Singareni | రామగిరి, జూన్ 2 : రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం జరిగిన ప్రమాదంలో గనిలో విధులు నిర్వహిస్తున్న తుమ్మల సాయి నాథ్ రెడ్డి (జనరల్ అసిస్టెంట్)పై టాప్ పాల్ (గని పైకప్పు భాగం) నుంచి బొగ్గు పెళ్ల కూలి పడటంతో తీవ్ర గాయమైంది. కార్మికుల వివరాల ప్రకారం.. కార్మికుడు భూగర్భ గనిలో తన సాధారణ విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా పైకప్పు భాగం నుంచి బొగ్గు పెళ్ల ఊడి అతని తలపై పడింది.
దీంతో సాయి నాథ్ గాయం కాగా ఘటనను గమనించిన సహచర కార్మికులు వెంటనే అప్రమత్తమై అతడిని సురక్షితంగా గని నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్మికుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రమాద ఘటనపై గని అధికారులు వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టినట్లు సమాచారం. గనుల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ఘటనతో ఏఎల్పీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది.