టీ బాలబాలికలకు అందించే స్కాలర్షిప్లను రద్దు చేయడం హేయమైన చర్య. రూ.160 కోట్ల నుంచి రూ.10కోట్లకు కుదించి మైనార్టీలకు వ్యతిరేకంగా వక్రబుద్ధిని ప్రదర్శించడం సరికాదు. మదర్సాలు, మైనారిటీల విద్యా పథకానికి కేటాయింపులో భారీ తగ్గింపు.. ముస్లిం సమస్యలపై అవగాహన లేని స్మృతి ఇరానీ కేంద్ర మై నారిటీ వ్యవహారాల మంత్రిగా ఉండడం దురదృష్టం. ముస్లిం జనాభా దేశం లో 30 కోట్లకు పైగా ఉన్నందున దేశంలో రెండో అతిపెద్ద సామాజిక వర్గానికి నేరుగా అన్యాయం జరిగిందని స్పష్టంగా అర్థమవుతున్నది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ప్రతి సంవత్సరం గొప్ప బడ్జెట్ను ప్రవేశపెట్టి.. పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్న తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ను చూసి ప్రధాని మోదీ నేర్చుకోవాలి. అందుకే సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరం.
– గులాం అహ్మద్ హుస్సేన్, ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు