ధర్మపురి, అక్టోబర్ 19: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు శనిలా దాపురించినయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కొత్త ఎత్తుగడలతో వస్తున్నయి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నయి. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నయి. వాళ్లను నమ్మొద్దు. నమ్మితే మోసపోవుడు ఖాయం. అప్రమత్తంగా లేకపోతే గోసపడుతం’ అంటూ మంత్రి ఈశ్వర్ కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. గురువారం ధర్మపురి మండలం ఆరెపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు 70 మంది కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల కార్డు ఓ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్కులాంటిదని ఎద్దేవా చేశారు. వాళ్లను నమ్మితే తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుందని, నాడు ఏండ్ల కొద్ది పాలించి ఏం చేశారో మనం చూడలేదా..? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే పునాది అని, సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలని సూచించారు. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ రూపొందించిన మ్యానిఫెస్టో పేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఇందులో ప్రధానంగా అర్హులైన మహిళలకు 3వేల భృతి, 400కే వంటగ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 5లక్షల నుంచి 15లక్షలకు పెంచడం, తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్లు పెంచడం, పేద కుటుంబాలకు 5లక్షల బీమా, రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం పెంచడం లాంటి పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి ఈశ్వర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. సర్పంచ్ బోర్లకుంట కమల-రాజన్న, ఎంపీటీసీ కుంబాల రవిత-రమేశ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అద్యక్షుడు పిస్కతిరుపతి, బీఆర్ఎస్ నాయకులు రేగొండ మహేశ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు చెప్పారు.