జూలపల్లి, ఏప్రిల్ 23: ఓ మట్టి ట్రాక్టర్ తొమ్మిదేండ్ల బాలుడిని చిదిమేసింది. వెనుకటైరు కిందపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని కాచాపూర్కు చెందిన బాలసాని రవీందర్, మౌనికకు ఇద్దరు కొడుకులు. రవీందర్ ఆటోనడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. చిన్న కొడుకు జశ్వంత్ (9) స్థానిక శ్రీసాయి వివేకానంద పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో మిత్రులతో కలిసి ఊర చెరువు వద్ద ఉన్న ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం దవాఖానకు తరలించారు. కాగా. విగతజీవిగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం గ్రామస్తులను కలిచివేసింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు జూలపల్లి ఎస్ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.