జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 4: పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్న ఆ తండ్రి, ఆర్థిక ఇబ్బందులు, తన తరపున న్యాయవాది పరిహారం డబ్బులు ఇప్పించడం లేదని మనో వేదన చెందాడు. ఇద్దరు బిడ్డలను బావిలో తోసేసి, తర్వాత తను పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఫంక్షన్కని వెళ్లిన భర్త, ఇద్దరు పిల్లులు ఇలా అనుకోని రీతిలో చనిపోవడంతో ఆ భార్య కన్నీరుమున్నీరైంది. జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ వివరాల తెలిపిన ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్కు చెందిన గడ్డం జలపతి రెడ్డి(40), కవిత దంపతులకు ముగ్గురు కూతుర్లు. జలపతి రెడ్డి కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. 35 ఏండ్ల క్రితం జగిత్యాల పట్టణంలో టీఆర్నగర్ ఏర్పడ్డ సమయంలో జలపతి రెడ్డికి చెందిన భూమిని అప్పటి ప్రభుత్వం సేకరించింది.
నష్ట పరిహారం పూర్తిగా చెల్లించలేదు. అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్లి కేసు గెలిచాడు. ఇది జరిగి ఏండ్లు గడుస్తున్నా డబ్బులు రాలేదు. తన తరపున కేసును వాదించిన ఓ న్యాయవాది నష్టపరిహారం ఇప్పించడం లేదని మనోవేదన చెందుతున్నాడు. అప్పుల బాధతోపాటు పరిహారం రాలేదని ఆందోళన చెందాడు. శుక్రవారం సాయంత్రం జగిత్యాలలో ఒక వివాహానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి రెండో కూతురు మధుమిత (11), మూడో కూతురు ప్రణీత (8)ని వెంట తీసుకొని బయలుదేరాడు. పెద్ద కూతురు తల్లి వద్దనే ఉన్నది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య కవిత తన భర్తకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందింది.
శనివారం ఉదయం పకింటి వారి ద్వారా నర్సింగాపూర్ గ్రామ ఎల్లమ్మ గుడి వద్ద తన అన్న రాజిరెడ్డి వ్యవసాయ భూమిలో జలపతి రెడ్డి మృతదేహం ఉందని తెలుసుకున్నారు. దీంతో అకడికి వెళ్లి చూడగా జలపతి రెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు. ఇద్దరు పిల్లల కోసం చుట్టుపకల వెతకగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహాలు కనిపించాయి. దీంతో ఆమె ఒక్కసారిగా బోరుమన్నది. గుండలవిసేలా రోదించింది. జలపతిరెడ్డి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐతో కలిసి సీఐ కృష్ణకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.