Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థలు ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది మార్చి 21న జరిగిన మెడికల్ బోర్డు అనంతరం ఇప్పటివరకు కార్మికులకు మెడికల్ బోర్డు జరగలేదని జూన్ లో నవంబర్లో నిర్వహించిన రెండు మెడికల్ బోర్డులు సాధారణ మెడికల్ బోర్డులు కావని ఆయన పేర్కొన్నారు.
గతంలో జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన మెడికల్ బోర్డును కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తిరిగి కొనసాగించి 2018 నుంచి బీఆర్ఎస్ అధికారంలోనున్న కాలంలో దాదాపు 15 వేల మందికి డిపెండెంట్ వారసత్వ ఉద్యోగాలను కల్పించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా ఉన్న వారసత్వ ఉద్యోగాల హక్కును పోగొట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్టీయూసీలు కార్మికుల హక్కుల కోసం పోరాడకుండా మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేయకుండా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని మండిపడ్డారు. కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన మెడికల్ బోర్డు వారసత్వ ఉద్యోగాలను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాలనే డిమాండ్ తో టీబీజీకేఎస్ ముందుకు సాగుతుందని ఈ క్రమంలోనే కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ను కలిసి మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
ఈ విషయంలో యజమాన్యం పట్టించుకోకుంటే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగి ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించే వరకు ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జాతీయ కార్మిక సంఘాల వైఫల్యం వల్లనే గతంలో వారసత్వ ఉద్యోగాల హక్కు హరించిపోయిందని, బీఆర్ఎస్ హయాంలో మాత్రం వారసత్వ ఉద్యోగాలను కల్పించి కార్మికులకు ఎంతో ప్రయోజనం చేశామని రానున్న రోజుల్లో పోరాటాల ద్వారానే ఈ హక్కును సాధించుకునేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మెడికల్ బోర్డు నిలిచిపోయిన ఏడాది కాలంలో దాదాపు 200 మంది కార్మికులు బోర్డుకు హాజరయ్యేందుకు వేచి చూస్తున్నారని, వారికి వెంటనే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే బోర్డు ద్వారా మెడికల్ అన్ ఫిట్ అయిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్పర్యం చేస్తున్నారని వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి నూనె కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.