గిరిజనం నవ్వుతున్నది. సాకారమైన ఆత్మగౌరవ, స్వయం పాలన కలతో మురిసిపోతున్నది. దశాబ్దాలుగా పరాధీనంలో మగ్గుతూ, పల్లెలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలు, గూడేలను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎస్ సర్కారు ఉమ్మడి జిల్లాలో 53 తండాలను పంచాయతీలుగా మార్చడం, పదవులు కట్టబెట్టడంతో నవశకం మొదలైంది. అప్పటిదాకా రోడ్లు లేక, అభివృద్ధి కానరాక, ఏ ఒక్క మౌలిక వసతి లేక చీకట్లో మగ్గిన, తండాలు ప్రగతిబాట పట్టాయి. ఇంకా గిరిజన సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోటా పెంచడం, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మద్యం షాపుల్లో గిరిపుత్రులకు ప్రత్యేక కోటా ఇవ్వడం, సాగునే నమ్ముకున్న వారికి పోడు హక్కులు కల్పించనుండడంతో గిరిజనులు, ఆదివాసీలు, బంజారాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– కరీంనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ): ఎన్నో దశాబ్దాల అణచివేతకు, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన గిరిజనులు, ఆదివాసులు, బంజారాలు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కోటాను పెంచడం, చదువుకునేందుకు పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, మండల, జిల్లా పరిషత్లో రిజర్వేషన్లను కల్పించి, పదవుల్లో అవకాశం ఇచ్చింది. అలాగే వారికి స్వయంపాలన అందించేందుకు గిరిజన గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వారి దశాబ్దాల కలను సాకారం చేసి రాజ్యాధికారం కల్పించింది.
భీంరెడ్డి గూడెం దశ తిరిగింది..
అది సారంగాపూర్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ రేచపల్లి. దాదాపు 4వేల జనాభా ఉంటుంది. మండల కేంద్రానికి దూరంగా పూర్తిగా అటవీ ప్రాంతంలోనే ఉంటుంది. అయితే రేచపల్లికి అనుబంధంగా నాలుగు తండాలు భీంరెడ్డి గూడెం, ధర్మానాయక్ తండా, మ్యాడారం తండా, లచ్చానాయక్ తండాలు ఉండేవి. దీంతో ఈ గ్రామ జనాభా అధికంగా ఉండేది. ఈ తండాల్లో అందరూ గిరిజనులే. వీరికి ఏ అవసరం వచ్చినా రేచపల్లికి రానిదే పనికాకపోయేది. దీనికి తోడు ప్రధాన గ్రామం కాకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వీరి సమస్యలను అంతగా పట్టించుకునేవారు కాదు. ఇలా ఒకటికాదు రెండు కాదు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతూనే వచ్చారు. అయితే స్వరాష్ట్రంలో వీరి ఏండ్లనాటి కల నెరవేరింది. గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కనీసం 500 జనాభా అన్న విధానానికి సీఎం కేసీఆర్ స్వస్తి పలికి గిరిజన తండాలన్నింటినీ పంచాయతీలుగా మార్చడంతో ఈ నాలుగు తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి.
నాలుగేండ్లుగా స్వయం పాలనలో ప్రగతిబాట పట్టి పరుగులు తీస్తున్నాయి. ఇందులో 60 ఇండ్లతో, 232 జనాభా, 162 ఓట్లతో ఉన్న భీంరెడ్డిగూడెం ప్రత్యేక గ్రామంగా మారిపోయింది. గతంలో రేచపల్లి నుంచి ఈ గూడేనికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. పంచాయతీగా ఏర్పడిన తర్వాత 1.21 కోట్లతో తారు రోడ్డు వేయడం, ప్రతి నెలా జనాభాకు అనుగుణంగా పల్లె ప్రగతి నిధులు, ఫైనాన్స్ నిధులు మంజూరవుతుండడంతో ఈ గ్రామం దశ తిరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం కోసం ట్రాక్టర్ కొనుగోలు చేశారు. రెండు ఆటోలు వచ్చాయి. నర్సరీని ఏర్పాటు చేశారు. 1.50కోట్లతో కమ్యునిటీ హాల్ నిర్మించారు. వైకుంఠధామం ఏర్పాటు చేశారు. డంప్ యార్డు రూపుదిద్దుకున్నది. అంతర్గతంగా గ్రామంలో 10లక్షలతో వీధివీధినా సీసీరోడ్లతో అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిపోయింది.
