Dharmapuri | ధర్మపురి, మార్చి 7 : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒక మూడేళ్ల చిన్నారి భక్తి పారవశ్యంలో ఉపవాస దీక్ష చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చిన్న వయసులోనే మతపరమైన ఆచారాల పట్ల ఆసక్తి చూపుతూ, కుటుంబసభ్యులతో కలిసి ఉపవాసం పాటించేందుకు ఆ చిన్నారి పట్టుదల చూపింది. ఇంట్లో పెద్దలు రంజాన్ ఉపవాసం పాటిస్తూ నమాజ్ చేస్తున్న తీరు చూసి ప్రేరణపొందిన ఆ చిన్నారి కూడా తానూ ఉపవాసం ఉంటానని పట్టుదలగా చెప్పింది.
ధర్మపురికి చెందిన మాజిద్-నిషా దంపతుల నాలుగో సంతానంగా అమైరా జన్మించింది. ఇప్పుడు అమైరా వయసు మూడేళ్లు. మూడేళ్ల వయసున్న చిన్నారి ఉపవాస దీక్షకు మొదట కుటుంబసభ్యులు చిన్నారి వయసును దృష్టిలో ఉంచుకొని నిరాకరించినప్పటికీ, ఆమె పట్టుదల చూసి కొంత సమయం పాటు ఉపవాసం ఉండేందుకు అనుమతించారు.
పెద్దలతో సమానంగా ఉపవాస దీక్షతో పాటు పెద్దలతో కలిసి రోజుకు ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తున్నది. చిన్నారి భక్తి. ఆచరణ చూసి కుటుంబసభ్యులు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే మతపరమైన విలువులు అలవాటు కావడం అనందకరమని పలువురు పేర్కొంటున్నారు. రంజాన్ మాసం భక్తి, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పచిత్ర కాలంలో చిన్నారి చూపుతున్న భక్తి భావం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆదర్శంగా నిలుస్తోంది.