కలెక్టర్ ఆర్వీ కర్ణన్
బ్యాంకర్లతో సమీక్ష
కరీంనగర్, మార్చి 16 : అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి మంజూరు చేసిన రుణాలు, ఇంకా మంజూరు చేయాల్సిన రుణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2021-22 మూడో క్వార్టర్లో రూ.1860.5 కోట్లు పంట రుణాల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ. 924 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారని, మిగిలిన లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 31వ తేదీలోగా రుణాల మంజూరు లక్ష్యాన్ని బ్యాంకర్లు అధిగమించాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ, వోపీఎస్, టీపీఎస్, ఎన్పీఎస్ పథకాలకు సంబంధించి రూ. 4040.5 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ. 2861 కోట్లు అందజేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. మిగిలిన రుణాలను ఈనెల 31వ తేదీలోగా ఇవ్వాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, డీటీడబ్ల్యూవో, డిసేబుల్డ్, హ్యాండ్లూమ్స్, వీవర్స్, పీఎంఈజీపీ, ఐకేపీ, రూరల్ అండ్ అర్బన్ శాఖలకు సంబంధించి లబ్ధిదారులకు అందజేయాల్సిన వివిధ పథకాల రుణాల లక్ష్యాన్ని కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, కిశోర్, తరుణ్ తదితర పథకాలకు సంబంధించిన రుణాలపై సమీక్షించారు. వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి, స్త్రీనిధి రుణాలను సకాలంలో మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ విజయసారథి, ఆర్బీఐ ఏజీఎం, నాబార్డ్ డీజీఎం, వివిధ బ్యాంకుల మేనేజర్లు, డీఆర్డీవో శ్రీలత, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్, మెప్మా డీఎంసీ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు.