ఎరువుల సరఫరాకు వ్యవసాయ శాఖ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నది. ఎరువుల బస్తాలను సబ్సిడీపై ఇస్తున్న నేపథ్యంలో మరింత పారదర్శకత కోసం ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టం (ఫైవ్స్) పేరిట ప్రత్యేక యాప్ను తెచ్చింది. పంటల నమోదులాగే ఇక నుంచి ఎరువుల షాపును ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, డీలర్కు కేటాయించిన ఎరువులను ఈ- పాస్ ద్వారా అమ్ముతున్నారా.. లేదా అనే విషయాలను నిత్యం పర్యవేక్షించనున్నది. ఎక్కడ తేడా వచ్చినా చర్యలు తీసుకోనుండగా, ఈ ప్రక్రియ బుధవారం కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభమైంది.
కరీంనగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో ఎరువుల సరఫరా, నిల్వలు, పంపిణీ, అమ్మకం అనేది నిరంతర ప్రక్రియ. దీనిని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఫైవ్స్ను ప్రవేశ పెట్టాయి. ఆ మేరకు ఒక ప్రత్యేక యాప్ను తెచ్చాయి. డీలర్లు ఎప్పటికప్పుడు ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్లో నమోదు చేయాలి. ఈ-పాస్ మిషన్లను తప్పనిసరిగా వినియోగించాలి. వీటిపై యాప్లో సూచించిన మేరకు ఎరువుల షాపులను వ్యవసాయశాఖ యంత్రాంగం కూడా తనిఖీలు చేయనున్నది. పంటల నమోదు కార్యక్రమంలాగే ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.
డీఏవో నుంచి ఏవో వరకు అన్ని స్థాయిల్లో అధికారులు తమకు కేటాయించిన దుకాణాలను తనిఖీ చేయనున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ప్రతి ఏడు రోజులకు మూడు దుకాణాలు, డివిజనల్ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు ప్రతి మూడు రోజులకు పది రిటైల్ దుకాణాలు తనిఖీ చేయాలి. వారానికి 20 దుకాణాలు చెక్ చేయాలి. సంబంధిత అధికారులు ఎక్కడెక్కడి దుకాణాలు తనిఖీ చేయాలనేది హైదరాబాద్లోని కమిషనరేట్ నుంచే కేటాయింపు ఉంటుంది. ఆ మేరకు అధికారులు రెండు ప్రధానమైన విషయాలను పరిశీలించాలి. కంపెనీ వచ్చిన ఎరువుల సరఫరా ఈ-పాస్లో ధ్రువీకరించాలి. నిల్వలు, అమ్మకాలు కూడా ఈ-పాస్ ద్వారా జరపుతున్నారా? లేదా? చూడాలి.
ప్రతి డీలర్ దుకాణంలో భౌతిక నిల్వలు ఈ- పాస్లో చూపబడుతున్న నిల్వలతో సమానంగా చూపిస్తున్నారా..? లేదా? అనే విషయాలను పరిశీలించాలి. అందులో రైతుల వివరాలు, వారి భూమి విస్తీర్ణం, ఆధార్ అనుసంధానంతో జరుగుతున్నాయా..? లేదా? అనేది రికార్డుల ఆధారంగా పరిశీలించాలి. రిజిస్టర్లలో సంతకాలు చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ ద్వారా ఎరువులు ఏ దుకాణంలో ఎంత అమ్ముతున్నారు? ఏ దుకాణంలో ఇంకా ఎన్ని నిల్వలు ఉన్నా యి? అనే విషయాలు జిల్లా నుంచి రాష్ట్రం, కేంద్ర స్థాయి అధికారులు కూడా నిత్యం పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఎరువుల అమ్మకాల్లో ఎలాంటి జాప్యం జరిగేందుకు ఆస్కారం ఉండదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన ఈ ఫైవ్స్ విధానాన్ని బుధవారం కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ అధికారులు అమలులోకి తెచ్చారు. డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తనకు కేటాయించిన కరీంనగర్లోని 3 హోల్సేల్ దుకాణాలను తనిఖీ చేశారు. డివిజనల్ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు కూడా తమకు కేటాయించిన 10 దుకాణాల్లో కొన్నింటిని బుధవారం తనిఖీ చేశారు. ఈ విధానంపై డీలర్లకు కూడా అవగాహన కల్పించారు. ఎరువులు సక్రమంగా విక్రయించేందుకు ఈ-పాస్ మిషన్లను తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు డీలర్లకు చెప్పారు.
దుకాణాల్లో ఉన్న నిల్వలు, అమ్మకాలకు వ్యత్యాసం కనిపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని డీఏవో శ్రీధర్ తెలిపారు. ఇక నుంచి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లోనే డీలర్లు ఎరువుల క్రయ, విక్రయాలు జరపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా కంపెనీల నుంచి వచ్చిన ఎరువులను ఈ-పాస్లో నమోదు చేయకున్నా, రైతులకు విక్రయించినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.