రామడుగు, మార్చి18 : కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని, మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ రామడుగు మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పలువురు విలేకరులు శనివారం మర్యాదపూర్వకంగా కలువగా రైల్వే లైన్ విషయంపై చర్చించారు. ఈ రైల్వేలైన్ను పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు అందించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలూ కృషి చేస్తున్నదని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో రైల్వే లైన్ చేపట్టాలన్నా దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను అందిస్తుందని, కానీ కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వమే 50 శాతం నిధులను వెచ్చించి రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని తీసుకొచ్చి పనులను ప్రారంభించామని గుర్తు చేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైల్వేలైన్కు కావలసిన భూసేకరణ పూర్తిచేసి రైల్వేశాఖకు అప్పగించినట్లు చెప్పారు. వేములవాడ సమీపంలో భూ సేకరణ సాంకేతిక సమస్యతో కొంత ఆలస్యమైనా, దానిని అధిగమించినట్లు తెలిపారు. రెండు నెలలుగా నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుందన్నారు. ఈ లైన్ పూర్తయి ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తే కరీంనగర్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అహర్నిశలూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వేశాఖ అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కలలుగన్న రైల్వేలైన్ చివరిదశకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.