పెద్దపల్లి, జూలై 10 (నమస్తే తెలంగాణ)/రామడుగు/ధర్మారం: ‘బాబ్లీతో ఎడారిగా మారిన గోదావరిని నిండుకుండలా మార్చడం, ప్రాణహిత పరవళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించడం అద్భుతం. అసలు ప్రపంచంలో ఎక్కడా ఇలా ఒక నదిపై బ్యారేజీలు కట్టి, దిగువ నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోయడం గొప్ప ఆలోచన. వానకాలం ఉన్నా లేకున్నా.. సాగుకు, తాగుకు నీళ్లివ్వడం అమోఘం. జల తపస్వి కేసీఆర్తోనే ఇది సాధ్యమైంది’ అని మహారాష్ట్ర ప్రతినిధి బృందం కాళేశ్వరం ప్రాజెక్టును చూసి అన్న మాటలివి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లింక్-2 పెద్దపల్లి జిల్లా నంది మేడారంలోని నంది పంపుహౌస్, రామడుగు మండలం గాయత్రీ పంపు హౌస్లను సోమవారం మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భానుదాస్ మారుటే, అహ్మద్ నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అరుణ్ కదూ, ఎన్సీపీ నేత బాలాసాహెబ్ విఖేపాటిల్తో పాటు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నసాహెబ్ మనే, ఘనష్యాం అన్నా షెలార్, ప్రహ్లాద్ రాథోడ్, శరద్ పవార్, బాల సాహెబ్, అరుణ్ కొడు, ఏకనాథ్ గోగాడే పరిశీలించారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఈ బృందం ఆదివారం లింక్-1లోని పంపు హౌస్లు, బ్యారేజీలను సందర్శించి నంది పంప్హౌస్ వద్ద ఉన్న నవయుగ అతిథి గృహంలో బస చేశారు. సోమవారం ఉదయం, మధ్యాహ్నం లింక్-2 పరిధిలోని నంది, గాయత్రీ పంప్ హౌస్లను పరిశీలించారు. స్థానిక పంపుహౌస్కు చేరుకున్న నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ముందుగా అతిథులకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణాలను మ్యాపుల ద్వారా వివరించారు. ప్రొజెక్టర్ ద్వారా వివరిస్తూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టతో పాటు మేడిగడ్డ నుంచి మొదలు అన్ని ప్యాకేజీల్లోని పంపుహౌస్ల ద్వారా వెళ్లే జలాలను చూపించారు. మోటర్ల ద్వారా జాలాలు ఎత్తిపోయడాన్ని ప్రత్యక్షంగా చూపించారు. లిఫ్టుద్వారా పంపులవద్దకు చేరుకొని బాహుబలి పంపులను చూసి మురిసిపోయారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రతినిధులు అబ్బురపడుతూ ఇంత పెద్ద పంపులను చూడడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. బ్యారేజీలు, పంపు హౌస్లు, కాల్వలు, అండర్ టన్నెళ్లను చూసిన వారు ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడమని కొనియాడారు. 32 దేశాలను తిరిగిన తాను ఇలాంటి మానవ నిర్మిత అద్భుతాన్ని ఎకడా చూడలేదని మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భానుదాస్ మారుటే అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని ప్రశంసించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును కళ్లారా చూసిన తన జన్మ ధన్యమైందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణ సాగుభూములకు నీటిని అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత సీఎం కేసీఆర్ దార్శనికత నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నదని కొనియాడారు