జగిత్యాల రూరల్, జూన్ 27: ‘మీ కాంగ్రెస్ పాలనలో బీసీల కోసం ఏం చేసిన్రు? కనీసం ఒక్క ఏడాది కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేశారా..? అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లేనేలేదు’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, బీసీ సంక్షేమంపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో బీసీలకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందని, బీసీలకు జరిగిన అన్యాయం ఏంటో ? ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో బీసీ ముఖ్యమంత్రులు ఎందరు పనిచేశారో చెప్పాలని పశ్నించారు. బీఆర్ఎస్ను విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్పైనే సీఎంలు, మంత్రుల పేర్లు ఆధారపడి ఉంటాయని ఎద్దేవా చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల కాలంలో 13.98 కోట్ల నిధులను గంగపుత్ర, ముదిరాజ్లకు ఖర్చు చేసినట్లు చెప్పారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో ఎన్ని నిధులు ఇచ్చారో..? చెప్పాలన్నారు. నియోజకవర్గంలో 4203 మంది గొల్ల కుర్మలకు 85వేల గొర్లు పంపిణీ చేసి, ఉపాధి కల్పించామన్నారు. మత్స్య కారులు, యాదవులను ఏనాడైనా ఆదుకున్నారా..? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పాస్బుక్ ఉన్న రైతులు 49191 మంది ఉన్నారని, ఇందులో 5709 మంది ఎస్సీ రైతులకు ప్రతి విడతలో 3.47 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 2591 మంది ఎస్టీ రైతులకు ప్రతి విడతలో 2.38 కోట్లు అందజేస్తున్నామని, ఎస్సీ, బీసీల అభివృద్ధి కోసం దళిత బందు, బీసీ బందు పథకాలను ప్రవేశపెట్టామన్నారు. ముదిరాజ్ల విషయంలో జీవన్రెడ్డిది కపట ప్రేమ అని, ఎవరు కులాన్ని ద్వేషిస్తూ మాట్లాడినా తప్పే అని చెప్పారు. కౌశిక్ రెడ్డి మాటలను మార్ఫింగ్ చేశారని వారే చెబుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఏబీవీపీ నాయకులు పాఠశాలల బంద్కు పిలుపు ఇవ్వడం బాధాకరమన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆ రాష్ర్టాల్లోని విద్యార్థులు, టీచర్ల రేషియాలో తెలంగాణ కన్నా కింది స్థాయిలో ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాటశాలలో 15 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే యూపీ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 25 మందికి ఒక టీచర్ ఉన్నారని, ఈ విషయాన్ని ఏబీవీపీ నాయకులు గుర్తించాలన్నారు. స్వరాష్ట్రంలో 1750 గురుకుల పాఠశాలలు, జూనియ ర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, ఇందులో 980 పాఠశాలలున్నాయన్నారు. కాం గ్రెస్ పాలనలో ఎన్ని గురుకులాలున్నాయో.. బీసీల కోసం ఆయన ఏం చేశారో జీవన్రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తున్నదని, వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు బాల ముకుందం, కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్, నాయకులు అడువాల లక్ష్మణ్, గాదె కార్తిక్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, విద్యా ర్థి విభాగం అధ్యక్షుడు ఎంఏ ఆరిఫ్ ఉన్నారు.
సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయం
రాష్ట్రంలో సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేసింది. హరిత హారంలో ఈత, తాటి మొకలు నాటడం అభినందనీయం. అన్ని కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. యాదవులకు గొర్లు, గంగ పుత్రులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు.
– డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ (జగిత్యాల)