మా గూడెం రూపురేఖలే మారిపోయాయి
గ్రామ పంచాయతీగా మారడంతో ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు మా గ్రామానికి వచ్చాయి. గతంలో ఏ చిన్న పని ఉన్నా రేచపల్లిలోని గ్రామ పంచాయతీకి వెళ్లాల్సి వచ్చేది. చాలా ఇబ్బందయ్యేది. ఇంకా మా గ్రామంలో పనులు కూడా చేసేవాళ్లు కాదు. కనీసం వీధి దీపాలు లేకపోతుండె. సమస్యలు పరిష్కరించాలని చీటికిమాటికి ఊళ్లెకు పోవాల్సి వచ్చేది. కానీ వాళ్లు మమ్ముల దూరం పెడుతుండె. కానీ సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం జనాభాతో సంబంధం లేకుండా పంచాయతీగా మార్చడంతో మా గూడేనికి మంచిరోజులు వచ్చాయి. ఇప్పుడు అధికారులే మా దగ్గరికి వస్తున్నరు. అన్ని వసతులు ఊళ్లెకు వచ్చాయి. సీసీ రోడ్లు, మురుగు కాలువలు వేసుకుంటున్నాం. ఉన్నంతలో అంతా బాగుంది.
– మైనేని బుచ్చిమల్లు, సర్పంచ్ (భీంరెడ్డిగూడెం)
అభివృద్ధి, సంక్షేమం
ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చడంతో వాటి దశ మారిపోయింది. పల్లె ప్రగతి కింద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నెలనెలా నిధులు ఇస్తుండడంతో పల్లె ప్రకృతి వనాలు, డంప్యార్డ్, వైకుంఠధామాలు సహా అధునాతన వసతులు సమకూరాయి. ఇన్నాళ్లూ ఉన్న మట్టి రోడ్లన్నీ బీటీ దారులుగా మారాయి. ఇంకా ప్రతి జీపీకి ట్రాక్టర్ కూడా ఇవ్వడంతో పచ్చదనం, పరిశుభ్రతలో మేటిగా నిలుస్తున్నాయి. ఇంకా గిరిజనుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేయగా, వారి పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేసింది. ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే వారికి ఒక్కొక్కరికీ రూ.20లక్షల చొప్పున సాల్కర్షిప్ సైతం అందజేస్తున్నది.
గిరిజనుల్లో పోషకాహారం నివారించేందుకు గిరి పోషణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సీఎంఎస్టీ ఎంటర్ ప్రిన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ)లో ఈ పథకం కోసం ఎంపికైన అర్హులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నది. పోడు సమస్యకు పరిష్కారం చూపూతూ త్వరలో పోడుపట్టాల పంపిణీ చేపట్టనున్నది. ఎస్టీల నివాస గృహాలకు 101 యూనిట్ల విద్యుత్ అందిస్త్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అన్ని కులాల మాదిరి ఆదివాసీ, జంజారాలకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇచ్చింది. ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఆదివాసీ గిరిజన జాతరలు, ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతులను అధికారికంగా నిర్వహిస్తున్నది. దక్షిణాది కుంభమేళగా పేరుగాంచిన, ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతరతో పాటు, నాగోబా జాతర, జంగుబాయి జాతర, బౌరంపూర్, ఎరుకల నాంచారమ్మ, గాంధారి మైసమ్మ తదితర జాతరలను అధికారికంగా నిర్వహిస్తున్నది.
అక్షయ ఎస్టీ మహిళా సర్పంచ్
ఈ చిత్రంలో కనిపిస్తున్నది భర్మావత్ అక్షయ. కరీంనగర్ జిల్లాలోని ఇద్దరు ఎస్టీ మహిళా సర్పంచుల్లో ఈమె ఒకరు. సైదాపూర్ మండలంలో కొత్తగా ఏర్పడిన రాయికల్ తండాకు మొదటి సర్పంచ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంటర్ దాకా చదివిన అక్షయ ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎస్టీ ఓటర్లుగా ఉన్న ఏకైన తండా రాయికల్ కావడంతో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం అందుతున్నది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం అట్టహాసంగా ప్రారంభించుకుంటున్నారు. గతంలో మూడు గ్రామ పంచాయతీల పరిధిలో మూడు తండాలుగా ఉన్న రాయికల్ తండాను ఒకటి చేసి, 2016లో ప్రత్యేక జీపీగా ఏర్పాటు చేసిన తర్వాత అక్షయ చెప్పుకోదగిన రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే మూడు తండాల్లో 40 లక్షలు వెచ్చించి ప్రతి వీధిలో సీసీ రోడ్లు నిర్మించారు.
