నిరుపేద దళితులకు తెలంగాణ సర్కారు ఆర్థిక భరోసానిస్తున్నది. చిరువ్యాపారాల స్థాపనకు కుటీర వ్యాపార పథకం కింద ఒక్కొక్కరికి 50వేలు అందిస్తూ అండగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ స్కీం (పెట్టి) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 124 మందికి 62 లక్షల విలువైన చెక్కులు అందజేసింది. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి అమాత్యుడు రామన్న చెక్కులు అందించారు. వీటిని అందుకొన్న లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలారు. పూర్తి సబ్సిడీపై ఆర్థిక సాయం చేసిన సర్కారుకు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ నగదుతో తమకు నచ్చిన చిరు వ్యాపారాలు పెట్టుకుంటామని పేర్కొన్నారు. నిరుపేదలకు చేయూతనిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు మనసారా కృతజ్ఞతలు చెప్పారు.
సెల్ఫోన్ రిపేరింగ్ షాపు పెట్టుకుంట
మా అమ్మ బట్టలు కుడుతది. వచ్చిన పైసలతోని మా ఇద్దరి అన్నదమ్ములను చదివించింది. నేను ప్రస్తుతం కారు డ్రైవింగ్ చేస్తున్న. మొబైల్ రిపేరింగ్ కూడా నేర్చుకున్న. కానీ, డబ్బులులేక షాపు పెట్టుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం 50వేలు ఇచ్చింది. ఈ పైసలతో సెల్ఫోన్ రిపేరింగ్ షాపు పెట్టుకుంట. పేదలకు మేలు చేస్తున్న కేటీఆర్ సారును మరువం.
– లింగంపల్లి. అనిల్కుమార్, రామరావుపలి,్ల (చందుర్తి)
కుట్టుమిషిన్లు కొనుక్కుంట.
మా ఆయన పదేండ్లు గల్ఫ్ దేశానికి వెళ్లిండు. రెండేండ్ల సంది ఎల్లారెడ్డిపేటలో పంక్చర్ రిపేర్ షాపు నడుపుతున్నడు. నేను ఇంట్లోనే బట్టలు కుట్టుకుంట. పైసలకు మస్తు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుతం 50 వేలు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఈ పైసలతో మిషిన్లు కొనుక్కొని టైలరింగ్ షాపు పెట్టుకుంట. మరికొంతమంది మహిళలకు బట్టలు కుట్టడం నేర్పిస్త.
– అంబటి పద్మ, నారాయణపూర్ (ఎల్లారెడ్డిపేట)
కిరాణ దుకాణం పెట్టుకుంట
మా ఆయన వ్యవసాయం చేస్తడు. నేను టైలరింగ్ పనిచేస్త. ఇప్పుడు ప్రభుత్వం 50 వేలు పూర్తి సబ్సిడీపై అందించింది. ఈ నగదుతో కిరాణా దుకాణం పెట్టుకుంట. మాలాంటి పేదల అభివృద్ధికి సాయం చేస్తున్న సర్కారుకు రుణపడి ఉంట. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారుకు నా కృతజ్ఞతలు.
– అచ్చు శృతి, తాడురు (తంగళ్లపల్లి)
జ్యువెల్లరీ షాప్ పెడుత
మాది నిరుపేద కుటుంబం. ఇద్దరు బిడ్డలు. నా భర్త సెంట్రింగ్ పని చేస్తడు. నేను బీడీలు చుడుత. కాయకష్టం చేసి బిడ్డలను చదివించుకుంటున్నం. ఇప్పుడు ప్రభుత్వం 50వేలు మంజూ రు చేసింది. మంత్రి కేటీఆర్ చేతులమీదుగా చెక్కు అందుకున్న. ఆనందంగా ఉన్నది. ఈ డబ్బులతో మాఊరిలోనే జ్యువెల్లరీ షాప్ పెట్టాలని అనుకుంటున్న.
– బోల్లరాం దీపిక, తంగళ్లపల్లి
మాకు ఆర్థిక భరోసా
నేను, నా భర్త వ్యవసాయ కూలీ పనులకు వెళ్తం. మా సంపాదన అంతంతే. ఇప్పుడు మగ్గం వర్క్కి మంచి డిమాండ్ ఉన్నది. అందుకే ఈ పథకంలో లోన్ పెట్టుకున్నం. ఈ రోజు పంపిణీ చేసిన డబ్బులతో మగ్గం వర్క్ యూనిట్ పెట్టుకుంట. మరికొంత మందికి నేర్పిస్త. సర్కారు చేసిన సాయంతో ఆర్థికంగా మాకు భరోసా దొరికింది.
– ఎం దీప, తుర్కపల్లి, (ముస్తాబాద్)
సర్కారును మరువం
నేను అప్పుతెచ్చుకొని ఏడాది కిందట చికెన్ సెంటర్ పెట్టుకున్న. మా ఏరియాలో చాలా బాగా నడుస్తున్నది. కానీ, చికెన్ దుకాణం నిర్వహణకు సరిపడా డబ్బులు లేకా చాలా ఇబ్బందులు పడ్డం. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులతో చికెన్ సెంటర్ అభివృద్ధి చేసుకుంట. సాయం చేసిన సర్కారును యాది మరువం.
– కలికోట విజయ్, సుభాష్నగర్ (సిరిసిల్ల)