ఇంకుడు గుంతల నిర్మాణంలో కూడా ఈ తండా ఆదర్శంగా నిలిచింది. స్థానికులను చైతన్య పర్చి 102 ఇంకుడు గుంతలు నిర్మించారు. గతంలో ఈ మూడు తండాల ప్రజలు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకునేవారు. ఇప్పుడు స్థానికంగా ఏర్పాటైన దుకాణంలోనే రేషన్ తెచ్చుకునేలా రేషన్ తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా కొత్త పంచాయతీగా ఏర్పడిన తర్వాత ఈ చిన్న తండాలో ఇప్పటి వరకు 11 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఒక వైకుంఠధామాన్ని, సెగ్రిగేషన్ షెడ్డు వంటి అనేక సదుపాయాలు కల్పించుకున్న ఈ గిరిజన గ్రామాన్ని సర్పంచ్ అక్షయ తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా 2.90 కోట్లతో మూడు తండాలను కలుపుతూ 3.9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. తన హయాంలో మా తండా ఈ విధంగా అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందని సర్పంచ్ అక్షయ చెబుతున్నారు. ఎస్టీ మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, నాడు ఉద్యమనేతగా ఇచ్చిన హామీలను స్వరాష్ట్రంలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా తండాలు, అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా మార్చి, ఎన్నో ఏండ్ల కలను సాకారం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52 తండాలను పంచాయతీలుగా మార్చి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. అనుకున్నట్టే వారికి రిజర్వేషన్లు కల్పించి, రాజ్యాధికారం అప్పగించడంతో తండాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. దశాబ్దాల నాటి కష్టాలు, కన్నీళ్లను దూరం చేసుకొని సకల వసతులతో ఆదర్శంగా నిలుస్తున్నవి.
నేడు చిత్రవేణి గూడెంలో ఆదివాసీ భవన్ ప్రారంభం
సారంగాపూర్, జూన్16 : బీర్పూర్ మండలంలోని చిత్రవేణి గూడెంలో కొత్తగా నిర్మించించిన ఆదివాసీ భవన్ను శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించనున్నట్లు సర్పంచ్ చిక్రం సుగుణమారుతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆదివాసీ భవన్ వద్ద ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేపట్టారు. రూ.19.10 లక్షలతో ఆదివాసీ భవనం నిర్మాణం పూర్తయిందని, ఈ భవన నిర్మాణానికి గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5.60 లక్షలు మంజూరు చేశారని, జగిత్యాల ఎమ్మెల్యే సహకారంతో రూ.10 లక్షలు మంజూరైనట్లు చెప్రాఉ. గ్రామస్తులంతా కలిసి మరో రూ.3.50 లక్షలు జమ చేసి, భవన నిర్మాణానికి ఖర్చు చేసినట్లు వివరించారు.
పండుగలు, జాతరలకు పెద్దపీట
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు ఆస్తిత్వం కోసం జరిగింది. అలాంటి పోరాటాల నుంచి వచ్చిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సబ్బండవర్గాల పండుగలు, జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, నిధులు కూడా వెచ్చిస్తున్నది. అన్ని కులాల మాదిరి ఆదివాసీ, జంజారాలకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇచ్చింది. ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఆదివాసీ గిరిజన జాతరలు, ఆదివాసీ యోధుడు కుమ్రం భీం, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నది. దక్షిణాది కుంభమేళగా పేరుగాంచిన, ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతరతోపాటు, నాగోబా జాతర, జంగుబాయి జాతర, బౌరంపూర్, ఎరుకల నాంచారమ్మ, గాంధారి మైసమ్మ తదితర జాతరలను అధికారికంగా నిర్వహిస్తున్నది.
తొలగనున్న పోడు చిక్కులు
దశాబ్దాల తరబడి ఫారెస్టు అధికారులు, పోడు రైతుల మధ్య ఆరని చిచ్చుగా ఉన్న పోడు సమస్యను పరిష్కరించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసి విధివిధానాలు ఖరారు చేసి పోడు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సాంకేతికత ఆధారంగా శాటిలైట్ సాయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి, గ్రామసభల ద్వారా పోడు సమస్యలు పరిష్కరించి, అర్హులైన పోడు రైతులకు పట్టాలు అందించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని వందలాది మందికి త్వరలోనే పట్టాలు అందించనుండగా గిరిజనుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.